జూన్ నెలాఖరులోగా చెక్డ్యాంల పనులన్నీ పూర్తి చేయాలి
అందుకనుగుణంగా పనులు జరుగాలి
వచ్చే ఏడాది చివరికల్లా సిద్దిపేటకు రైలు కూత
ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు
రంగనాయకసాగర్ ప్రాజెక్టు క్యాంపు కార్యాలయంలో సమీక్ష
ఆకస్మికంగా జేపీ తండా కొనుగోలు కేంద్రం సందర్శన
ఖాతా చెక్డ్యాం, పెద్దవాగుపై నిర్మిస్తున్న సైఫన్ కాల్వ పనుల పరిశీలన
చిన్నకోడూరు, మే 27 : తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు రోహిణి కార్తెలోనే సాగునీరు అందిద్దామని, ఆ దిశగా ఇరిగేషన్ అధికారులు సంసిద్ధం కావాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. చిన్నకోడూరు చంద్లాపూర్ రంగనాయకసాగర్ ప్రాజెక్టు క్యాంపు కార్యాలయంలో గురువారం ఇరిగేషన్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. వానకాలం సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో చివరి ఆయకట్టు వరకు ఉన్న చెరువులు, కుంటలు, వాగులు, చెక్డ్యాంలను నింపుకునేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. రంగనాయకసాగర్ ఎడమ, కుడి కాల్వలు, డిస్ట్రిబ్యూటరీ, మైనర్, సబ్ మైనర్ కాల్వలు పెండింగ్ పనులపై ఇరిగేషన్ అధికారులతో సమీక్షించారు. అదే విధంగా మల్లన్నసాగర్, దుబ్బాక ప్రధాన కాల్వ, డిస్ట్రిబ్యూటరీ కాల్వలపై సమీక్షించారు. రంగనాయకసాగర్ కుడి కాల్వ కింద ఎల్డీ -1 ఫీల్డ్ చానల్లో ఉన్న సిల్ట్, బుష్ కటింగ్ క్లియరెన్స్ చేయాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. కుడి ప్రధాన కాల్వ కింద ఎల్డీ -6 డిస్ట్రిబ్యూటరీ కెనాల్లో 63 స్ట్రక్చర్స్ పెండింగ్లో ఉన్నాయని, వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని, ఎల్డీ -10లో డిస్ట్రిబ్యూటరీ కెనాల్లో 12 ఓటీలు, 13 స్ట్రక్చర్స్ పెండింగ్లో ఉన్నాయని, వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. కుడి, ఎడమ ప్రధాన కాల్వల కోసం 6మంది సైట్ ఇంజనీర్లు, మరో ఇద్దరు సర్వేయర్లను నియమించాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. ఎడమ ప్రధాన కాల్వ కింద ఎల్ఎంసీ -ఆర్-1 నుంచి ఆర్ -9 వరకు ఉన డిస్ట్రిబ్యూటరీ, మైనర్, సబ్ మైనర్ కెనాల్స్ అంశాలపై చర్చించారు.
వాటిలో ప్రధానంగా ఆర్-1లో పెండింగ్లో అంశాలు, ఆర్-3లో లైనింగ్ పెండింగ్, ఆర్ -7లో సైఫన్ నిర్మాణం చేపట్టాలని సూచించారు. ఆర్-8లో పంట కాల్వలు తవ్వుకునేందుకు రైతులు ముందుకొచ్చేలా స్థానిక ప్రజాప్రతినిధులు ఇరిగేషన్ అధికారులకు సహకరిస్తూ సమన్వయం చేయాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ-12లోని మల్లన్నసాగర్ జలాశయం కింద 48 కి.మీ మేర చేపడుతున్న దుబ్బాక ప్రధాన కాల్వలో లైనింగ్, స్ట్రక్చర్స్తో సహా అసంపూర్తి పనులన్నీ జూన్ 15 లోపు పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులను మంత్రి ఆదేశించారు. దుబ్బాక ప్రధాన కాల్వ కింద 17 డిస్ట్రిబ్యూటరీ కాల్వలు ఉండగా, కుడి పక్కన 11, ఎడమ పక్కన 6 కాల్వలు ఉన్నాయని, వాటిలో 1 ఎల్ నుంచి 6 ఎల్ వరకు, 1 ఆర్ నుంచి 11 ఆర్ వరకు మైనర్, సబ్ మైనర్ కెనాల్స్ అంశాలపై చర్చించారు. డీఎంసీలో 10 శాతం మేర లైనింగ్ పనులు కావాల్సి ఉందని ఇరిగేషన్ అధికారులు, కాంట్రాక్టర్ మంత్రికి వివరించారు. సమీక్షా సమావేశంలో ఇరిగేషన్ ఎస్ఈ బస్వరాజ్, ఈఈ గోపాలకృష్ణ, ఎంపీపీ కూర మాణిక్యరెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణశర్మ, సుడా చైర్మన్ రవీందర్రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీకాంత్రెడ్డి, డీఈ చంద్రశేఖర్, ఏఈ ఖాజా, నాయకులు ఎడ్ల సోంరెడ్డి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.