వినాయకచవితి పండుగను ఘనంగా నిర్వహించేందుకు మెదక్, సంగారెడ్డి జిల్లాలవాసులు సిద్ధమయ్యారు. విగ్రహాల ప్రతిష్ఠకు మండపాలను ఏర్పాటు చేసి అందంగా అలంకరించారు. నేటి నుంచి ప్రారంభమయ్యే నవరాత్రోత్సవాలను వైభవంగా జరుపుకొనేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. పూజా, అలంకరణ సామగ్రి కొనుగోళ్లతో మార్కెట్లలో సందడి నెలకొన్నది. షోలాపూర్ వినాయకుడు, కోల్కతా గణేశ్ , సుందర్ కళాకార్ గణపతి, పగిడి గణేశ్ తదితర రూపాల్లో తయారుచేసిన విగ్రహాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ప్రధానంగా పర్యావరణానికి మేలు చేసే మట్టి ప్రతిమలు కొనుగోలు చేసేందుకు అధికశాతం ప్రజలు ఆసక్తి చూపారు. అనేక చోట్ల ప్రజాప్రతినిధులు, దాతలు ఉచితంగా పంపిణీ చేశారు.
మెదక్ మున్సిపాలిటీ/ మెదక్ రూరల్/ అందోల్/ నర్సాపూర్, ఆగస్టు 30 : వినాయక నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో మండపాలు ముస్తాబయ్యాయి. రకరకాల ప్రతిమల్లో స్వామివారి ప్రతిమలు ఆకట్టుకుంటున్నాయి. విఘ్నేశ్వరుడి విగ్రహాలు, పండుగ సామగ్రి విక్రయాలతో మార్కెట్లు సందడిగా మారాయి. తొమ్మిది రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలకు పోలీస్ శాఖ వారు ఇప్పటికే నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. చిన్నాపెద్దా తేడా లేకుండా ఎంతో ఉత్సాహంగా జరుపుకొనే ఈ వేడుక నేటి నుంచి ప్రారంభంకానున్నది.
ప్రకృతిని గౌరవించడమే భగవంతుడి ఆరాధన
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి
పటాన్చెరు టౌన్, ఆగస్టు 30: ప్రకృతిని గౌరవించడమే భగవంతుడి ఆరాధన అని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. మంగళవారం పటాన్చెరు డివిజన్ 113లో కార్పొరేటర్ మెట్టు కుమార్యాదవ్, జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాటు చేసిన మట్టి వినాయకుల ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్టణవాసులకు ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను అందజేసి మాట్లాడారు. బొజ్జగణపయ్య నవరాత్రి ఉత్సవాలు అనగానే అందరిలో భక్తిభావం కనిపిస్తుందన్నారు. గణపయ్య విగ్రహాలకు జరిగే పూజల్లో పాల్గొనడం అందరికీ ఎంతో పవిత్ర కార్యం అన్నారు. ఈ ఏడాది మట్టి గణపతి విగ్రహాలను పూజించేందుకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేసిందన్నారు. నీటిలో కరిగే గుణం మట్టిలో ఉంటుందని, జలవనరులన్నీ శుభ్రం చేసే గుణం వినాయకుడి పూజల్లో వాడే ఆకుపత్రాల్లో ఉంటాయని ఎమ్మెల్యే వివరించారు. మనం ప్రకృతిని ఆరాదిద్దామని ఎమ్మెల్యే కోరారు. ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్కుమార్, మహి ళా నాయకురాలు గూడెం యాదమ్మ, టీఆర్ఎస్ సీనియ ర్ నాయకులు గూడెం మధుసూదన్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు అఫ్జల్, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి
మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి
మెదక్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): వినాయక నవరాత్రుల సందర్భంగా మట్టి వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించి పూజించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మెదక్ పట్టణ బ్రాహ్మణోత్తములకు మట్టి వినాయక విగ్రహాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మట్టి వినాయకులను ప్రతిష్ఠించి, పూజించడం ఎంతో శ్రేష్ఠమని పేర్కొన్నారు. పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని మట్టి గణపతులను పూజించడం అన్ని విధాలా మేలన్నారు. ఈ సందర్భంగా మెదక్ నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.
సందడిగా మారిన మార్కెట్లు ..
గణనాథుడి పండుగతో మంగళవారం మెదక్, అందోల్, జోగిపేట, నర్సాపూర్తో పాటు ఆయా నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాల్లోని మార్కెట్లు సందడిగా మారాయి. బుధవారం వినాయక చవితి కావడంతో వినాయకులకు ప్రీతిపాత్రమైన తుమ్మి ఆకులు, చింతకాయల, మారేడుకాయలు, తామర ఆకులు, వివిధ రకాలు పూజ సామగ్రి కొనుగోలు చేయడానికి ప్రజలు రావడంతో మార్కెట్లు కిటకిటలాడాయి.
మెదక్ జిల్లా కేంద్రంలో 200పైగా విగ్రహాలు..
జిల్లా కేంద్రంలో జేఎన్రోడ్డు, పొట్టి శ్రీరాములు చౌరస్తా , కమాన్, పెద్ద బజార్, న్యూమార్కెట్, కోలిగడ్డ, ఆటోనగర్, జంబికుంట, ఇందిరా కాలానీ, వెంకట్రావ్నగర్ కాలానీలతో పాటు పలు ప్రాంతాలల్లో సుమారు 200పైగా వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించనున్నారు.
జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు
సంగారెడ్డి కలెక్టర్, ఆగస్టు 30: వినాయక చవితిని పురస్కరించుకొని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతులను ప్రతిష్ఠించుకొని భక్తి శ్రద్ధతలతో పండుగ జరుపుకోవాలని మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. విఘ్నేశ్వరుడి కృపతో విఘ్నాలన్నీ తొలగి అందరూ సుఖఃసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
– డాక్టర్ శరత్, సంగారెడ్డి కలెక్టర్
వినాయక చవితి శుభాకాంక్షలు
మెదక్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): వినాయక చవితి సందర్భంగా మెదక్ ప్రాంత ప్రజలందరికీ సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని, అందరి జీవితాల్లో విఘ్నాలు తొలిగిపోయి విజయాలు సిద్ధించాలని ఎమ్మెల్సీ ఆకాంక్షించారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో అభివృద్ధిలో ముందడుగు వేయాలని అభిలాషించారు. మట్టి వినాయకులను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. – శేరి సుభాష్రెడ్డి, ఎమ్మెల్సీ
విద్యాబుద్ధులు సిద్ధిస్తాయి
వినాయకుడిని పూజిస్తే అన్ని విజ్ఞాలు తొలిగి విద్యాబుద్ధులు సిద్ధిస్తాయి. ఐష్టెశ్వర్యాలతో లోక కల్యాణం జరుగుతుంది. చవితి పూజల్లో గణపతిని 21 పత్రాలతో పూజించడం ఆనవాయితీ. ప్రకృతి వనరులను ఆరోగ్య పరిరక్షణకు ఉపయోగించకోవడంతో పాటు వాటిని దైవసమానంగా చూసుకోవాలని ప్రతి పూజ స్పష్టం చేస్తుంది.
– వైద్యశ్రీనివాస్, పురోతుడు మెదక్ రూరల్
బుధవారం నుంచి మొదలయ్యే గణేశుడి నవరాత్రి ఉత్సవాలకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే విభిన్న ఆకృతుల్లో బొజ్జగణపయ్య విగ్రహాలు రూపుదిద్దుకొన్నాయి. షోలపూర్ వినాయకుడు, కోల్కతా గణేశ్, సుందర్ కళాకార్ గణపతి, పగిడి గణేశ్ ఇలా.. ఏకదంతుడికి ఎన్నెన్ని రూపారు అన్నట్లు కళాకారులు వివిధ రూపాల్లో చూడచక్కగా తీర్చిదిద్దారు. దీంతో కొనుగోలుదారులు తమ వద్దనే ప్రత్యేకమైన స్వామివారి విగ్రహం ఉండేలా చూసుకుంటూ కొనుగోలు చేస్తున్నారు. ఆయా విగ్రహాలను పట్టణ కేంద్రాల్లో, కూడళ్లలో విక్రయిస్తున్నారు. వినాయకుడిని ప్రతిష్ఠించి తొమ్మిది రోజులపాటు పూజలు నిర్వహించేందుకు మండపాలను వివిధ రకాలుగా, ఆకట్టుకునే విధంగా సిద్ధం చేసుకున్నారు.
పోలీస్ శాఖ సూచనలు
వినాయక నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై పోలీస్ శాఖ నిర్వాహకులకు ఇప్పటికే పలు సూచనలు చేసింది. అన్నివర్గాల ప్రజలు, ప్రజాప్రతినిధులతో (పీస్కమిటీ)శాంతి సమావేశాలు నిర్వహించి పండుగను ప్రశాతంగా జరుపుకోవాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా రంగులద్దిన వినాయక విగ్రహాలకు బదులు మట్టి వినాయకులను ప్రతిష్ఠించాలని అవగాహన కల్పించారు. ఇప్పటికే పలుచోట్ల మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ప్రభుత్వం తరఫున మట్టి వినాయకులను కలెక్టర్ పంపిణీ చేయగా, గ్రామాల్లో సైతం మట్టి వినాయకులను పంపిణీ చేశారు.
నిబంధనలు పాటించాలి
గ్రామాల్లో వినాయకులను ప్రతిష్ఠించేవారు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలి. నిబంధనలకు అనుగుణంగా పూజలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించుకోవాలి. నవరాత్రులు ముగిసే వరకు తమసిబ్బంది అన్ని గ్రామాల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తినా వెంటనే సమాచారం ఇవ్వాలి. మండపాల వద్ద ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలి.
– నాగరాజు, సీఐ జోగిపేట
మట్టి విగ్రహాలే మేలు..
పర్యావరణ పరిరక్షణకు మట్టివినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి పూజించాలి. ఇంట్లో మట్టి విగ్రహాలకు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించుకుని, పొలాల వద్ద బావుల్లో వాటిని నిమజ్జనం చేసుకోవడం మంచిది. ఇలా చేస్తే పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చు. రసాయన రంగులు, ప్లాస్టిక్తో తయారు చేసిన ప్రతిమలతో పోల్చితే మట్టి విగ్రహాలు అన్నివిధాలుగా మంచిది.
– డాక్టర్ రవీందర్గౌడ్, సరోజినీదేవి కంటి దవాఖాన మాజీ సూపరింటెండెంట్, అందోల్