‘కార్మిక శక్తిపైనే దేశ ప్రగతి ఆధారపడి ఉంటుంది.. సంపద పెంచు.. పేదలకు పంచు.. ఊరిలోనే ఉపాధి కల్పించు.. అనేదే కేసీఆర్ సిద్ధాంతం.. సీఎం అయినప్పటి నుంచి బడుగు, బలహీన , కార్మిక, కర్షక వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ఆయన చేస్తున్నారు. తెలంగాణ మాదిరిగానే దేశంలోని కార్మికుల బాధలు తీరాలంటే అది సీఎం కేసీఆర్తోనే సాధ్యమవుతుంది’.. అని కార్మికలోకం నినదిస్తున్నది. ఆయన కేంద్ర కార్మిక మంత్రిగా ఉన్నప్పుడు అనేక మందికి లాభం జరిగిందని పేర్కొంటున్నది. కార్మికులకు భరోసానిస్తూ అనేక సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి దిగ్విజయంగా అమలు చేస్తున్నదని కార్మికులు చెబుతున్నారు. భారీ, మధ్యతరహా, చిన్న తరహా పరిశ్రమల ద్వారా వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారన్నారు.
సిద్దిపేట, సెప్టెంబర్ 23(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘సంపద పెంచు.. పేదలకు పంచు’ అనేదే సీఎం కేసీఆర్ సిద్ధాంతం. అందుకే తెలంగాణలో అద్భుతమైన పాలన అందిస్తూ అన్నివర్గాల సంక్షేమానికి పాటుపడుతున్నారు. కులవృత్తులకు పూర్వవైభవం తీసుకువస్తున్నారు. ఇవాళ దేశం మొత్తం తెలంగాణను చూసి నేర్చుకుంటున్నది. సీఎం కేసీఆర్ కార్మికులు, కర్షకుల బాధలు తెలుసు కాబట్టే వారి కష్టాలను దూరం చేస్తున్నారు. తెలంగాణ మాదిరిగానే దేశంలోని కార్మికుల బాధలు తీరాలంటే అది సీఎం కేసీఆర్తోనే సాధ్యమవుతుందని కార్మిక, కర్షక లోకం నమ్ముతున్నది. కార్మికులకు భరోసానిస్తూ అనేక సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి దిగ్విజయంగా అమలు చేస్తున్నది. భారీ, మధ్య, చిన్న తరహా పరిశ్రమల ద్వారా వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నది. టీఎస్ఐపాస్ ద్వారా కోట్ల రూపాయల పెట్టుబడితో పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించి లక్షల మందికి ఉపాధిని ప్రభుత్వం కల్పిస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో కార్మికులకు మంచి రోజులు వచ్చాయి. పరిశ్రమలకు అవసరమైన నాణ్యమైన కరెంట్ సరఫరా చేయడంతో మూడు షిప్టుల్లో పరిశ్రమలు పనిచేస్తున్నాయి. దీంతో భారీగా వస్తు ఉత్పత్తి జరుగుతున్నది. అనేక రాష్ర్టాల కార్మికులు తెలంగాణలో ఉపాధి పొందుతున్నారు.
సమైక్య రాష్ట్రంలో వారంలో సగం రోజులు పరిశ్రమలు బంద్ ఉండేవి. పరిశ్రమలకు పవర్ హాలీడేలు ఉండేవి. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రైతులు, కార్మికులు అనేక రకాలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నాడు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కేసీఆర్ వెంట నడిచిన కార్మికులు ఇవ్వాళ సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లడాన్ని స్వాగతిస్తూ ఆయన వెంట నడవడానికి సిద్ధ్దమవుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతోనే కార్మికులకు చేతినిండా పనిదొరుకుతున్నది.తెలంగాణ ప్రాంతంలో లక్షల సంఖ్యలో బీడీ కార్మికులు పనిచేస్తున్నారు. గత ప్రభుత్వాలు వారి బాగోగులు పట్టించుకోలేదు. బీడీలు వద్దని, కాంగ్రెస్ పుర్రె గుర్తు తెచ్చింది. బీడీ పరిశ్రమపై బీజేపీ 28శాతం జీఎస్టీ విధించి పరిశ్రమను దెబ్బతీసింది. దేశంలోనే బీడీ కార్మికులకు రూ.2016 పింఛన్ ఇస్తున్న ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్. దేశంలో 16 రాష్ర్టాల్లో బీజేపీ డబుల్ ఇంజిన్ పాలన ఉంది. కానీ, వారి రాష్ర్టాల్లో రూ.2 వేల పింఛన్, 24 గంటల కరెంట్ ఉచితంగా ఇస్తున్నారా..? అంటే ఇవ్వడం లేదు. మాట తప్పని నాయకుడు సీఎం కేసీఆర్. కార్మికులు కుటుంబాలకు అండగా నిలిచారు. రాష్ట్ర కార్మిక సంక్షేమ బోర్డు ద్వారా బీమా అమలు చేస్తున్నారు. ఇతర ఆర్థిక సాయాలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కార్మికులకు భరోసా ఏర్పడింది.
