చిన్నశంకరంపేట, ఫిబ్రవరి 6 : మెదక్ జిల్లాలో భూసమస్య పరిష్కరించేందుకు రైతు వద్ద లక్షరూపాయలు లంచం తీసుకుంటూ ఆర్ఐ ఏసీబీ అధికారులకు చిక్కాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని సంగాయిపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్కు సర్వేనెంబర్ 1313లో 22 గుంటల భూమి ఉంది. పాత పట్టా పుస్తకంలో 22 గుంటల భూమి వివరాలు నమోదు కాలేదు. దీంతో అతడు మండల ఆర్ఐని సంప్రదించాడు. పొలం వివరాలను నమోదు చేయడానికి రెండు లక్షల రూపాయలు ఆర్ఐ డిమాండ్ చేశాడు.
అంత డబ్బులు ఇచ్చుకోలేనని రైతుల శ్రీనివాస్ తెలుపడంతో, ఈ పొలం పక్కనే తన పొలం కూడా ఉందని, తనకు 18గజాలు జాగా అవసరం ఉందని, ఆ జాగా డబ్బులు తీసివేసి రూపాయలు లక్ష ఇవ్వాలని రైతుతో ఆర్ఐ బేరం కుదుర్చుకున్నాడు. పంట పొలాల వివరాలను పాసుపుస్తకంలో పొందపరిచాకే ఆ డబ్బులు ఇవ్వాలని సూచించాడు. ఆ తర్వాత పాసుపుస్తకంలో పొలం వివరాలు నమోదు చేశాడు.
డబ్బులు ఇవ్వాలని చందంపేట గ్రామానికి చెందిన వీఆర్ఏ సురేశ్బాబుతో కలసి రైతు శ్రీనివాస్పై ఆర్ఐ శ్రీహరి ఒత్తిడి పెంచాడు. బాధితుడు జనవరి 5న ఉమ్మడి మెదక్ జిల్లా ఏసీబీ డీఎస్పీ ఆనంద్కుమార్ను సంప్రదించాడు. రైతు శ్రీనివాస్ సోమవారం రుద్రారం గ్రామ శివారులో ఆర్ఐ, వీఆర్ఏలకు డబ్బులు ఇచ్చాడు. ఏసీబీ అధికారులను చూసిన ఆర్ఐ, వీఆర్ఏ బైక్పై పారిపోతుండగా వెంబడించి పట్టుకున్నారు. వారిని తహసీల్ కార్యాలయానికి తరలించి డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీహరి, వీఆర్ఏ సురేశ్బాబులపై కేసు నమోదు చేసినట్టు మీడియా ఏసీబీ డీఎస్పీ ఆనంద్కుమార్ తెలిపారు.