రామాయంపేట, ఫిబ్రవరి 27: గత ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చని కాంగ్రెస్ పార్టీని ప్రజలెవ్వరూ నమ్మరని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. మంగళవారం రామాయంపేటలో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్పయాత్రలో ఆయన పాల్గొని మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రజలను ఆరు గ్యారంటీల పేరుతో బురిడీ కొట్టించి, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్రెడ్డికి పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లడిగే హక్కులేదన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చిన తర్వాతే ప్రజల్లోకి రావాలని సూచించారు. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి నేడు మాటమార్చి కాలయాపన చేయడం కాంగ్రెస్కే చెల్లిందన్నారు.
పింఛన్లు, ఉద్యోగులకు సకాలంలో జీతాలందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే మెరుగైన పాలన అందిస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్రెడ్డి ఏ ఒక్క హామీని కూడా అమలు చేయడం లేదని ఆరోపించారు. కార్యక్రమంలో చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమాదేవి, రాష్ట్ర నాయకుడు గురువారెడ్డి, జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, నిజాంపేట జడ్పీటీసీ పంజ విజయ్కుమార్, నందారెడ్డి, వెల్ముల సిద్దిరాములు, నవాత్ రాజేంద్రప్రసాద్, పట్టణాధ్యక్షుడు శంకర్గౌడ్, కొడపర్తి నరేందర్, రమేశ్, చింతల శేఖర్, శ్రీనివాస్గౌడ్, ఆకుల రమేశ్, దయానందరెడ్డి, దిలీప్కుమార్, భానుచందర్, కార్తీక్ పాల్గొన్నారు.