సంగారెడ్డి కలెక్టరేట్, డిసెంబర్ 14: ‘మనఊరు-మనబడి’ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ, ఇంజినీరింగ్ శాఖల అధికారులతో మనఊరు-మనబడి కార్యక్రమ పనుల పురోగతిపై అదనపు కలెక్టర్ రాజర్షి షాతో కలిసి సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యా విధానం మెరుగు పర్చడంతో పాటు ప్రభుత్వం మనఊరు-మనబడి కార్యక్రమం కింద పాఠశాలల రూపురేఖలు మార్చి, కార్పొరేట్కు దీటుగా విద్యార్థులకు ప్రభుత్వం వసతులను సమకూర్చుతున్నదని గుర్తు చేశారు. ప్రభుత్వ లక్ష్యం నెరవేరేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధతో పని చేసి ఆయా పనులను త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలన్నారు.
మనఊరు-మనబడి కింద పనులు పూర్తయిన పాఠశాలలను ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పనులు పూర్తయిన వెంటనే సం బంధిత ఇంజినీరింగ్ అధికారులు బిల్లులను ఎఫ్టీవోలో నమోదు చేయాలని సూచించారు.
అవసరమైతే రాత్రింబవళ్లు పనులు కొనసాగాలి
జిల్లాలో మనఊరు-మనబడి కింద పనులు పూర్తి కాని పాఠశాలల్లో రాత్రింబవళ్లు పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. పనుల నాణ్యతలో అధికారుల నిరంతర పర్యవేక్షణ తప్పనిసరన్నారు. వేగవంతంగా పనులను పూర్తి చేసేలా ఆయా ఇంజినీరింగ్ ఏజెన్సీలతో కోఆర్డినేషన్ చేసుకొని పనులు చేయించాలని విద్యాశాఖ అధికారిని కలెక్టర్ ఆదేశించారు.
పనుల పురోగతిని ఎప్పటికపుడు పర్యవేక్షిస్తూ త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి నాంపల్లి రాజేశ్, జడ్పీ సీఈవో ఎల్లయ్య, పంచాయతీరాజ్, ఆర్ఆండ్బీ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
‘దళిత బంధు’ లబ్ధిదారులు ఆర్థికంగా ఎదగాలి
దళిత బంధు పథకం లబ్ధిదారులు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా చేయూతనందించాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్ క్యాంపు కార్యాలయంలో దళితబంధు లబ్ధిదారుల యూనిట్ల అభివృద్ధిపై ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, నియోజకవర్గ ప్రత్యేకాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ నియోజకవర్గం, యూనిట్ వారీగా ఆయా లబ్ధిదారుల ఆర్థిక అభివృద్ధి, తీసుకున్న యూనిట్ సద్వినియోగం చేసుకుంటున్నారా? ఎంత ఆదాయం వస్తుంది? తదితర విషయాలను నియోజకవర్గ ప్రత్యేక అధికారులను అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులు దళితబంధు పొందక ముందు ఉన్న స్థితిగతులు, పొందిన తరువాత స్థితిగతులను ఆయా నియోజకవర్గ ప్రత్యేకాధికారులు పర్యవేక్షించి, వారికి కావాల్సిన సపోర్ట్ ఏంటనేది పరిశీలించాలన్నారు. ఆ మేరకు వారికి చేయూత అందించాలని కలెక్టర్ ఆదేశించారు.
లబ్ధిదారుడు దళితబంధులో ఎంచుకున్న యూనిట్ను పూర్తిస్థాయిలో వినియోగించుకొని ఉన్నతంగా ఎదిగేందుకు వారికి అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రాజర్షీ షా, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబూరావు, దళితబంధు నియోజకవర్గ ప్రత్యేకాధికారులు పాల్గొన్నారు.