అమీన్పూర్, ఫిబ్రవరి 19: బీరంగూడ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో శివరాత్రిని పురస్కరించుకుని ఆదివారం స్వామి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. రెండో రోజు సైతం జాతరకు భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. మల్లికార్జునుడికి రుద్రాభిషేకం, అమ్మవారికి లలితా సహస్ర నామార్చన చేశారు. సాయంత్రం స్వామి వారిని నంది వాహన సేన ఊరేగింపుతో భక్తులతో ఈ ప్రాంతమంతా కిటకిటలాడింది. రాత్రి ఎనిమిది గంటలకు హారతి మంత్రపుష్పాలు తదితర కార్యక్రమాలు చేపట్టారు. మున్సిపల్లోని జయలక్ష్మి నగర్ కాలనీలో పట్లోల్ల భాస్కర్రెడ్డి ఆధ్వర్యంలో శివపార్వతుల కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దీంతో పాటే బీరంగూడలోని శంభులింగేశ్వర ఆలయంలో కల్యాణం చేశారు. మహా శివరాత్రి సందర్భంగా శివ భక్తులు ఉపవాస దీక్షలు చేసి స్వామి సన్నిధిలో విరమించారు. శివరాత్రి పెద్దఎత్తున భక్తులు జాగారం చేశారు.
వైభవంగా స్వామి కల్యాణం
మహా శివరాత్రి పర్వదినాన రెండో రోజు మల్లికార్జునుడి కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. కల్యాణంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సతీమణి యాదమ్మ ఆలయ మాజీ చైర్మన్ తులసిరెడ్డి దంపతులు, కమిషనర్ సుజాత, ఆలయ కమిటీ సభ్యుడు దాస్యాదవ్తోపాటు కౌన్సిలర్లు బాశెట్టి కృష్ణ, కల్పన ఉపేందర్రెడ్డి, బిజిలీ రాజు, భక్తులు పాల్గొన్నారు.
స్వామిని దర్శించుకున్న ఎస్పీ రమణకుమార్
బీరంగూడ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి జాతరను సంగారెడ్డి ఎస్పీ రమణకుమార్ సందర్శించారు. అనంతరం స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. జాతర విజయవంతంగా పూర్తి చేసేంతవరకు కట్టు దిట్టమైన భద్రత చర్యలు తీసుకుని, ఎక్కడా సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త చర్యలు చేపట్టారు.