కంది, జనవరి 13: సంగారెడ్డి శివారులోని వైకుంఠపుర దివ్య క్షేత్రంలో గోదా రంగనాథుల కల్యాణ మహోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ ప్రధాన అర్చకుడు కందాడి వరదాచార్యుల ఆధ్వర్యంలో కన్నులపండువగా కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. సంగారెడ్డి కలెక్టర్ శరత్ దంపతులు పట్టువస్త్రాలు సమర్పించి, కల్యాణంలో పాల్గొన్నారు.
వేద పండితుల మంత్రోచ్ఛరణలతో వైకుంఠపురం మారుమోగింది. గోదా రంగనాథుల విశిష్టతను తెలుపుతూ అర్చకులు కల్యాణం జరిపించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రవీంద్రారెడ్డి దంపతులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులకు తీర్థప్రసాదాలతో పాటు అన్నదానం చేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జై శ్రీమన్నారాయణ చారిటబుల్ ట్రస్టు సభ్యులు ఏర్పాట్లుచేశారు.
ఇబ్రహీంపూర్లో..
చేగుంట, జనవరి13: చేగుంట మండలంలోని ఇబ్రహీంపూర్ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో గోదా రంగనాథస్వామి కల్యాణోత్సవాన్ని ఆలయ అర్చకులు శుక్రవారం వైభవంగా నిర్వహించారు. వేంకటేశ్వరస్వామి ఆలయ వంశపార్యంపర్య ధర్యకర్త గోల్కండ కిషన్రావు దేశ్ముఖ్ ఆధ్వర్యంలో స్వామికి అమ్మవారికి పట్టు వస్ర్తాలు సమర్పించారు. సుగంధ ద్రవ్యాలతో అభిషేకించి, రకరకాల పూలతో అలంకరించారు. ఈ వేడుకల్లో భక్తులు స్వామి, అమ్మవారి కల్యాణాన్ని తిలకించి, మొక్కలు చెల్లించుకున్నారు.