జిల్లా అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషిచేస్తున్నారని, సంక్షేమ పథకాలు గడపగడపకూ అందుతున్నాయని మెదక్ జడ్పీచైర్పర్సన్ హేమలత అన్నారు. నూతన సమీకృత కలెక్టరేట్లో జడ్పీచైర్పర్సన్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు లేవనెత్తిన పలు ప్రశ్నలకు అధికారులు సమాధానమిచ్చారు. కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ గతంలో సమస్యల పరిష్కారం కోసం ప్రజలు సంగారెడ్డి, సిద్దిపేటకు వెళ్లేవారని, నేడు జిల్లాకేంద్రంలోనే అన్ని వసతులతో నూతన కలెక్టరేట్ను నిర్మించుకున్నామన్నారు. ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాట్లాడుతూ రైతును రాజు చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమని, మంత్రి హరీశ్రావు కృషితో మెదక్, గజ్వేల్లో రేక్ పాయింట్ ఏర్పాటు చేసి రైతులకు సకాలంలో ఎరువులు అందిస్తున్నామన్నారు. పలువురు అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి సూచించారు. ఎరువులు, యూరియా కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రుణమాఫీ ప్రక్రియ త్వరితగతిన పూర్తయ్యేలా చూస్తామని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు.
మెదక్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ ప్రభుత్వంలోనే అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయని మెదక్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ ర్యాకల హేమలతాశేఖర్గౌడ్ అన్నారు. సోమవారం జిల్లా సమీకృత కలెక్టరేట్ సముదాయంలో జడ్పీ చైర్మపర్సన్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నూతన సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జడ్పీ సమావేశం నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ర్టం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ జిల్లాలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఒకప్పుడు సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు ప్రజలు వెళ్లి సమస్యలు పరిష్కరించుకునేవాళ్లని, ఇప్పుడు మెదక్ జిల్లా కేంద్రంలోనే కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నామన్నారు. జిల్లా అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం జడ్పీటీసీ విజయ్కుమార్ మాట్లాడుతూ వ్యవసాయానికి సంబంధించి యంత్రలక్ష్మి పథకాన్ని నిలిపివేసిందని ప్రశ్నించగా, అందుకు వ్యవసాయ శాఖ అధికారి గోవింద్ సమాధానమిస్తూ జిల్లాలో 3 లక్షల ఎకరాల్లో సాగైందని, గతంతో పోల్చితే 6 వేల ఎకరాల్లో వరి సాగు పెరిగిందన్నారు. రైతులకు ఎరువుల కొరత లేకుండా చూస్తున్నామని, రైతుబంధు పథకం కింద 2,59 లక్షల మందికి రూ.194.43 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. రైతుబీమా 5,215 మందికి రూ.260.75 కోట్లు అందజేసినట్లు పేర్కొన్నారు. పంట రుణమాఫీ 78,669 మందికి రూ.391.50 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశారని, 51వేల మందికి రూ.220 కోట్లు రెన్యువల్ అయ్యాయని తెలిపారు. అనంతరం చేగుంట ఎంపీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ కేజీబీవీ పాఠశాలల్లో స్ట్రీట్లైట్లు ఏర్పాటు చేయాలని, నైట్ వాచ్మెన్ను నియమించాలని సభదృష్టికి తీసుకొచ్చారు. డీఈవో రాధాకిషన్ సమాధానమిస్తూ కేజీబీవీల్లో సమస్యలను పరిష్కరిస్తామన్నారు. నార్సింగి జడ్పీటీసీ మాట్లాడుతూ ఆసరా పింఛన్ల విషయంలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని సభ దృష్టికి తీసుకొచ్చారు. నిజాంపేట జడ్పీటీసీ విజయ్కుమార్ మాట్లాడుతూ మెదక్కు మెడికల్ కళాశాల అసలు మంజూరైందా అని ప్రశ్నించగా, వెంటనే జిల్లా కేంద్ర దవాఖాన సూపరింటెండెంట్ చంద్రశేఖర్ స్పందించారు. మెదక్కు మెడికల్ కళాశాల మంజూరైందని, మెడికల్ కళాశాల ఏర్పాటుకు ఎన్ఎంసీ బృందం పర్యటిస్తుందని, కళాశాలకు సంవత్సరం, హాస్పటల్కు రెండు సంవత్సరాల సమయం పడుతుందని వివరించారు.
