మెదక్ రూరల్, డిసెంబర్ 8: డీసీఎం, ద్విచక్రవాహనం ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన మెదక్ పోలీస్స్టేషన్ పరిధిలోని పాతూరులో గురువారం జరిగింది. మెదక్ రూరల్ ఎస్సై మోహన్రెడ్డి కథనం ప్రకారం.. హవేళీఘనపూర్ మండలం శమ్నాపూర్ గ్రామానికి చెందిన రాజయ్యాల సిద్దయ్య(50) పాతూరులో కిరాణా దుకాణం నడుపుతూ జీవిస్తున్నాడు.
మెదక్ వెళ్లి తిరిగొస్తుండగా పాతూరు శివారులో రామాయం పేట్ వైపు నుంచి వస్తున్న డీసీఎం ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనం నడుపుతున్న సిద్దయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మెదక్ రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.