మెదక్ మున్సిపాలిటీ/ సిద్దిపేట టౌన్, జూలై 20: భారత దేశం సర్వమాతల సమ్మేళనం. ప్రతి మతానికి ఆచారాలు, పద్ధతులు, వ్యవహార శైలులుంటాయి. అందులో భాగంగా ప్రజలు ఆయా సం ప్రదాయ వ్యవహారాలు పాటిస్తుంటారు. ముస్లిం సోదరులు జరుపుకొనే పండుగలలో ముఖ్యమైనవి రెండు, ఒకటి ఈదుల్ ఫితర్(రంజాన్) అయితే రెండోది ఈద్-ఉల్ -జుహా(బక్రీద్).
బక్రీద్ రోజున ముస్లింల ప్రత్యేకత
బక్రీద్ రోజుకు ముందు రోజున చనిపోయిన వారి సమాధుల వద్ద వారిక ఇష్టమైన దుస్తులు, ఆహార పదార్థాలు, వస్తువులను ఉంచుతారు. వారు స్వర్గం నుంచి వచ్చి వాటిని భుజిస్తారని, స్వీకరించి తమను ఆశీర్వదిస్తారని నమ్ముతారు.ముస్లింల త్యాగానికి ప్రతీకగా ఈ బక్రీద్ జరుపుకొంటారు.
ఈద్గాల వద్ద ప్రార్థనలకు ఏర్పాట్లు..
జిల్లా వ్యాప్తంగా బక్రీద్(ఈద్-ఉల్-జుహా) పండుగను ఘనంగా నిర్వహించుకునేందుకు ముస్లిం సోదరులు సిద్ధమయ్యారు. మసీదులను విద్యుద్దీపాలతో ముస్తాబు చేశారు. ఈద్గాల వద్ద ప్రార్థనలు నిర్వహించేందుకు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మెదక్, సిద్దిపేట జిల్లా కేంద్రాల్లోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేయనుండడంతో మంగళవారం మున్సిపల్ పారిశుధ్య సిబ్బంది ఈద్గా ప్రాంతాన్ని శుభ్రం చేయించేందుకు చర్యలు చేపట్టారు. కరోనా నేపథ్యంలో కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ బుధవారం ఉదయం 9 గంటలకు ఈద్గాతో పాటు పలు మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయని ముస్లిం మత పెద్దలు పేర్కొన్నారు. ఆయా మసీదుల వద్ద పోలీసు శాఖ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.
ముస్లిములకు బక్రీద్ శుభాకాంక్షలు..
సిద్దిపేట, జూలై 20: ముస్లిములకు ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు (ఈదుల్ జుహా) బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింలు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకొనే పండుగల్లో బక్రీద్ ఒకటని, ఈ పండుగ త్యాగానికి ప్రతీక అని పేర్కొన్నారు. మక్కాకు వెళ్లే హజ్ యాత్రికులకు కరోనా నేపథ్యంలో యాత్ర లేకపోవడం బాధాకరమని, అల్లా దయతో కరోనా సైతాన్ను తరిమేద్దామని, కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎవరి ఇంటి వద్దే వారే ప్రార్థనలు జరుపుకోవాలని కోరారు.
నిబంధనలు పాటిస్తూ పండుగ జరుపుకోవాలి..
సంగారెడ్డి కలెక్టర్, జూలై 20: జిల్లాలోని ముస్లింలందరికీ కలెక్టర్ హనుమంతరావు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం కలెక్టర్ ఓ ప్రకటన జారీ చేస్తూ త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగ అని పేర్కొన్నారు. భక్తిశ్రద్ధలు, ఆనందోత్సాహాలతో పండగ జరుపుకోవాలని కలెక్టర్ కోరారు. కరోనా దృష్ట్యా ప్రస్తుత పరిస్తుతుల్లో స్వీయ నియంత్రణ పాటిస్తూ నిబంధనల మేరకు పండుగ జరుపుకోవాలన్నారు.