అధికారులు ప్రజలు, ప్రజాప్రతినిధుల సమస్యలను పరిష్కరించాల్సింది పోయి వారికి ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి ఆయా శాఖల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు రాజకీయం చేయాలంటే ఉద్యోగాలకు రాజీనామా చేసి రావాలన్నారు. సంగారెడ్డి జిల్లాకు సీఎం కేసీఆర్ వచ్చిన సందర్భంగా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీలకు రూ.25 లక్షల చొప్పున మంజూరు చేశారు. వాటికి సంబంధించిన బిల్లుల కోసం మెదక్ కలెక్టరేట్లో అడిగితే పంచాయతీరాజ్ ఈఈ తమ వద్దకు వెళ్తే ఫండ్స్ లేవని సీపీవో దగ్గరకు వెళ్లాలని పంపించారని తెలిపారు. సీపీవో వద్దకు వెళ్తే నిధులు రాలేదని సమాధానం చెబుతున్నారన్నారు. అధికారులు ప్రజల సమస్యలతోపాటు ప్రజాప్రతినిధుల సమస్యలు పరిష్కరించాలని సూచించారు. లేదంటే సెలవు పెట్టి వెళ్లాలని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేజీబీవీలను వెంటనే ప్రారంభించాలని సూచించారు.
రైతును రాజు చేయాలనే సంకల్పంతోనే సీఎం కేసీఆర్ ఉన్నారని ఎమ్మెల్సీ యాదవరెడ్డి తెలిపారు. జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పాటుకు ముందు రైతులు ఎరువుల కోసం ఎన్నో ఇబ్బందులు పడేవారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎరువులు, యూరియా సకాలంలో అందించే ఏర్పాట్లు చేస్తున్నదన్నారు. మంత్రి హరీశ్రావు కృషితో మెదక్, గజ్వేల్లో ఎరువుల నిల్వ కోసం రేక్ పాయింట్ను ఏర్పాటు చేయించినట్లు గుర్తు చేశారు. హైదరాబాద్లోని సనత్నగర్లో గోదాంలను ఏర్పాటు చేసి అక్కడి నుంచి నేరుగా మెదక్ జిల్లాకు ఎరువులు, యూరియా సరఫరా అవుతుందని వివరించారు. వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు అందుబాటులో ఉంటూ వ్యవసాయంపై అవగాహన కల్పిస్తున్నారన్నారు. రైతులు పండించిన పంటను మద్దతు ధర కల్పించి చివరి గింజ వరకూ కొన్న ఏకైక సర్కారు బీఆర్ఎస్ ప్రభుత్వమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు చేసిందేమీలేదని దుయ్యబట్టారు. కేంద్రం రాష్ర్టానికి ఎన్ని విద్యాలయాలు ఇచ్చిందని ఎమ్మెల్సీ ప్రశ్నించారు. నిజాంపేట జడ్పీటీసీ విజయ్కుమార్ సమావేశంలో బురజదల్లే ప్రయత్నం చేస్తున్నారని, ఇలాంటివి మానుకోవాలని చురకలు అంటించారు. ‘మనఊరు-మనబడి’ కింద జిల్లాలో 90 శాతం పాఠశాలల్లో పనులు పూర్తయ్యాయని, కొన్నిచోట్ల ఈ కార్యక్రమం కింద పాఠశాలలను ప్రారంభించామని, జిల్లాలో ఎన్నో రెసిడెన్షియల్ స్కూళ్లు, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలు ఏర్పాటు చేశారని చెప్పారు.
మెదక్ జిల్లా వ్యవసాయ రంగంలో ముందుందని మెదక్ కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. రైతులకు సంబంధించిన యూరియా నిల్వలను ప్రతిరోజూ మొబైల్లో తనకు మెసేజ్ వస్తుందని, యూరియా విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామన్నారు. పీఏసీఎస్లతోపాటు ఫర్టిలైజర్ దుకాణాల్లో యూరియా, ఎరువులు అందుబాటులో ఉంచుతున్నట్లు పేర్కొన్నారు. ఆన్లైన్లో స్టాక్ వివరాలు ప్రతిరోజూ అధికారులు తెలుపతున్నట్లు వివరించారు. రుణమాఫీ రెన్యువల్ విషయంలో రాష్ర్టంలో మెదక్ జిల్లా 60 శాతం దాటిందని, బ్యాంక్ అధికారులతో, వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి త్వరితగతిన రుణమాఫీ పూర్తయ్యేలా చూస్తామన్నారు. సమావేశంలో జడ్పీ సీఈవో శైలేశ్, జిల్లా అధికారులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు తదితరులు పాల్గొన్నారు.