మెదక్ అర్బన్, ఏప్రిల్ 17: ఎఫ్సీఐ పెండింగ్ బియ్యాన్ని వెంటనే పూర్తి చేయాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా సంబంధిత అధికారులకు సూచించారు. సోమవారం మెదక్ కలెక్టరేట్లో యాసంగి 2021-22 బియ్యం డెలివరీ, పెండింగ్ క్లియరెన్స్ పైన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా నుంచి బియ్యం డెలివరీ చేసిన ఏసీకేలను త్వరితగతిన అన్లోడ్, పరిశీలన పూర్తి చేస్తూ వెంటనే అంగీకారం తెలిపేవిధంగా ఎఫ్సీఐ అధికారులకు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా తెలియజేశారు.
జిల్లా నుంచి ఎఫ్సీఐకి బియ్యం డెలివరీలో ఎక్కువగా రిజెక్షన్ చేస్తున్నారని వాటిని దానిని తగ్గిస్తూ మిల్లర్లకు సహాయం చేయాలని సూచించారు. జిల్లాలో మిల్లర్ల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. యాసంగి బియ్యం డెలివరీకి ఏప్రిల్ 30 వరకు గడువని ఆలోగా లక్ష్యం పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో వచ్చే యాసంగి సిజన్లో ధాన్యం ఎక్కువ వచ్చే అవకాశమున్నందున ధాన్యం నిల్వ చేసేందుకు స్థలం లేనందున, త్వరతగతిన బియ్యం డెలివరీ పూర్తియేయాలన్నారు. సమావేశంలో ఎఫ్సీఐ డీఎం వివేక్ అగర్వాల్, జిల్లా రైస్ మిల్లర్ల అధ్యక్షుడు చంద్రపాల్, ఇతర మిల్లర్లు పాల్గొన్నారు.