మెదక్, మే 10 (నమస్తే తెలంగాణ): వానకాలంలో సరిపడా ఎరువులను అందుబాటులో ఉంచేందుకు ముందస్తు ప్రణాళిక చేసుకుని, సరఫరాకు సిద్ధంగా ఉండాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా వ్యవసాయాధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఎరువులను సరఫరాకు ముందస్తు ఏర్పాట్లపై వ్యవసాయ శాఖ, మార్ఫెడ్, ఆగ్రోస్, ప్రాథమిక సహకార సంఘం అధికారులు, ఫర్టిలైజర్ దుకాణాదారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్ రమేశ్తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వానకాలంలో యూరియా, డీఏపీ, కాంప్లెక్స్, ఎంవోపీ, ఎస్ఎస్పీ వంటి రసాయన ఎరువులు 96,340 మెట్రిక్ టన్నులు అవసరమవుతాయని అంచనా వేసినట్లు తెలిపారు. రైతులకు ఎరువుల కొరత రాకుండా మే నుంచి సెప్టెంబర్ వరకు నిర్దేశించుకున్న లక్ష్యానికి అదనంగా పది శాతం స్టాకుతో ఎరువులు సరఫరా చేసేందుకు సంస్థలు సిద్ధంగా ఉండాలన్నారు. ఎరువులను ఎమ్మార్పీకే విక్రయించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. రైల్వే మార్గం ద్వారా మెదక్, తిమ్మాపూర్, గజ్వేల్, సనత్నగర్, కామారెడ్డి రేక్ పాయింట్ల నుంచి వచ్చే ఎరువులు భద్రపరిచేందుకు గోదాములు సిద్ధంగా ఉచుకోవాలన్నారు. రామాయంపేటలో వెయ్యి టన్నుల సామర్థ్యం గల గోదాంను సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఎరువుల్లో 40 శాతం మార్క్ఫెడ్ ద్వారా సొసైటీలు, 40 శాతం ప్రైవేట్ డీలర్లకు, 20 శాతం 37 ఆగ్రో రైతు సేవా కేంద్రాలకు సరఫరా చేయాలన్నారు. జిల్లాలో పాక్స్, డీసీఎంఎస్, ఏఆర్ఎస్కే, హకా, రైతు ఉత్పత్తి సంఘాలు, హోల్ సేల్, రిటైల్ ఎరువుల డీలర్లు మొత్తం 259 ఉన్నాయని, వారంతా ప్రతి నెలా డిమాండ్కు అనుగుణంగా రైతులకు సరఫరా చేసేలా స్టాక్ అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు.
నిరంతర పర్యవేక్షణ
ప్రాథమిక సహకార సంఘాలు, ఎరువుల దుకాణాలు, ఆగ్రో రైతు సేవా కేంద్రాలను వ్యవసాయ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. తనిఖీ చేస్తూ ఎరువుల చట్టం ప్రకారం నిబంధనలు పాటిస్తూ ముందస్తుగా నిల్వ ఉంచుకుని రైతులకు సకాలంలో అందించేలా పర్యవేక్షించాలన్నారు. ఫర్టిలైజర్ మానిటరింగ్ సిస్టంలో ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని, తద్వారా స్టాక్ వివరాలతో పాటు ఇంకా కావాల్సిన ఎరువులు తాజా స్థితి తెలుస్తుందని అన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి ఆశాకుమారి, జిల్లా సహకార అధికారి కరుణ, మార్ఫెడ్ జిల్లా మేనేజర్ క్రాంతి, ఆగ్రో రైతు సేవా కేంద్రం, ప్రాథమిక సహకార సంఘాల చైర్మన్లు, సీఈవోలు, వివిధ డివిజన్లకు సంబంధించిన సహాయ వ్యవసాయ సంచాలకులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
టీఎస్పీఎస్ గ్రూప్-1 పరీక్షకు సిద్ధంగా ఉండాలి
మెదక్ మున్సిపాలిటీ, మే 10: తెలంగాణ పబ్లిక్ కమిషన్ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను జూన్ 11న సజావుగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణపై ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో అదనపు కలెక్టర్ రమేశ్తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే నెల 11న నిర్వహించే గ్రూప్ 1 పరీక్షకు 3,690 అభ్యర్థులను కేటాయించే అవకాశం ఉన్నదని, అందు కు కేంద్రాలను గుర్తించి చీఫ్ సూపరింటెండెట్లు, ఇన్విజిలేటర్లను నియమించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బఫర్గా 20 శాతం ఇన్విజిలేటర్లను అదనంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. పరీక్షా కేంద్రాల్లో భవన లీకేజీలు ఏమైనా ఉంటే ముందే గుర్తించి మరమ్మతులు చేపట్టాలన్నారు. సీసీ కెమెరాల నిఘాలో పరీక్ష నిర్వహించాలని, ప్రతి కేంద్రంలో డ్యూయల్ డెస్క్లు ఉండేలా చూడాలని, నిరంతర విద్యుత్తు, మంచి నీటి సౌకర్యం ఉండేలా తహసీల్దార్లు ప్రతి గదిని పర్యవేక్షించి నివేదిక ఇవ్వాలన్నారు. పరీక్షా కేంద్రానికి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతించొద్దన్నారు. అభ్యర్థులు కానీ, సిబ్బంది కానీ తమ వెంట తీసుకురావద్దని కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో డీఈవో రాధాకిషన్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, ఆర్డీవోలు సాయిరాం, శ్యామ్ప్రకాశ్, తహసీల్దార్లు శ్రీనివాస్, ఆంజనేయులు, జ్ఞానజ్యోతి, కలెక్టరేట్ ఏవో యూనూస్ తదితరులు పాల్గొన్నారు.