తూప్రాన్ రూరల్ ఏప్రిల్ 1 : గజ్వేల్, సిద్దిపేట తరహాలో ఆధునిక హంగులతో తూప్రాన్ పెద్దచెరువు సుందరీకరణ పనులను చేపట్టాలని, దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ హరీశ్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆర్డీవో కార్యాలయంలో ‘గడా’ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, ఆర్డీవో శ్యాంప్రకాశ్, వివిధ శాఖల అధికారులతో కలిసి ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. పట్టణంలో చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి పనులపై అధికారులతో చర్చించారు. వైకుంఠధామం, మున్సిపల్ భవన నిర్మాణ పనులు ఎంతవరకు వచ్చాయని..? అధికారులు, కాంట్రాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పట్టణాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. పనుల్లో మరింత వేగం పెంచి ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని చెప్పారు. పట్టణంలో చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి పనులను మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్గౌడ్, వైస్ చైర్మన్ శ్రీనివాస్, కమిషనర్ మోహన్ను అడిగి తెలుసుకున్నారు. పట్టణంలో వివిధ వార్డులు, కాలనీల్లో అండర్గ్రౌండ్ డ్రైనేజీలు, సీసీ రోడ్ల నిర్మాణాలు చేపట్టాల్సి ఉందని కలెక్టర్కు వారు వివరించారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ జిల్లాలోని మెదక్, తూప్రాన్, రామాయంపేట, నర్సాపూర్ మున్సిపాలిటీలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామన్నారు.
పరిసరాల పరిశుభ్రతలో చొరవ చూపించాలి..
చెత్తను తడి, పొడిగా వేరు చేయించడంతోపాటు పరిసరాల పరిశుభ్రతను పాటించడంలో మున్సిపల్ సిబ్బంది ప్రత్యేక చొరవ చూపించాలని కలెక్టర్ హరీశ్ సూచించారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో మాస్క్లు ధరించడం, శానిటైజర్ను వినియోగించడం, చేతులను శుభ్రం చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
పట్టణాభివృద్ధికి ఆస్తి పన్ను దోహదం..
పట్టణాల అభివృద్ధికి ఆస్తి పన్ను దోహదపడుతుందని కలెక్టర్ హరీశ్ అన్నారు. పట్టణంలో ఆస్తి పన్ను ఎంత వసూళ్లు చేశారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు 99.64 శాతం పన్ను వసూళ్లు చేశామని మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్గౌడ్, వైస్ చైర్మన్ శ్రీనివాస్, కమిషనర్ మోహన్ సమాధానం ఇవ్వడంతో కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం తూప్రాన్లో అత్యధికంగా వసూళ్లు చేయించిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కమిషనర్ను కలెక్టర్ అభినందించారు. సమావేశంలో పీఆర్ ఈఈ రామకృష్ణారెడ్డి, డీఈ నర్సింహులు, తహసీల్దార్ శ్రీదేవి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.