సంగారెడ్డి కలెక్టరేట్/ మెదక్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ రమేశ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం మెదక్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యల పరిషార నిమిత్తం వచ్చిన 80 వినతులను అదనపు కలెక్టర్ రమేశ్, డీఎస్వో శ్రీనివాస్ పరిశీలించి, తగుచర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. ఇందులో ధరణి, భూ సమస్యలకు సంబంధించి 50 దరఖాస్తులు, పింఛన్లకు సంబంధించి 4, పోడు భూములు 12, జిల్లా పం చాయతీకి సంబంధించి 4, మహిళా, దివ్యాంగుల సంక్షేమం ఒకటి, గ్రౌండ్ వాటర్ ఒకటి, ఇతర శాఖలకు సంబంధించి 8 వినతులు వచ్చాయి.
సంగారెడ్డిలో 47 ఫిర్యాదులు
సంగారెడ్డి కలెక్టరేట్ గ్రీవెన్స్కు వినతులు వెల్లువెత్తాయి. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి వారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 47 అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షిషా మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యత ఇవ్వాలని, పెండింగ్ అర్జీలను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేయాలని సంబంధిత శాఖలను ఆదేశించారు. ఎలాంటి జాప్యం లేకుండా ప్రజావాణి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
అర్జీలను త్వరగా పరిష్కరించాలి
మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని
మెదక్ అర్బన్, డిసెంబర్ 5 : అర్జీదారుల సమస్యలను త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. సోమవారం జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చినటువంటి ఆర్జీదారుల ఫిర్యాదులను స్వీకరించారు.