HomeMedakMedak Collector Rajarshi Shah To The Officials Of The Respective Departments To Resolve The Complaints Received In Public
ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించాలి
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా ఆయా శాఖల అధికారులకు ఆదేశించారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మూడు వారాల పాటు ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేశారు.
ప్రజావాణి ఫిర్యాదులపై నిర్లక్ష్యం తగదు
బాధితులకు తగిన న్యాయం చేయాలి
కలెక్టర్ రాజర్షి షా
ప్రజావాణిలో వినతుల స్వీకరణ
వివిధ సమస్యలపై 101 అర్జీలు
మెదక్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా ఆయా శాఖల అధికారులకు ఆదేశించారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మూడు వారాల పాటు ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేశారు. అనంతరం సోమవారం నిర్వహించిన ప్రజావాణికి జిల్లా వ్యాప్తంగా ప్రజలు భారీగా తరలివచ్చి ఫిర్యాదులు అందజేశారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, అదనపు కలెక్టర్ రమేశ్తో పాటు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా 101 ఫిర్యాదులు అందాయని, అందులో డీఆర్డీవోకు 12, కలెక్టరేట్ డీ సెక్షన్కు 43, విద్యా శాఖకు నాలుగు, పంచాయతీరాజ్ శాఖకు 5, రెవెన్యూ శాఖకు రెండు, ఎస్సీ కార్పొరేషన్కు రెండు, గిరిజన సంక్షేమ శాఖకు రెండు దరఖాస్తులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు శ్రీనివాస్, శైలేశ్, కృష్ణమూర్తి, రవి ప్రసాద్, రాధాకిషన్, జెంల్లానాయక్, సుధాకర్, రజాక్, శ్రీకాంత్రెడ్డి, ఆశాకుమారి, రజని తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డిలో..
సంగారెడ్డి కలెక్టరేట్, జూన్ 26: ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ప్రతి వారం నిర్వహించే ప్రజావాణి నిర్వహిస్తున్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి 124 అర్జీలు వచ్చాయి. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మూడు వారాలుగా ప్రజావాణి నిర్వహించని విషయం తెలిసిందే. దీంతో ఒక్కసారిగా సంగారెడ్డి జిల్లా నలుమూలల నుంచి అర్జీదారులు ప్రజావాణికి తరలివచ్చారు. అర్జీలను జిల్లా రెవెన్యూ అధికారి నగేశ్ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణిలో ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి పెట్టుకున్న అర్జీలను పరిశీలించి వెంటనే పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవోలు, కలెక్టరేట్ ఏవో, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
మెదక్ ఎస్పీ కార్యాలయంలో..
మెదక్ అర్బన్, జూన్ 26: అర్జీదారుల సమస్యలు త్వరగా పరిష్కరించేందుకు ప్రజావాణి నిర్వహిస్తున్నామని మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అధికారులకు సూచించారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ ఆధ్వర్యలో ప్రజావాణిని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. కొల్చారం మండలం అంసాన్పల్లి గ్రామానికి చెందిన వినోద తనకు 2016లో గ్రామ పెద్దల సమక్షంలో వివాహం జరిగిందని, ఆ సమయంలో కట్నం కింద 6 తులాల బంగారం, లక్ష రూపాయలు ఇచ్చారని తెలిపింది. తమకు ఒక బాబు, ఒక పాప ఉన్నారని, రెండేండ్లు బాగా చూసుకున్నాడని, ఆ తర్వాత అదనపు కట్నం కోసం రోజు మద్యం తాగొచ్చి తనపై దాడి చేస్తూ చిత్రహింసలకు గురిచేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నది.
ఈ విషయంపై కులపెద్దల సమక్షంలో నచ్చజెప్పినా ఎలాంటి మార్పు రాలేదని, తన బంగారం అమ్ముకున్నాడని, ఎవరితోనైనా మాట్లాడితే అనుమానిస్తున్నాడని పేర్కొన్నది. ప్రస్తుతం అమ్మగారి ఇంటికి వచ్చి రెండు నెలలు అయ్యిందని, బాబును తన వద్ద ఉంచుకున్నాడని, న్యాయం చేయాలని ఫిర్యాదు చేసింది. చట్ట ప్రకారం ఫిర్యాదీకి న్యాయం చేయాలని మెదక్ రూరల్ సీఐకి ఆదేశించారు.