మెదక్ మున్సిపాలిటీ, డిసెంబర్ 26 : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ కేథడ్రల్ చర్చిలో క్రిస్మస్ సందర్భంగా రెండోరోజు సోమవారం భక్తుల సందడి నెలకొంది. క్రిస్మస్ను పురస్కరించుకొని ఆదివారం వచ్చిన భక్తులు సోమవారం తరలివెళ్లారు. సోమవారం సైతం యేసయ్య సన్నిధికి వేలాది మంది భక్తులు వచ్చి ప్రార్థనలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. చర్చి ప్రేసిబేటరీ ఇన్చార్జి రెవరెండ్ జార్జి ఎబినేజర్ రాజు, చర్చి పాస్టర్లు డేవిడ్, శ్రీనివాస్, సువర్ణ భక్తులను ఆశీర్వదించారు. భక్తులకు చర్చిలోని వసతి గృహాలు, కాటేజీలు లభించకపోవడంతో చెట్ల కింద వంటావార్పు చేసుకున్నారు. మరిన్ని వసతి గృహాలు నిర్మిస్తే బాగుంటుందని పలువురు భక్తులు అభిప్రాయపడ్డారు.
చర్చివద్ద ఏర్పాటు చేసిన రంగుల రాట్నాలు చిన్నారులు, యువతను ఆకర్షించాయి. సాయంత్రం వేళలో వీటికి డిమాండ్ పెరిగింది. భక్తులు,పర్యాటకుల కొనుగోళ్లతో దుకాణాలు కిటకిటలాడాయి. మెదక్ డీఎస్పీ సైదులు ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు. భక్తుల కోసం పార్కింగ్ జోన్ ఏర్పాటు చేసి వాహనాలను అక్కడే నిలిపివేయించారు.
చర్చి ప్రధాన ద్వారం వద్ద ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా పోలీసులు ప్రత్యేక దృష్టిసారించడంతో సమస్య ఎదురు కాలేదు. బాక్సింగ్ డే పురస్కరించుకొని చర్చి ప్రాంగణంలో చర్చి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో చర్చి కమిటీ సభ్యులు రోలండ్పాల్ వికాస్, జాయ్ముర్రే, సువన్ డగ్లస్, జయరాజ్ సునీల్, సంగయ్య, భాస్కర్ తదితరులు పాల్గ్గొన్నారు.