గజ్వేల్, ఫిబ్రవరి 19: ధూపదీప నైవేద్య అర్చకుల సమస్యల పరిష్కారం కోసం మంగళవారం చేపట్టనున్న చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ధూప, దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దౌల్తాబాద్ వాసుదేవశర్మ కోరారు. ఈసందర్భంగా సోమవారం ఆయన మాట్లాడుతూ డీడీఎన్ఎస్ అర్చకులకు కనీస వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని, కొత్తగా నియమితులైన డీడీఎన్ఎస్ అర్చకులకు ఏడు నెలల వేతనాలు ఇవ్వాలన్నారు.
అలాగే అర్చకుల పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని కోరుతూ సీఎం రేవంత్రెడ్డి, దేవాదాయ శాఖమంత్రి కొండా సురేఖను కలిసి వినతిపత్రం అందజేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దివంగత సీఎం రాజశేఖర్రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎలాంటి ఆదాయం, ఆదరణలేని దేవాలయాలకు నిత్యం ధూపదీప నైవేద్యాలు జరగాలని పథకం ప్రారంభించినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 6500 దేవాలయాలకు ఈ పథకాన్ని విస్తరించారన్నారు.