ఝరాసంగం, మార్చి 6: సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని మొగిలి (కేతకీ) వనంలో వేలిసి, దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఝరాసంగం కేతకీ సంగమేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు గురువారం నుంచి వైభవంగా ప్రారంభంకానున్నాయి. ఉత్సవాలకు తెలుగు రాష్ర్టాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పెద్దఎత్తున భక్తులు రానున్నారు. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అమృతగుండంలో స్నానాలు ఆచరించే వారికి ప్రత్యేక చర్యలు, షవర్లు, మొబైల్ టాయిలెట్లు, తాగునీరు, పార్కింగ్, విద్యుత్ సౌకర్యం వంటి అన్ని ఏర్పాట్లు చేశారు. వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో అంబులెన్స్తోపాటు వైద్యశిబిరం, మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో పారిశుధ్య నిర్వహణ, జహీరాబాద్ ఆర్టీసీ డిపో నుంచి 15 నిమిషాలకు ఒక బస్సు చొప్పున నడిపేందుకు చర్యలు తీసుకున్నారు. బారికేడ్లు, ప్రత్యేక క్యూలైన్లు, అదనంగా సీసీ కెమెరాలు, లడ్డూ కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఆలయంలో పౌరసంబంధాలశాఖ ఆధ్వర్యంలో పాటలు, చలనచిత్ర ప్రదర్శన, డ్రామా వంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. డీఎస్పీ ఆధ్వర్యంలో ఇద్దరు సీఐలు, ఆరుగురు ఎస్సైలతోపాటు వందమంది సిబ్బంది బందోబస్తు నిర్వహించనున్నారు. వాహనాల పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేశారు.