ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. సాయంత్రానికి ఆడబిడ్డలంతా ఒక్కచోట చేరి వేడుక చేసుకున్నారు. బతుకమ్మల చుట్టూ చేరి ఆటపాటలతో ఆనందంగా గడిపారు. వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. సిద్దిపేటలో టీఎన్జీవోల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున్న వేడుక నిర్వహించారు. మెదక్, సంగారెడ్డి, జోగిపేటల్లో నిర్వహించిన బతుకమ్మ సంబురాల్లో ప్రజాప్రతినిధులు పాల్గొని మహిళలతో కలిసి ఆడిపాడారు. – ఉమ్మడి మెదక్ జిల్లా నెట్వర్క్, అక్టోబర్ 11
ఆడపడుచులకు అత్యంత ప్రితీ పాత్రమైన పూలపండుగ బతుకమ్మ. రంగురంగు పూలతో తయారు చేసిన బతుకమ్మలను అలంకరించి ఇండ్ల వద్ద, కార్యాలయాల వద్ద మహిళలు ఆడిపాడారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల అభిష్టానికి అనుగుణంగా పండుగలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందే. సంగారెడ్డి పట్టణంలో జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ ఉత్సవాలకు ప్రొటెం స్పీకర్ భూపాల్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకల్లో ప్రొటెం స్పీకర్ సతీమణి గీత, ఎంపీ బీబీపాటిల్ సతీమణి అరుణపాటిల్, పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి సతీమణి యాదమ్మ, నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి సతీమణి జయశ్రీతోపాటు ఈ వేడుకల్లో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కుంచాల ప్రభాకర్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, సీడీసీ అధ్యక్షుడు కాసాల బుచ్చిరెడ్డి, అదనపు కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ రమణకుమార్, మహిళా ఉద్యోగులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంగారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ బొంగుల విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. అందోల్- జోగిపేట మున్సిపాలిటీలో ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ సతీమణి పద్మావతి కౌన్సిలర్లు, స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. మెదక్ పట్టణంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పలు కాలనీల మహిళలతో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు.