మెదక్/ సంగారెడ్డి, ఏప్రిల్ 9: పాఠశాలలు తెరిచేంత వరకు ఆర్థిక సాయంతో పాటు ఉచితంగా బియ్యం అందించి ఆదుకోవాలని ప్రభుత్వం మానవీయ కోణంలో నిర్ణయం తీసుకున్నదని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, పౌర సరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. శుక్రవారం మంత్రులు బీఆర్కే భవన్ నుంచి ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్శర్మతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు జిల్లా విద్యాశాఖాధికారులు, జిల్లా పౌర సరఫరాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ కరోనా దెబ్బకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బందికి ప్రతి ఒక్కరికీ ఈ నెల నుంచే రూ.2వేల నగదుతో పాటు 25 కిలోల బియ్యం రేషన్ షాపుల ద్వారా ఉచితంగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇందుకు సంబంధిత ఆయా జిల్లాలో గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలు అందులో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది డేటా వివరాలను ఈనెల 15లోగా సేకరించి ఏప్రిల్ 28వ తేదీలోగా ఆన్లైన్లో నమోదు చేయాలని మంత్రి కలెక్టర్లకు సూచించారు.
ఇందుకు సంబంధించి విధి విధానాలను, కార్యాచరణ ప్రణాళిక అమలు కోసం ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మెదక్ కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ జిల్లాలో గత మార్చి నాటికి గుర్తించి పొందిన ప్రైవేట్ పాఠశాలలు 110 ఉన్నాయని, అందులో 1124 మంది బోధన, బోధనేతర సిబ్బంది ఉన్నారని మంత్రులకు వివరించారు. కాన్ఫరెన్స్లో చెప్పిన ఆదేశాలను ఖచ్చితంగా పాటిస్తూ సోమవారంలోగా పూర్తి వివరాలు అందించాల్సిందిగా ఆయన మండల విద్యాశాఖాధికారులను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో విద్యాశాఖ ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి చిత్రా రామచంద్రన్, జిల్లా విద్యాశాఖాధికారి రమేశ్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి శ్రీనివాస్, వివిధ మండలాల విద్యాశాఖాధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్లో సంగారెడ్డి నుంచి పాల్గొన్న కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ జిల్లా మార్చి నాటికి గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలు 419 ఉన్నాయని, అందులో 5273 మంది బోధన, 385 మంది బోధనేతర సిబ్బంది ఉన్నారని మంత్రులకు కలెక్టర్ వివరించారు. ప్రభుత్వం ప్రకటన చేసిన విధంగా జిల్లాలో పని చేస్తున్న సిబ్బంది వివరాలు తీసుకుని సిద్ధంగా ఉంచామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షా, విద్యాశాఖాధికారి రాజేష్, పౌరసరఫరాల డీఎం సుగుణబాయి, మండల విద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండి…
మినీ లాక్డౌన్లతో మైక్రోఫైనాన్స్ సంస్థలు కుదేలే!
గజ్వేల్ దవాఖాన నిర్వహణ బాగుంది