పాపన్నపేట, ఫిబ్రవరి 9: రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన ఏడుపాయల వనదుర్గాభవానీ మాత సన్నిధిలో మాఘ అమావాస్య సందర్భంగా మాఘ స్నానాలు పెద్దఎత్తున కొనసాగాయి. శుక్రవారం తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తదితర ప్రాం తాల భక్తులు ఏడుపాయలకు చేరుకొని మంజీరా నది పాయల్లో పుణ్యస్నానాలు చేసి దుర్గామాతను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవాలను ఆలయ చైర్మన్ బాలాగౌడ్, ఈవో మోహన్ రెడ్డి ప్రారంభించగా, ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఉదయాన్నే 5 గంటలకు ఆలయ అర్చకులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు చేసి మంగళహారతి, పంచామృతాలు, అభిషేకాలు, పట్టువస్ర్తాలు సమర్పించారు. భక్తులు అమ్మవారికి ఒడిబియ్యం, తలనీలాలు సమర్పించారు. సంతానం కోసం భక్తులు సంతాన గుండంలో స్నానాలాచరించి మొక్కులు చెల్లించుకున్నారు. పలువురు భక్తులు డప్పు చప్పుళ్లతో నృత్యాలు చేస్తూ అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా మెదక్ డీఎస్పీ ఫణీందర్, పాపన్నపేట ఎస్సై నరేశ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తు చర్యలు తీసుకున్నారు.
యాదాద్రి ఆలయం తరహాలో ఏడుపాయల వనదుర్గాభవానీ మాత ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నా రు. శుక్రవారం కుటుంబసమేతంగా ఆయన అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమ్మవారి కటాక్షంతో తన కుమారుడు మైనంపల్లి రోహిత్ మెదక్ ఎమ్మెల్యేగా గెలుపొందారని, అమ్మవారి క్షేత్రా న్ని యాదాద్రి తరహాలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. మహాశివరాత్రి జాతరకు రూ. 2 కోట్లు ప్రత్యేక నిధులు కేటాయించాలని సీఎం రేవంత్రెడ్డిని కోరామని, అం దుకు ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. త్వరలో ఏడుపాయలకు సీఎంను తీసుకొస్తానన్నారు. ఏడుపాయల్లో సొంత నిధులతో ప్రెస్క్లబ్ భవనాన్ని నిర్మిస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట జిల్లా కిసా న్ సెల్ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు గోవింద్ నాయక్, జిల్లా నాయకుడు ప్రశాంత్ రెడ్డి, మండల కో-ఆప్షన్ గౌస్, శ్రీకాంత్ రెడ్డి, ఎంపీటీసీ శ్రీనివాస్ ఉన్నారు.