గజ్వేల్, ఏప్రిల్ 6: గులాబీ అధినేత, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై మూడు రోజుల క్రితం కాంగ్రెస్ నాయకులు చేసిన దాడిని నిరసనగా బీఆర్ఎస్ ఇచ్చిన బంద్ సక్సెస్ అయ్యింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోని అద్దాలు ధ్వంసం చేసిన కాంగ్రెస్ నాయకుల తీరుకు నిరసనగా బంద్ చేపట్టారు. సోమవారం అన్ని వర్గాల వ్యాపారులు, ప్రజలు, ప్రైవేట్ పాఠశాల సిబ్బంది పాల్గొనడంతో విజయవంతంగా ముగిసింది. తెల్లవారుజాము న గజ్వేల్-ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ డిపో నుంచి బస్సు లు బయటకు రాకుండా గేట్ ఎదుట బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి ఆధ్వర్యంలో బైఠాయించి ఆందోళన చేపట్టారు. డిపో ఎదుట ఉదయం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు బీఆర్ఎస్ నాయకులు బస్సులు బయటకు రాకుండా బైఠాయించారు. దీంతో బస్సులు రోడ్డెక్కకపోవడంతో ప్రయాణికులకు ఇబ్బందులు కలుగుతాయనే ఉద్దేశంతో పోలీసులు వంటేరు ప్రతాప్రెడ్డిని అదుపులోకి తీసుకొని నచ్చజెప్పారు. దీంతో అక్కడి నుంచి పార్టీ కార్యకర్తలు ప్రజ్ఞాపూర్ చౌరస్తా మీదుగా గజ్వేల్లోని తూప్రాన్ మార్గం, కొటమైసమ్మ మార్గం మీదుగా పిడిచేడ్ రోడ్డు వెంబడి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. పట్టణంలోని వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. పట్ణణంలోని ప్రధాన చౌరస్తాల వద్ద బీఆర్ఎస్ శ్రేణులు కేసీఆర్కు అనుకూల నినాదాలు చేస్తూ కాంగ్రెస్ వైఫల్యాలపై నినదించారు.
గజ్వేల్ బంద్ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు శాంతియుతంగా నిరసన ర్యాలీలు తీశారు. పట్టణవాసులు బంద్ పాటించేలా ముందుగానే సమాచారం ఇచ్చారు. పది గంటల ప్రాంతంలో డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి పార్టీ కార్యకర్తలతో కలిసి పీఎస్ ఎదుట నుంచి వెళ్తుండటంతో గమనించిన పోలీసులు ఎక్కడికి వెళ్లవద్దని సూచించారు. అదే మార్గంలో ర్యాలీగా వస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు కేసీఆర్కు అనుకూల నినాదాలు చేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పరిస్థితిని గమనించిన పోలీసులు డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డిని ఇంటికి పంపించి ఆ మార్గంలో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అదే మార్గంలో ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయానికి భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు తరలివెళ్తుండటంతో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు మొహరించారు. డీసీసీ అధ్యక్షురాలు బయటకు రాకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డెక్కకుండా అడ్డుకున్నారు. కొద్ది నిమిషాల వ్యవధిలోనే వేలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలతో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి పోలీస్ స్టేషన్, అంబేద్కర్ చౌరస్తా నుంచి ఇందిరా పార్కు, ఆర్టీసీ బస్టాండ్ మీదు గా తిరిగి క్యాంపు కార్యాలయానికి భారీ ర్యాలీతో చేరుకున్నారు. ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా అదనపు సీపీ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
బీఆర్ఎస్ ఇచ్చిన గజ్వేల్ బంద్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. తెల్లవారుజామున ఐదు గంటల నుంచే పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. తెల్లవారుజామున ఆర్టీసీ డిపో ఎదుట సీఐలు రవికుమార్, ముత్యంరాజు, రవిరాజు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. గజ్వేల్, ప్రజ్ఞాపూర్ చౌరస్తాలో ప్రత్యేక పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి వంద మీటర్లకు ఒకరు చొప్పున పోలీసులు విధుల్లో ఉన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, డీసీసీ అధ్యక్షురాలు ఇంటి వద్ద, ఆర్టీసీ డిపో, ప్రధాన చౌరస్తాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు పోలీస్ బందోబస్తు కొనసాగింది.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు చేసిన దాడికి నిరసనగా బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం బంద్లో బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కేసీఆర్ పదేండ్లలో చేపట్టిన అభివృద్ధిని గుర్తు చేశారు. కాంగ్రెస్ చేస్తున్న మోసపూరిత వాగ్దానాలను గుర్తు చేస్తూ ర్యాలీ చేపట్టారు.