సిద్దిపేట, మే 7: ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు సిద్దిపేట క్యాంపు కార్యాలయం ఆదివారం జైశ్రీరామ్,జై హనుమాన్ నామస్మరణతో మార్మోగింది. ఎప్పుడూ సందర్శకులతో బిజీగా ఉండే క్యాంపు కార్యాలయం ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన సుమారు 2వేల మంది అంజన్న దీక్షాధారులతో కిక్కిరిసిపోయింది.
అర్చకుడు చిలకమర్రి వెంకటరమణాచార్యుల ఆధ్వర్యంలో ఆంజనేయస్వామికి పంచామృతాభిషేకం, అర్చన, హనుమాన్ స్వాములతో భజన క్యాం పు కార్యాలయమంతా రామమయంగా మారింది.అభిషేకం, పూజల అనంతరం మంత్రి హరీశ్రావు భిక్షను ప్రారంభించి స్వాములకు స్వయంగా వడ్డించారు. అనంతరం హనుమాన్ దీక్షాధారుల ఆశీర్వాదం తీసుకున్న మంత్రి వారికి తాంబూలాన్ని అందించారు. అంజన్న దయతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని మంత్రి కోరారు.