రైతాంగం నష్టపోకుండా కఠిన చర్యలు తీసుకోవాలి
నకిలీ విత్తనాలపై నిరంతరం పర్యవేక్షణ
వానకాలంలో 70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయించాలి
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి
మెదక్, జూన్ 1 : నకిలీ విత్తనాల విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని, రైతాంగం నష్టపోకుండా కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి పోలీస్ ఉన్నతాధికారులు, వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్లో విత్తనాల లభ్యత, నకిలీ విత్తనాలు అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన డీజీపీ కార్యాలయం నుంచి రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి, డీజీపీ మహేందర్రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్రావు, ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రాంరెడ్డి, విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ కేశవులు, వ్యవసాయ, పోలీసు శాఖ అధికారులు, టాస్క్ఫోర్స్ బృందాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వం ప్రధాన రంగంగా గుర్తించి అనేక పథకాలు అమలు చేస్తున్నదన్నారు. ఈ క్రమంలో ఎక్కడా రైతులు నష్టపోకుండా చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. రాష్ట్రంలో సుమారు 60 లక్షల కుటుంబాలు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నాయని తెలిపారు. వ్యవసాయ రంగం అనుబంధ సంస్థలు బలోపేతమై రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తాయన్నారు. ప్రభుత్వం ఉచిత కరెంట్, నీళ్లు, రైతుబంధు, రైతుబీమా, పంటల కొనుగోళ్లతో ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం 450 గ్రాముల పత్తి విత్తనాల ప్యాకెట్ రూ.750 గా నిర్ణయించిందని, అంతకుమించి ఎవరైనా అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. విత్తన కంపెనీలు నాణ్యమైన విత్తనాలనే అమ్మాలని, నాణ్యత లేకుంటే రైతు తీవ్రంగా నష్టపోతాడన్నారు. వానకాలంలో ైగ్లెఫోసైట్ అమ్మకాన్ని నిషేధించడం జరిగిందని, ఎక్కడైనా కనిపిస్తే సంబంధిత షాపుల లైసెన్స్లు రద్దు చేయాలని అధికారులను ఆదేశించారు.
నకిలీ విత్తనాలపై నిరంతరం పర్యవేక్షణ..
నకిలీ పత్తి, మిర్చి విత్తనాలపై నిరంతరం పర్యవేక్షణ చేయాలని, ముఖ్యంగా నకిలీ విత్తనాలను అరికట్టడానికి పోలీసు, వ్యవసాయ అధికారులు సమన్వయంతో పని చేయాలని మంత్రి నిరంజన్రెడ్డి సూచించారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పత్తి సాగును పెంచాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ఈ వానకాలం 70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయించాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించారు. తెలంగాణ పత్తికి దేశ వ్యాప్తంగా డిమాండ్ ఉందని, ఇందుకోసం విత్తనరంగంలో నూతన సంస్కరణల కోసం సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉన్న రైతు వేదికల ద్వారా రైతాంగానికి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, తద్వారా నకిలీ విత్తనాలపై రైతులను చైతన్యం చేయాలని వ్యవసాయ శాఖాధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ చందనదీప్తి మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నకిలీ విత్తనాలు, ఎరువులు, నాసిరకం పురుగుల మందులను అమ్ముతూ రైతులను మోసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో పోలీసు, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి నకిలీ విత్తనాలు అమ్ముతున్నవారిపై చర్యలు తీసుకోవాలని తెలిపారు.
వీడియో కాన్ఫరెన్స్లో డీజీపీ మహేందర్రెడ్డి
సిద్దిపేట టౌన్, జూన్ 1 : నకిలీ విత్తనాలు, పురుగుల మందుల విక్రయాలను పూర్తి స్థాయిలో నియంత్రించాల్సిన బాధ్యత పోలీసు అధికారులపై ఉందని, నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్రెడ్డి ఆదేశించారు. నకిలీ విత్తనాలను పూర్తి స్థాయిలో రూపుమాపడం, తీసుకోవాల్సిన చర్యలపై వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, వ్యవసాయ శాఖ సెక్రటరీ రఘునందన్రావు, రాష్ట్ర రైతు వేదిక అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డితో కలిసి మంగళవారం పోలీసుకమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు నకిలీ విత్తనాలు, పురుగుల మందులు అమ్మిన 529 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. అదేవిధంగా 27 మందిపై పీడీ యాక్టు పెట్టి జైలుకు పంపించామన్నారు. నకిలీ విత్తనాలను నిరోధించడానికి పోలీసు, వ్యవసాయ శాఖతో సమన్వయం చేస్తూ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఇందులో భాగంగా జిల్లా, మండల స్థాయిలో టాస్క్ఫోర్స్ టీమ్లను ప్రత్యేకంగా నియమించామన్నారు. నకిలీ విత్తనాలను విక్రయించేందుకు ఆయా గ్రామాలకు వచ్చే ఏజెంట్లపై నజరు వేసి వారి సమాచారాన్ని పోలీసులు సేకరించాలని సూచించారు. ఇందుకు స్థానిక పోలీసులతోపాటు టాస్క్ఫోర్స్ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో దుకాణదారుడి నుంచి రశీదు తప్పకుండా తీసుకునే విధంగా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. రాబోయే రోజుల్లో నకిలీ విత్తన రహిత రాష్ట్రంగా రూపుదిద్దాలన్నారు. పోలీసు అధికారులు పూర్తి స్థాయిలో గుర్తించి ఏ ఒక్క రైతు నష్టపోకుండా అందరికీ న్యాయం చేకూర్చే విధంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. అనంతరం పోలీసు కమిషనర్ జోయల్ డెవిస్ మాట్లాడుతూ నకిలీ విత్తనాలు, పురుగుల మందుల విక్రయాలను అరికట్టేందుకు జిల్లాలో నాలుగు టాస్క్ఫోర్స్ టీమ్లను ఏర్పాటు చేశామన్నారు. గతంలో నకిలీ విత్తనాలు విక్రయించి అరెస్టు అయిన నేరస్తులపై నిఘా పెట్టామని తెలిపారు. వారి యొక్క కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామన్నారు. నకిలీ విత్తనాలు అమ్మే దుకాణదారులపై పీడీ యాక్టు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. వీడియో కాన్ఫరెన్స్లో వ్యవసాయ శాఖ అధికారులు ఏడీఏ మహేశ్, ఏవోలు శివరామకృష్ణ, మహేశ్, ప్రవీణ్కుమార్, హార్టికల్చర్ శాఖ అధికారి మమత, టాస్క్ఫోర్స్ సీఐ ప్రసాద్, సీసీఎస్ సీఐ మహేశ్, ఇన్స్పెక్టర్ క్రాంతికుమార్, ఏఎస్సై భాస్కర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.