ఏ చెరువు చూసినా నిండుగా జలాలతో తొణికిసలాడుతున్నది. ఏ తటాకం అలుగు చూసినా మత్తడి దుంకుతున్నది. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో చెరువులు జలకళ సంతరించుకున్నాయి. దీంతో సాగునీటికి ఢోకా లేకుండా పోయింది. మెదక్ జిల్లాలో మొత్తం 2837 చెరువులు ఉండగా, 1821 పూర్తిగా నిండి మత్తడి దుంకుతున్నాయి. మరో 718 తటాకాలు 75 శాతం మేర నిండాయి. జిల్లాలో చెరువుల కింద 70వేల ఎకరాల ఆయకట్టు ఉండగా.. అన్ని చెరువుల్లోకి నీరు రావడంతో పుష్కలంగా పంటలు పండనున్నాయి. సంగారెడ్డి జిల్లాలో మొత్తం చెరువులు 3140 ఉండగా.. 265 చెరువులు పూర్తిగా నిండాయి. మిగతావి మరిన్ని వర్షాలు పడితే అలుగు పారే అవకాశం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ‘మిషన్ కాకతీయ’తో చెరువులను బలోపేతం చేసింది. దీంతో ఇటీవల భారీగా వర్షాలు కురిసినా ఒక్క చెరువుకు కూడా గండిపడిన, కట్ట తెగిన దాఖలాలు లేవు. చెరువుల పునరుద్ధరణ చేపట్టడంతో నీటినిల్వ సామర్ధ్యం పెరిగింది. భూగర్భ జలాలు పెరిగి బోరుబావుల కింద మంచిగా పంటలు పండుతున్నాయి. రైతులు, కూలీలకు ఉపాధి దొరుకుతున్నది. మత్స్యకారులు చేపలు పెంపకం చెపడుతూ ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారు.
మెదక్/సంగారెడ్డి, జూలై 27 (నమస్తే తెలంగాణ): రుతుపవనాల ప్రభావంతో ఈ నెలలో విస్తారంగా వర్షాలు కురవడంతో మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో చెరువులు జలకళ సంతరించుకున్నాయి. అనేక చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయి. దీంతో సాగునీటికి ఢోకా లేకుండా పోయింది. ప్రస్తుతం వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్నాయి. రైతులు వరినాట్లు వేస్తున్నారు. పత్తి కలుపుతీత పనులు కొనసాగుతున్నాయి. ఎడతెరపిలేని వర్షాలకు వరదతో పంటలు నీటమునిగాయి. సంగారెడ్డిలో 2355 ఎకరాలు, మెదక్ జిల్లాలో 3200 ఎకరాల్లో పంటనష్టం వాటిల్లింది.
మెదక్ జిల్లాలో చెరువులకు జలకళ..
మెదక్ జిల్లాలో చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. ఈ వానకాలం సీజన్లో వరుణుడు కరుణించడంతో జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చెరువులు, ప్రాజెక్టులు నిండుతుండడంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని 21 మండలాల్లో నీటి పారుదలశాఖ ఆధీనంలో 2837 చెరువులు, కుంటల కింద 70వేల ఎకరాల ఆయకట్టు ఉంది. జిల్లాలో మొత్తం ఐదు ఇరిగేషన్ సబ్ డివిజన్ల పరిధిలో 2837 చెరువులు ఉండగా, అందులో మెదక్ నియోజకవర్గంలో 675 చెరువులు, నర్సాపూర్ నియోజకవర్గంలో 927 చెరువులు, గజ్వేల్ సబ్ డివిజన్ పరిధిలో 272 చెరువులు, దుబ్బాక సబ్ డివిజన్ పరిధిలో 206 చెరువులున్నాయి. భారీ వర్షాలతో చెరువులు, కుంటలు, చెక్డ్యామ్లు జలకళను సంతరించుకున్నాయి. కొన్ని సంవత్సరాలుగా నిండని చెరువులు ఈసారి భారీ వర్షాలకు నిండాయి.
సంగారెడ్డి జిల్లాలో…
సంగారెడ్డి జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో నీటి వనరులు నిండుకుండలా మారాయి. సింగూరు ప్రాజెక్టుకు వరద పెరగటంతో శనివారం ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తి దిగువకు జలాలు వదిలారు. మంజీరా బ్యారేజీ నిండటంతో ఐదుగేట్ల నుంచి వరద నీటిని కిందికి వదిలారు. జిల్లాలోని నల్లవాగు, నారింజ ప్రాజెక్టులు పొంగిపొర్లుతున్నాయి. అనేక చెరువులు, కుంటలు నిండి అలుగు పారుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా నీటిపారుదలశాఖ అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఇరిగేషన్ ఎస్ఈ మురళీధర్ ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చెరువులకు ఎక్కడైనా గండిపడిని వెంటనే స్పందించి మరమ్మతు చేయాలని ఇరిగేషన్ సిబ్బందికి సూచించారు. సంగారెడ్డి మండలంలోని మహబూబ్సాగర్, కంది మండలంలోని దేవునిచెరువులను ఎస్ఈ మురళీధర్ ఇటీవల సందర్శించారు. సంగారెడ్డి జిల్లాలో మొత్తం చెరువులు 3140 ఉన్నాయి. ఇందులో 265 చెరువులుగా పూర్తిగా నిండాయి. మరో 1150 చెరువులు 75శాతం నీటితో నిండాయి. 1000 చెరువుల్లో 50శాతం మేర జలాలు వచ్చి చేరాయి. 218 చెరువులు అలుగు పారుతున్నాయి.
రెండు డివిజన్లలో 1,15,931 ఎకరాలు..
జిల్లాలోని మెదక్, దౌల్తాబాద్ డివిజన్లలో 1,15,931 ఎకరాల ఆయకట్టు ఉంది. మెదక్ డివిజన్లో 2317 చెరువులు ఉండగా, 94,945 ఎకరాల ఆయకట్టు ఉంది. దౌల్తాబాద్ డివిజన్లో 523 చెరువులు ఉండగా, 20,986 ఎకరాలు ఉంది. దీంతో ఈ ఆయకట్టు కింద ప్రతి ఏడాది భారీ వర్షాలతో రైతులు పంటలు పండిస్తున్నారు. మెదక్ డివిజన్లో మెదక్, హవేళీఘనపూర్, పాపన్నపేట, కౌడిపల్లి, చిలిపిచెడ్, కొల్చారం, మనోహరాబాద్, నార్సింగి, నర్సాపూర్, శివ్వంపేట్, తూప్రాన్, నిజాంపేట, చేగుంట, రామాయంపేట, వెల్దుర్తి, చిన్నశంకరంపేట, మాసాయిపేట మండలాలు ఉండగా, దౌల్తాబాద్ డివిజన్లో పెద్దశంకరంపేట, అల్లాదుర్గం, టేక్మాల్, రేగోడ్ మండలాలున్నాయి.
1821 చెరువులు నిండాయి..
ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులు నిండుతున్నాయి. ఇప్పటికే మెదక్ జిల్లాలో 1821 చెరువులు పూర్తిగా నిండిపోయి అలుగుపోస్తున్నాయి. చెరువుల్లోని నీరువృథా కాకుండా చర్యలు తీసుకుంటున్నాం. మిషన్ కాకతీయతో చెరువులు బలోపేతం అయ్యాయి.
– శ్రీనివాస్రావు, నీటిపారుదల శాఖ ఈఈ, మెదక్