విష ప్రచారాన్ని దీటుగా తిప్పికొట్టి మెదక్లో మరోమారు గులాబీజెండాను ఎగురవేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం, మెదక్ పట్టణం, రూరల్, చిన్నశంకరంపేటలో బుధవారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. పదేండ్ల కిందట మెదక్ జిల్లా ఎట్లుండేది, ఇప్పుడు ఎట్లున్నది అనేది ఆలోచించి ఓటేయాలని సూచించారు. కాంగ్రెస్కు ఓటేస్తే కరెంటు కష్టాలు తప్పవన్నారు. కేసీఆర్ పాలనలో కరువు లేదు.. కర్ఫ్యూ లేదన్నారు. కేసీఆర్ రైతులకు రైతుబంధుతో పెట్టుబడి సాయం కోసం అందిస్తున్నారన్నారు. బీజేపీ, కాంగ్రెసోళ్ల కల్లబొల్లి మాయమాటలు నమ్మి మోసపోవద్దన్నారు. మెదక్ అభివృద్ధి కేవలం బీఆర్ఎస్తోనే సాధ్యమని, ఎవరెన్ని ట్రిక్కులు చేసినా కేసీఆర్ మరోమారు సీఎంగా హ్యాట్రిక్ కొట్టడం ఖాయం, ఎమ్మెల్యే కూడా మన పార్టీ వాళ్లే ఉంటే మరింత అభివృద్ధి చేసుకోవచ్చని సూచించారు.
మెదక్ అర్బన్, నవంబర్ 1: కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదని, తెలంగాణ రాకుంటే మెదక్ జిల్లా అయ్యేది కాదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. బుధవారం మెదక్ పట్టణం, మెదక్ రూరల్, హవేళీఘనపూర్ మండల్లాలో కార్యకర్తలతో ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో మంచి నిర్ణయం తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో వచ్చేది పక్కగా బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. పార్టీ అనేది తల్లి లాంటిదని, దాన్ని ప్రతి కార్యకర్త కాపాడుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే మన పంటలకు నీళ్లు వచ్చేవా, నీళ్ల కోసం పడ్డ కష్టాలు తొలిగిపోయేవా అని ప్రశ్నించారు. కర్ణాటకలో అక్కడి రైతుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లయ్యిందన్నారు. డీకే శివకుమార్ స్వయంగా ఐదు గంట ల కరెంటు ఇస్తున్నట్లు ఒప్పుకున్నారన్నారు. మన తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అలాంటి పరిస్థితులు వస్తాయన్నారు. ఏడాదికి 25 వేల కోట్లు ఖర్చు చేసి నిరంతరం కరెంట్ ఇస్తున్నామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో 24 గంటల కరెంట్ ఇస్తున్న ప్రభుత్వం ఒక్క కేసీఆర్ ప్రభుత్వమేనని వెల్లడించారు. కాంగ్రెస్లో తన్నుకునేవాళ్లే తప్ప, ప్రజల గురించి ఆలోచించేవారు లేరన్నారు. రైతుకు రూ.15 వేలు అన్నది రేవంత్రెడ్డి, కానీ కేసీఆర్ ప్రతి ఎకారాకు రూ.16 వేలు ఇస్తామని చెప్పారన్నారు. రూ.72 వేల కోట్లు డైరెక్ట్గా రైతుల ఖాతాల్లో వేసిన ఘనత కేసీఆర్దన్నారు. రైతు నాయకుడు, రైతు బాంధవుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. అన్ని కుంటుంబాలకు రూ.5 లక్షల బీమా ఇవ్వబోతున్నామన్నారు. కొత్త ఆఫీసులు తరలింపు అనేది ఉత్త మాట అని నాలుగు కొత్తవి తెస్తాం కానీ ఎందుకు వెళ్తాయన్నారు.
ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో గ్రామాలను పరిపుష్టం చేసిన బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి కేసీఆర్ను మూడోసారి సీఎం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీలో కష్టపడ్డ వారికి పదవులు లభిస్తాయన్నారు. ఎలాం టి పొరపాట్లు జరగకుండా చూసుకుంటానని మంత్రి హరీశ్రావు హామీనిచ్చారని ఎమ్మెల్సీ తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కష్టపడి పార్టీ అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాలని ఎమ్మెల్సీ కోరారు. సమావేశంలో మెదక్ బీఆర్ఎస్ అభ్య ర్థి పద్మాదేవేందర్రెడ్డి, మెదక్ నియోజకవర్గం ఎన్నికల ఇన్చార్జి తిరుపతిరెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దేవేందర్రెడ్డి, జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యారెడ్డి, మెదక్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, పీఏసీఎస్ చైర్మన్ హనుమంత్రెడ్డి, హవేళీఘనపూర్, మెదక్ ఎంపీపీలు శేరి నారాయణరెడ్డి, యమునా, మండలాల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్రెడ్డి, అంజాగౌడ్, నాయకులు మాణిక్యరెడ్డి, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.
