పటాన్చెరు, ఫిబ్రవరి 23: మండలంలోని చిట్కుల్ గ్రామంలో డీపీవో ఆదేశాల మేరకు ప్లాట్ల ఓనర్లు, భూమి యజమానులకు మధ్య ఉన్న వివాదంపై డీఎల్పీవో సతీశ్రెడ్డి గురువారం విచారించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిట్కుల్ గ్రామ పరిధిలో 2002లో ఓ సంస్థ వెంచర్ వేసి 53 ఎకరాల్లో 1200 ప్లాట్లు చేశారన్నారు. ఆ లేఅవుట్లో ప్లాట్లు కొన్న 20 మంది తమ ప్లాట్లు గల్లంతయ్యాయని డీపీవోకు ఫిర్యా దు చేశారని, అందులో భాగంగా విచారణ చేపట్టామని తెలిపారు.
20 మంది ప్లాట్లు కొన్న భూమిని 2014లో మరో సంస్థకు వెంచర్ వేసిన అమ్ముకున్నారని, భూమి కొన్న వారు బ్యాంకులో తనఖా పెట్టి రుణాలు తీసుకున్నారన్నారు. రుణం కట్టకపోవడంతో ఆ భూమిని బ్యాంక్ వేలం వేసిందన్నారు. ఈ వేలంలో పాడుకున్న సంస్థ ఇప్పుడు వీరి ప్లాట్లకు జవాబుదారి కాదని చెబుతున్నారని, స్థల యజమానులు కోర్టుకు వెళ్లి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారని తెలిపారు. తమ వద్ద డాక్యుమెంట్లు ఉన్నాయని, పర్మిషన్లు ఇవ్వాలని ప్లాట్ల యజమానులు, తాము బ్యాంకుల వద్ద భూమి కొన్నామని, తమకు సంబంధం లేదని భూమి యజమానులు తెలిపారు.
ఇద్దరి వాదనలు విన్న డీఎల్పీవో వాటిని రికార్డుల్లో రాసుకున్నారు. కోర్టు నుంచి ఆర్డర్ వచ్చే వరకు పంచాయతీ ఎవరికీ అనుమతులు ఇవ్వదని స్పష్టంచేశారు. వివిధ సర్వే నెంబర్లలో 3.27 ఎకరాల అసైన్ భూమి కూడా అన్యాక్రాంతం అయినట్లు డీఎల్పీవో గుర్తించారు. వాటిలో ఎలాంటి పర్మిషన్లు ఇవ్వకుండా హెచ్ఎండీఏకు లెటర్ రాస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీవో హరిశంకర్గౌడ్, కార్యదర్శి కవిత తదితరులు పాల్గొన్నారు.