మెదక్ మున్సిపాలిటీ, మే 15 :భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్అంబేద్కర్ జీవితం అందరికీ ఆదర్శం. ఆంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని 19వ వార్డులో జ్యోతి అంబేద్కర్ యువజవ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డిలతో కలిసి ఆవిష్కరించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ.. సామాజిక వేత్త, సంస్కరణవాది ప్రజల మధ్య అంతరాలను చెరిపేసేందుకు కృషి చేసిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్-3 ద్వారానే తెలంగాణను ఏర్పాటు చేసుకున్నామన్నారు. రాజ్యాంగ నిర్మాతగా అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించిన మహనీయుడన్నారు. ఎంతకాలం జీవించామన్నది కాదు, ఎంత గొప్పగా జీవించామన్నది లక్ష్యం కావాలన్న అంబేద్కర్ ఆశయాలను సాకారం చేసేలా ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా దళితబంధు పథకం రూపోందించి దళితులు బలోపతం అయ్యేలా విశేషంగా కృషి చేస్తున్నరన్నారు.
అంబేద్కర్ ఆలోచన విధానం ప్రకారం విద్యతోనే సామాజిక, ఆర్థిక అభివృద్ధిని సాధించవచ్చని నమ్మి కేసీఆర్ రాష్ట్రంలో ఎన్నో బీసీ, ఎస్సీ, ఎస్టీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారన్నారు. ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా అంబేద్కర్ బాటలోనే అందరూ నడుచుకోవాలన్నారు.
త్వరలోనే జిల్లా కేంద్రంలోని హెడ్ పోస్టాఫీసు వద్ద గల చౌరస్తాలోఅంబేద్కర్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేసుకోబోతున్నట్లు ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి వెల్లడించారు. ఆ చౌరస్తా పేరును సైతం అంబేద్కర్ చౌరస్తాగా నామకరణం చేసుకుందమన్నారు. అలాగే జిల్లా కేంద్రంలో అంబేద్కర్ భవన్ ఏర్పాటు చేసుకొని అందులోనే అంబేద్కర్ స్టడి సర్కిల్ను ఏర్పాటు చేసుకుందమన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, తదితరులు ఉన్నారు.