సిద్దిపేట అర్బన్, ఫిబ్రవరి 7: రాష్ట్రంలోనే అన్ని రంగాల్లో జిల్లా ఆదర్శంగా నిలుస్తున్నది. టెన్త్ ఫలితాల్లో కూడా గత సంవత్సరం మొదటి స్థానంలో నిలిచింది. అయితే ఈసారి కూడా ఎలాగైనా జిల్లా మొదటి స్థానంలో రావాలని అధికారులు, ప్రధానోపాధ్యాయులకు మంత్రి హరీశ్రావు పలుమార్లు దిశానిర్దేశం చేశారు. సాధారణంగా కొంతమంది విద్యార్థులకు ఉపాధ్యాయుడు చెప్పే సమయంలో పాఠం అర్థం కాకపోవచ్చు. ఈ విషయాన్ని గ్రహించిన మంత్రి హరీశ్రావు తరగతి గదిలో అర్థంకాని ఏదైనా పాఠాన్ని మళ్లీ విని అర్థం చేసుకునేలా కేసీఆర్ డిజిటల్ కంటెంట్ అనే కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. అంతే కాకుండా టెన్త్ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి.. వారికి ఉదయం, సాయంత్రం అల్పాహారం అందించేందుకు ఏర్పాట్లు చేశారు. విద్యా బోధనలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సాంకేతికతను అందిపుచ్చుకొని డిజిటల్ మెటీరియల్ను అందుబాటులోకి తీసుకురావడంపై విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సందేహ నివృత్తికి సరికొత్త ఆలోచన
పాఠాన్ని చదివేటపుడు విద్యార్థులకు అనేక సందేహాలు రావడం సహజం. కానీ వారు ఇంటి దగ్గర చదివేటప్పుడు వారికి ఆ విషయాన్ని చెప్పే వారు ఉండరు. అలాంటి ఇబ్బందులను అధిగమించేందుకు, విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేందుకు డిజిటల్ కంటెంట్ చాలా ఉపయోగపడుతున్నది. స్మార్ట్ ఫోన్ నుంచి పుస్తకంపై ముద్రించిన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే సంబంధిత పాఠ్యాంశం పై పూర్తి వివరణ మనకు లభిస్తుంది. ఈ విధానం ద్వారా కఠినమైన పాఠ్యాంశం కూడా సులభంగా విద్యార్థులకు అర్థమవుతున్నది. ఇలాంటి మంచి అవకాశాన్ని జిల్లాలోని టెన్త్ విద్యార్థులకు మంత్రి హరీశ్రావు కల్పించారు. డిజిటల్ విధానంలో దృశ్యం రూపంలో ఒక పాఠాన్ని వినవచ్చు..చూడవచ్చు. సంబంధిత పాఠ్యాంశం వినే సమయంలో విద్యార్థి పాఠశాలకు వెళ్లకపోయినా లేదా అర్థం కాకపోయినా స్మార్ట్ఫోన్ నుంచి క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మనకు కావల్సినప్పుడల్లా ఆ పాఠాన్ని చూసే అవకాశం ఉంటుంది.
‘కేసీఆర్ డిజిటల్ కంటెంట్’ పేరుతో విద్యార్థులకు పంపిణీ
టెన్త్ విద్యార్థులకు కొంచెం కఠినతరంగా ఉండే గణితం, జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం, సాంఘిక శాస్త్రం వంటి నాలుగు సబ్జెక్ట్ల్లో అన్ని పాఠ్యాంశాలకు సంబంధించిన క్యూ ఆర్ కోడ్లను ముద్రించి కేసీఆర్ డిజిటల్ కంటెంట్ పేరుతో విద్యార్థులకు ఇప్పటికే పంపిణీ చేశారు. దీంతో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో టెన్త్ చదివే 11,261 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతున్నది. ఇప్పటికే జిల్లాలోని అన్ని పాఠశాలల విద్యార్థులకు డిజిటల్ మెటీరియల్ను పంపిణీ చేసినట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. గత సంవత్సరం స్ఫూర్తితో.. మంత్రి హరీశ్రావు సూచనల మేరకు ఈ సారి కూడా టెన్త్ ఫలితాల్లో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచేందుకు కృషి చేస్తున్నామని ప్రధానోపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు తెలిపారు.
సందేహాల నివృత్తికి సులభంగా ఉంది..
విద్యార్థులు అర్థం కాని పాఠ్యాంశాన్ని మళ్లీ చూసి అర్థం చేసుకోవడానికి ఈ డిజిటల్ మెటీరియల్ ఎంతగానో ఉపయోగపడుతున్నది. ఇప్పటికే సిలబస్ పూర్తయి ప్రత్యేక తరగతులు ప్రారంభించాం. ఇంటి దగ్గర విద్యార్థులకు సందేహాలు వచ్చినపుడు స్కాన్ చేసి వాటిని తిరిగి అర్థం చేసుకుంటారు. మళ్లీ వినడం, చూడడం ద్వారా విద్యార్థులు వాటిని మర్చిపోయే అవకాశం తక్కువగా ఉంటుంది. డిజిటల్ స్కానింగ్ విధానం విద్యార్థులకు ఎంతగానో తోడ్పడుతున్నది.
– చంద్రమౌళి, గణితం
ఉపాధ్యాయుడు, రాఘవాపూర్ ఉన్నత పాఠశాల సులభంగా అర్థమవుతున్నది..
ఒక్కొక్క పాఠం నుంచి అన్ని క్యూఆర్ కోడ్లు ఉన్నాయి. ఏది అర్థం కాకపోయినా వెంటనే స్కాన్ చేసి చూస్తున్నాం. చాలా బాగా అర్థమవుతున్నది. మొదట్లో ఎలా స్కాన్ చేయాలో అర్థం కాకపోతుండే. ఇపుడు ఉపాధ్యాయులు అవగాహన కల్పించిన తర్వాత చాలా ఈజీ అనిపిస్తున్నది.
– ఎస్.అశ్విని, టెన్త్ విద్యార్థిని, జడ్పీ హెచ్ఎస్ రాఘవాపూర్
రివిజన్కు ఎంతో బాగుంది..
గతంలో క్లాస్లో విన్న పాఠాలు ఒక్కోసారి మర్చిపోతాం. అలా మర్చిపోయిన పాఠాలను మళ్లీ విని అర్థం చేసుకునేందుకు మాకు ఇచ్చిన డిజిటల్ మెటీరియల్ చాలా చక్కగా ఉపయోగపడుతున్నది. ఇంతమంచి అవకాశం కల్పించిన మంత్రి హరీశ్రావు సార్కు మా పాఠశాల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు.
– టి.శృతి, టెన్త్ విద్యార్థిని, జడ్పీహెచ్ఎస్ రాఘవాపూర్