రామాయంపేట, జూన్ 18: పల్లె పల్లెకూ ప్రకృతి వనాలతో గ్రామాలన్నీ అందంగా కనిపిస్తున్నాయని జిల్లా డీఆర్డీవో ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస్, జిల్లా పంచాయతీ రాజ్ అధికారి తరుణ్ అన్నారు. శుక్రవారం రామాయంపేట మండలం కోనాపూర్, దామరచెర్వు గ్రామాల్లోని పల్లె ప్రకృతి వనాన్ని రోడ్ల పక్కనే ఉన్న హరిత హారం మొక్కలను పరిశీలించి మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాల్లో మొక్కల పెంపకం పనులు జోరుగా సాగుతున్నాయని అన్నారు. గ్రామాల్లోని పారిశుధ్యంపై సర్పంచ్లు దృష్టి సారించాలని అన్నారు. ఏడో విడుత హరితహారంలో భాగంగా ఎక్కడ ఖాళీ స్థలాలు ఉంటే అక్కడ మొక్కల ను నాటాలన్నారు. పల్లెలన్నీ పచ్చదనంతో నిండాలని తెలిపారు. గ్రామాల కార్యదర్శులు నాటిన మొక్కలను సంరక్షించేందుకు దృష్టి పెట్టాలన్నారు. జిల్లా వ్యాప్తంగా పూర్తైన పల్లె ప్రకృతి వనాలకు చుట్టూరా ఐరన్ ఫెన్సింగ్ను ఏర్పాటు చేయిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో రామాయంపేట మండలంలోని పల్లె ప్రకృతి వనాలు రోడ్డు పక్కనే ఉండి పచ్చల హారాలుగా దర్శనమిస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. రోడ్ల పక్కన పిచ్చి మొక్కలను తొలగించి ఏడో విడుత హరితహారంలో మొక్కలు నాటేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో రామాయంపేట ఎం పీపీ నార్సింపేట భిక్షపతి, మండల ప్రత్యేకాధికారి శ్రీనివాసరావు, ఎంపీడీవో యాదగిరిరెడ్డి, కోనాపూర్ సర్పంచ్ దోమ చంద్రకళ, కార్యదర్శి చంద్రహాస్, ఇమ్మానియేల్ తదితరులున్నారు.