కొండపాక (కుకునూరుపల్లి), మే 30: మల్లన్న సాగర్ అటవీ ప్రాంతం ఇప్పడు ప్రకృతి ప్రేమికులను పరవశింపజేసేందుకు ముస్తాబవుతున్నది. మల్లన్న వనం పేరుతో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తి కావస్తున్నాయి. ఇప్పటికే మల్లన్న సాగర్ నీటితో ప్రాజెక్టు పరిసరాల్లో ఉన్న సుమారు 6 వేల ఎకరాల మేర అటవీ స్వరూపం పూర్తిగా మారిపోయింది. నిండు వేసవిలోనూ పచ్చదనంతో అలరారుతోంది. ప్రభుత్వం మల్లన్న సాగర్ అటవీ ప్రాంతాన్ని కోట్లాది రూపాయలు ఖర్చు చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతోంది.
సిద్దిపేట జిల్లాకు ఆకుపచ్చ తోరణం..
సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని మల్లన్న సాగర్ బ్యాక్ వాటర్ను అనుకొని ఉన్న అటవీ ప్రాంతాన్ని మల్లన్న వనంగా అభివృద్ధి చేస్తున్నారు. జిల్లాకేంద్రం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో రాజీవ్ రహదారి పక్కనే ఉన్న ఈ అటవీ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ ప్రాంతంలో 4794.47 హెక్టార్లలో అడవి విస్తరించి ఉండగా, మల్లన్న సాగర్లో 1327.45 హెక్టార్ల అటవీ ప్రాంతం ముంపునకు గురైంది. మిగతా 3467.02 హెక్టార్ల అటవీ ప్రాంతాన్ని ప్రస్తుతం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నారు. లకుడారం, మాత్పల్లి స్టేజీ నుంచి అటవీ ప్రాంతం ద్వారా మల్లన్న సాగర్ చేరుకోవడానికి రహదారిని ఏర్పాటు చేస్తున్నారు.
ప్రకృతి ప్రేమికులకు కనువిందు…
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మల్లన్న సాగర్ను చూసేందుకు ఇప్పటికే పర్యాటకులు వేలాదిగా తరలివస్తున్నారు. దీనికి తోడు ఈ ప్రాజెక్టును ఆనుకొని ఉన్న అటవీ ప్రాంతాన్ని ఆధునికరించడంతోపాటు పలు అభివృద్ధి పనులు ప్రారంభించడంతో మల్లన్న వనానికి మరింత క్రేజ్ పెరిగింది. సుమారు 3,500 హెక్టార్ల అటవీ ప్రాంతాన్ని సుందర వనాలుగా, ఔషధ వనాలుగా, సాహస వనాలుగా (ట్రెక్కింగ్), వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నారు. అభయారణ్యం తరహాలో అటవీ ప్రాంతాన్ని తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రస్తుతం ఈ అడవిలో కొండ గొర్రెలు, అడవి పందులు, నెమళ్లు, జింకలు, కుందేళ్లు, హైనాలు, నక్కలు, తోడేళ్లు ఉండగా కొన్ని మాసాల క్రితం ఓ చిరుత కూడా సంచరించిన ఆనవాళ్లు లభించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. వేసవిలో వీటి దప్పిక తీర్చడం కోసం అటవీ ప్రాంతంలో నీటి వసతులను ఏర్పాటు చేశారు. గుట్టల నుంచి కిందకు పారే వర్షం నీటితో భూమి కోతకు గురికాకుండా ఉండడం కోసం లోతట్టు ప్రాంతాల్లో చెక్డ్యాంలను నిర్మించారు. అటవీ భూములు కబ్జాకు గురికాకుండా హద్దులను గుర్తించి వాటి చుట్టూ కందకాలు తవ్వించి కంచెలు ఏర్పాటు చేశారు.
అడవి మధ్యలో సరస్సు..
మల్లన్న సాగర్ను ఆనుకొని ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో గుట్టల మధ్య ఉన్న అంకారెడ్డి చెరువు ప్రకృతి అందాలకు నెలవుగా మారింది. 65 అడుగుల లోతు అర కిలోమీటర్ పొడవున్న ఈ చెరువులో 1.5 టీఎంసీల నీరు నిల్వ ఉంటుందని అధికారులు అంచనా వేశారు. నిండు వేసవిలోనూ ఈ చెరువులో 1.5 టీఎంసీల నీరు నిల్వ ఉంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. నిండు వేసవిలోనూ నీరు నిల్వ ఉండడం అంకారెడ్డి చెరువు ప్రత్యేకత. ఈ అటవీ ప్రాంతంలో పదుల సంఖ్యలో చిన్నా, పెద్ద నీటి కుంటలు ఉన్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. వాన నీళ్లు ఎక్కడివి అక్కడే నిలిచేలా కుంటలను పునరుద్ధరిస్తున్నారు. ఇవి అటవీ జంతువుల దప్పిక తీర్చడానికి ఉపయోగపడతాయి. ఇప్పటికే ఈ అడవిలో సుమారు 15కు పైగా చెక్ డ్యామ్లను నిర్మించారు. దీంతో అడవిలోని నీటి ఊటలు గుట్టల్లో నుంచి ఏడాది మొత్తం జాలు వారుతాయి.
అటవీ అందాల వీక్షణకు వాచ్ టవర్లు..
అడవిలోని ఎత్తైన ప్రాంతంలో వాచ్ టవర్లను నిర్మించారు. ఈ టవర్ల ద్వారా అటవీ ప్రాంతంపై నిఘా ఉంచడమే కాకుండా పర్యాటలకు ప్రకృతిని చూసి పరవశించేందుకు ఉపయోగపడతాయి. ఎత్తైన వాచ్ టవర్లపైనుంచి పర్యాటకులు మల్లన్న సాగర్ రిజర్వాయర్ అందాలను చూడవచ్చు. లకుడారం, మాత్పల్లి స్టేజీల వద్ద రాజీవ్ రహదారి పక్కనే నిర్మిస్తున్న ప్రధాన ప్రవేశ మార్గాన్ని ప్రత్యేక డిజైన్తో తీర్చిదిద్దుతున్నారు. ఇక్కడ టికెట్ కౌంటర్, సెక్యూరిటీ గది, రెస్ట్ రూమ్, ఇతర గదుల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. అటవీలో మార్గంలో పర్యాటకులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు.