మెదక్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : మెదక్ జిల్లాలో మంగళవారం నుంచి కుష్ఠు వ్యాధి సర్వేను వైద్య ఆరోగ్య శాఖ నిర్వహించనున్నది. ఇందుకోసం వైద్యారోగ్య శాఖ పకడ్బందీగా చర్యలు తీసుకుంటుంది. ఈ నెల 22 వరకు ఈ సర్వే కార్యక్రమం కొనసాగనున్నది. జిల్లాలోని 21 పీహెచ్సీల్లో 566 మంది ఆశకార్యకర్తలు పనిచేస్తున్నారు. కుష్ఠు వ్యాధి ప్రాణాంతకం కాకపోయినా శాశ్వ త అంగవైకల్యానికి గురయ్యే అవకాశం ఉండడమే దీనికి కారణమని అధికారులు చెబుతున్నారు.
జిల్లాలో 21 పీహెచ్సీలు.. 566 ఆశకార్యకర్తలు
జిల్లాలోని 21 పీహెచ్సీలలో 566 మంది ఆశకార్యకర్తలు పని చేస్తున్నారు. పీహెచ్సీల వారీగా ఇప్పటికే ఆశకార్యకర్తలు శిక్షణ కూడా ఇచ్చారు. వీరు ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు అంటే మూడు గంటల సమయంలో 25 ఇండ్లకు వెళ్లి సర్వే వివరాలు సేకరిస్తారు. జిల్లాలో ఇప్పటికే 17 మంది కుష్ఠు వ్యాధి గ్రస్తులను గుర్తించి వారికి చికిత్స అందిస్తున్నారు. ఇంటింటికీ తిరుగుతున్న ఆశ కార్యకర్తలు ప్రాథమిక లక్షణాలను గుర్తించి వారికి 15 రోజుల పాటు పీహెచ్సీలో ఉన్న వైద్యాధికారులు, సిబ్బంది పరీక్షలు నిర్వహిస్తారు. ఒక వేళ వ్యాధి ఉన్నట్లయితే వెంటనే చికిత్స అందించేలా చర్యలు తీసుకుంటారు. అయితే వ్యాధి ని ప్రారంభంలోనే గుర్తించి చికిత్స తీసుకుంటే పూర్తిగా నయమవుతుందని, లేకుం టే అంగవైకల్యం వచ్చే అవకాశం ఉందని వైద్యాధికారులు తెలిపారు.
కుష్ఠు వ్యాధి ఇలా..
కుష్ఠి వ్యాధి అనేది లెప్రో మైక్రోబ్యాక్టీరియా లెప్రమాటోసిన్ అనే బ్యాక్టీరియా ద్వారా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి సోకిన వ్యక్తి శ్వాస ద్వారా బ్యాక్టీరియా ఇతరులకు చేరుతుంది. ఇది సోకిన ఏడు రోజుల వరకు బ్యాక్టీరియా బతికే ఉంటుంది. శరీరంపై తెల్లటి, రాగి, రంగు మచ్చలు రావడం, ఆ ప్రదేశంలో స్పర్శ లేకపోవడం, చేతి, గోళ్లు తిమ్మిర్లు ఉండడం లెప్రసీ వ్యాధి లక్షణాలు. రెండు మూడు అంతకంటే ఎక్కువ మచ్చలు కలిగి ఉండడాన్ని గుర్తించి వైద్యుల సలహా మేరకు మందులు వాడితే వ్యాధి నయమయ్యే అవకాశం ఉన్నది.
నేటి నుంచి ఇంటింటా సర్వే..
మంగళవారం నుంచి 22 వరకు కుష్ఠు వ్యాధి సర్వే నిర్వహించనున్నాం. ఇంటింటి సర్వేలో ఆశ కార్యకర్తలు పాల్గొని కుష్ఠు వ్యాధి గ్రస్తులను గుర్తిస్తారు. ఇప్పటికే జిల్లాలో 17 మందికి చికిత్స అందిస్తు న్నాం. ప్రతి రోజూ 25 ఇండ్లను సర్వే చేసి వివరాలు సేకరించాలి. వ్యాధిగ్రస్తులను గుర్తించి వారికి ఉచితంగా మందులు పంపిణీ చేస్తాం.. ఆశ్రద్ధ వహిస్తే అంగవైకల్యం వచ్చే అవకాశం ఉంది. కుష్ఠు వ్యాధి సర్వేను పకడ్బందీగా నిర్వహిస్తాం.
– చందునాయక్, డీఎంహెచ్వో మెదక్