మనోహరాబాద్, నవంబర్ 1: బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచార నిమిత్తం హైదరాబాద్ నుంచి కామారెడ్డి వెళ్తున్నారు. మార్గమధ్యలో మెదక్ జిల్లా మనోహరాబాద్ మండ లం కాళ్లకల్ వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టు వద్ద మంత్రి కేటీఆర్ వాహనాన్ని పోలీసులు, ఎన్నికల సిబ్బంది ఆపి తనిఖీ చేశారు. మంత్రి తనిఖీ చేస్తున్న అధికారులకు పూర్తిగా సహకరిస్తూ, తనిఖీ పూర్తయ్యేంత వరకు అక్కడే ఉన్నారు. వాహన తనిఖీ పూర్తయిన అనంతరం మంత్రి కేటీఆర్ కామారెడ్డికి బయలుదేరి వెళ్లారు.
పాపన్నపేట, నవంబర్ 1: మెదక్ అభివృద్ధి కేవలం బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. బుధవారం పాపన్నపేట మండలంలోని లక్ష్మీనగర్ గ్రామ శివారులో గల ఎస్ఆర్ గార్డెన్లో ముఖ్యకార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ ఎవరెన్ని ట్రిక్కులు చేసినా ముఖ్యమంత్రి కేసీఆర్ మరోమారు సీఎంగా హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్నారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ప్రజల్లో ఉండి, నియోజక అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. ఆమెను గెలిపించుకోవాల్సిన అవసరం ప్రతీ కార్యకర్తపై ఉన్నదన్నారు. కొంతమంది హైదరాబాద్ నుంచి బెంజ్ కారులో వచ్చి ఆత్మగౌరవం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందనిపేర్కొన్నారు.
మంత్రి హరీశ్రావు సమక్షంలో పాపన్నపేట మండలంలోని ఎల్లాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరారు. గ్రామ మాజీ సర్పంచ్ బేగరి యాదయ్యతో పాటు నాలుగో వార్డు సభ్యుడు పుట్టి నరసింహులు, నాయకులు విజయరావు, దాసయ్య, అనిల్ కుమార్, అంబాదాస్ పార్టీలో చేరారు. వీరికి మంత్రి గులాబీ కండు వా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. సమావేశంలో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు సోములు, పార్టీ మం డలాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, పాపన్నపేట వ్యవసాయయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట్రెడ్డి, ఏడుపాయల దేవస్థానం కమిటీ చైర్మన్ బాలాగౌడ్, చిత్రియాల్ సర్పంచ్ బైరి సులోచనా రాజయ్య, నాయకులు శ్రీనివాస్రెడ్డి, ఏడుకొండలు, బాపూరావు తదితరులు పాల్గొన్నారు.
చిన్నశంకరంపేట, నవంబర్ 1: 60 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో రైతులకు ఏం చేశారని మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. బుధవారం సాయంత్రం మండల కేంద్రమైన నార్సింగ్లో చిన్నశంకరంపేట, ఉమ్మడి మండల కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హరీశ్రావు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే కరెంటు కష్టాలు తప్పవన్నారు. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలోనే నెంబర్వన్గా ఉంచారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఎక్కడ చూసిన పచ్చని పంటలతో కళకళలాడుతుందన్నారు. 60ఏండ్లలో చేయని అభివృద్ధి 10 ఏండ్లలో చేసి చూపించారని తెలిపారు. ధాన్యం దిగుబడిలో పంజాబ్ రాష్ర్టాన్ని తలదన్నేలా తయారైందన్నా రు. కేసీఆర్ పాలనలో కరువు లేదు కర్ఫ్యూ లేదన్నారు. బియ్యం కావాలని ఇతర రాష్ర్టాల వారు తెలంగాణ రాష్ర్టాన్ని కోరుతున్నారని తెలిపారు. కారు గుర్తు కు ఓటు వేసి పద్మాదేవేందర్రెడ్డిని అత్యధిక మోజార్టీతో గెలిపించాలని సూచించారు. సమావేశంలో ఇఫ్కోడైరెక్టర్ దేవేందర్రెడ్డి బీఆర్ఎస్ మెదక్ నియోజకవర్గ ఇన్చార్జి తిరుపతిరెడ్డి, జడ్పీటీసీలు లక్ష్మారెడ్డి, మాధవి, రైతుబంధు మండలాధ్యక్షుడు లక్ష్మారెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.