చేర్యాల, మే 19: రైతులు నష్టపోవద్దు,వానకాలం ముంచుకొస్తుంది, కొనుగోలు కేంద్రా ల నుంచి వెంటనే ధాన్యాన్ని తరలించేందుకు చర్యలు తీసుకోవాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అధికారులను ఆదేశించారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని చుంచనకోటలో మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యేకు రైతులు తమ బాధలు ఏకరువు పెట్టారు. కొనుగోలు కేంద్రంలో సరైన సదుపాయాలు, టార్పాలిన్లు అందుబాటులో లేకపోవడం వల్ల నిల్వ ఉంచిన వడ్లు చెదలు పడుతున్నాయని వాపోయారు.
నెలరోజులుగా ధాన్యం పోసినా మిల్లులకు తరలించడం లేదని పలువురు రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. వర్షాలు వస్తే పంట మొత్తం తడిచిపోతుందని ఎమ్మెల్యే ఎదుట రైతులు కన్నీరుమున్నీరుయ్యారు. దీంతో ఎమ్మెల్యే సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతితో పాటు ఇతర అధికారులకు ఫోన్ చేసి రైతులకు ఎలాంటి నష్టం జరగడానికి వీళ్లేదని, ధాన్యాన్ని సెంటర్ల నుంచి వెంటనే తరలించాలని కోరారు. ప్రజాసమస్యలపై తక్షణమే స్పందించి అన్నదాతకు అండగా నిలిచిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డికి రైతులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ నాయకులు ముస్త్యాల బాల్నర్సయ్య, అంకుగారి శ్రీధర్రెడ్డి అనంతుల మల్లేశం, వీరబత్తిని సదానందం, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.