మెదక్, జూన్ 28 : పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితోపాటు హరితహారంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తామని అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. సోమవారం అదనపు కలెక్టర్గా ప్రతిమాసింగ్ పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు కలెక్టర్ ఎస్.హరీశ్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం ఆమె ఛాంబర్లో అదనపు కలెక్టర్గా బాధ్యతలు చేపట్టి ఫైల్పై సంతకం చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ జూలై ఒకటి నుంచి పది రోజులపాటు నిర్వహించే పల్లె, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తామన్నారు. ఏడో విడుత హరితహారంలో ప్రతి ఇంటికీ ఆరు మొక్కలు పంపిణీ చేయాలని అధికారులకు సూచించారు. మెదక్ జిల్లాలోని 469 గ్రామ పంచాయతీలతోపాటు నాలుగు మున్సిపాలిటీల్లో ఏడో విడుత హరితహారాన్ని విజయవంతం చేయడానికి ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. పల్లెలను పరిశుభ్రంగా ఉంచడంతోపాటు డ్రైనేజీలు, మురుగు కాల్వను శుభ్రంగా ఉంచాలన్నారు. ముఖ్యంగా హరితహారంలో రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటాలని, ప్రతి గ్రామ పంచాయతీల్లో ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటాలని తెలిపారు. గ్రామ పంచాయతీల అభివృద్ధికి ప్రభుత్వం ప్రతి నెలా నిధులు మంజూరు చేస్తున్నదని గుర్తు చేశారు.
అదనపు కలెక్టర్ను కలిసిన మున్సిపల్ చైర్మన్..
అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ను మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్, కమిషనర్ శ్రీహరి, ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షుడు హరికృష్ణ, జిల్లా అధికారులు, రెవెన్యూ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం అదనపు కలెక్టర్ను మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ శాలువాతో సన్మానించారు.