మెదక్ మున్సిపాలిటీ, డిసెంబర్ 16: రోడ్డు ప్రమాదాల నివారణకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ, రాష్ట్ర రహదారుల ఇంజినీరింగ్ అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ రమేశ్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో ఇంజినీరింగ్, రవాణా శాఖ, పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఏటా రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతుండటంతో పాటు క్షతగాత్రులు, మృత్యువాత పడుతుండడం బాధాకరమన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తగు చర్యలతో పాటు ప్రతిఒక్కరూ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు నివారించవచ్చన్నారు. ఆ కుటుంబాలు రోడ్డున పడకుండా నివారించగగిలిన వారమవుతమన్నారు. రోడ్డు ప్రమాదానికి ప్రధాన కారణాలు అధికంగా మలుపులు ఉండడం, ప్రమాద హెచ్చరికలు, స్పీడ్ నియంత్రిక సూచికలు, అవసరమైన చోట స్పీడ్ బ్రేకర్లు లేకపోవడం, యూటర్న్ మలుపులు కనిపించక పోవడం, డ్రైవర్ల తప్పిదాలు, మద్యం సేవించి నడపడం, హెల్మెట్ పెట్టుకోక పోవడంతోనే జరుగుతున్నాయన్నారు.
మనోహరాబాద్ నుంచి తూప్రాన్, చేగుం ట, రామాయంపేట జాతీయ రహదారితో పాటు నర్సాపూర్-మెదక్ రహదారి వెంట గుర్తించిన బ్లాక్స్పాట్ల వద్ద ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని జాతీయ రహదారులు, ఆర్అండ్బీ అధికారులకు సూచించారు. పెద్ద శంకరంపేట అంకోలా జాతీయ రహదారి పెట్రోల్ బంక్ వద్ద యూటర్న్ ఏర్పాటు చేయాలని అధికాలకు సూచించారు. అల్లాదుర్గం, బోడ్మట్పల్లి సర్వీస్ రోడ్డు అనుసంధానం చేయాలని, జమ్మికుంట వద్ద ఇరుకుగా గల వంతెన వద్ద లైటింగ్ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. రహదారులపై రక్షణగా ఏర్పాటు చేసిన సైడ్ గ్రిల్ తొలిగించకుండా, పశువులు రోడ్లపై సంచరించకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
నర్సాపూర్ నుంచి కొల్చారం మధ్య క్షతగ్రాతులను తక్షణ వైద్య సహాయం నిమిత్తం అంబులెన్స్లు ఏర్పాటుతో పాటు రహదారుల పక్కన అవసరమైన చోట బయో వాష్ రూమ్లు ఏర్పాటు చేయాలని అధికాలకు సూచించారు. అవసరమైన ప్రాంతాల వద్ద రేడియం సైన్ బోర్డులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆర్అండ్బీ, జాతీయ రహదారులు ప్రాదికార సంస్థ అధికారులకు సూచించారు. బంగారమ్మ దేవాలయం, కుచారం వద్ద రహదారిపై పసుపు చారలు ఏర్పాటు చేయాలన్నారు. చెట్ల తిమ్మాయిపల్లి, వడియారం బైపాస్ రోడ్ల వద్ద హైమాస్ట్ లైట్లు వెలిగేలా చూడాలన్నారు. నర్సాపూర్-మెదక్ రహదారిలో అవసరమైన ప్రాంతాల్లో రుంబుల్స్ స్ట్రిప్స్ వేయాలని, మెదక్ పట్టణంలోని వెల్కమ్ బోర్డు రహదారిని సరిచేస్తూ సర్కిల్ ఏర్పాటు చేయాలని ఆర్అండ్బీ అధికారును ఆదేశించారు. ఉన్నతస్థాయిలో అనుమతులు, నిధుల మంజూరుకు పంపిన ప్రతిపాదనలు అందజేస్తే తగు చర్యలు తీసుకుంటామని ఆదనపు కలెక్టర్ తెలిపారు. సమావేశంలో జిల్లా రవాణాధికారి శ్రీనివాస్గౌడ్, ఆర్అండ్బీ డీఈఈ వెంకటేశం, జాతీయ ప్రాధికార సంస్థ మేనేజర్ తరుణ్కుమార్, హైవే సీనియర్ ఇంజినీర్ ఏడుకొండలు, కిరణ్కుమార్, జిల్లా ఎక్సైడ్ సూపరిండెంట్ రజాక్, పట్టణ సీఐ మధు పాల్గొన్నారు.