కేసీఆర్తోనే కార్మికులకు సముచిత న్యాయం
సీఎం కేసీఆర్తోనే అన్నిరంగాల కార్మికులకు న్యాయం చేకూరింది. ఆర్టీసీ కార్మికులను ఉద్యోగులుగా గుర్తించడంతో పాటు ఆర్టీసీకి అండగా నిలిచారు. తెలంగాణలో వ్యవసాయం తర్వాత అత్యధికంగా బీడీ కార్మికులు ఉంటారు. బీడీ కార్మికులకు చాలీచాలని పనిదినాలతో తక్కువ వేతనం వస్తుందని తెలుసుకున్న సీఎం కేసీఆర్ ఆసరా పింఛన్ రూ. 2016 ఇస్తున్నారు. కేంద్రంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీలు పుర్రె గుర్తు, జీఎస్టీ పేరిట బీడీ కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తే, కేసీఆర్ అండగా నిలిచారు. సీఎం కేసీఆర్ కార్మిక పక్షపాతి. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి. దీంతో ఇతర రాష్ర్టాల నుంచి తెలంగాణకు వలస వస్తున్నారు. దేశంలో కేసీఆర్ నాయకత్వం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు.
– మంచె నర్సింహులు, తెలంగాణ బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు
కార్మిక లోకానికి మేలు
సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్తే కార్మికులకు ఎంతో మేలు జరుగుతుంది. ఎన్నో ఉద్యమాలు చేసి సాధించుకున్న హక్కులను నరేంద్రమోదీ ప్రభుత్వం కాలరాస్తున్నది. ఓ వైపు వ్యవసాయాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగించడం, మరో వైపు పరిశ్రమలతో పాటు అనుబంధ రంగాలను ప్రైవేట్ పరం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే కేసీఆర్తోనే సాధ్యమవుతుంది. కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి ప్రవేశించి తనదైన శైలిలో రాజకీయాలు చేయాల్సిన సమయం ఆసన్నమైంది.
– పుర్మ వెంకట్రెడ్డి, కార్మిక సంఘం నేత, చేర్యాల
కార్మిక శక్తికి భరోసాగుంటది
సీఎం కేసీఆర్ తెలంగాణను అద్భుతంగా తీర్చిదిద్దాడు. ఇంతగొప్పగా అన్ని రాష్ర్టాల్లో ప్రజలకు సేవలు చేయడానికి కేసీఆర్ దేశరాజకీయాల్లోకి పోవాలే. మా ఆటో కార్మికులంతా తెలంగాణలో సంతోషంగా ఉన్నాం కరువుతో బియ్యం పండక అప్పట్లో చాలా ఇబ్బంది ఉండేది. ఇప్పుడు కాళేశ్వరం నీళ్లతోటి బోర్లు రీఛార్జి అయ్యాయి. మస్తు నీళ్లు పోస్తున్నాయి. రైతులకు, కార్మికులకు దేశమంతా మంచిరోజులు రావాలంటే కేసీఆర్ దేశరాజకీయాల్లోకి తప్పక పోవాలే.
– అంతని ఆసా, టీఆర్ఎస్కేవీ ఆటో యూనియన్, గజ్వేల్ నియోజకవర్గ అధ్యక్షుడు
కేసీఆర్ దేశానికి శ్రీరామ రక్ష
భవనాన్ని ఎలా నిర్మిస్తామో తెలంగాణ రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ అలా దృఢంగా నిర్మిస్తున్నారు. ప్రజల బాగుగోల గురించి పూర్తిగా తెలిసిన కేసీఆర్ సార్ ఒక్క తెలంగాణకే కాకుండా యావత్ దేశానికి నాయకత్వం వహించాలి. కేసీఆర్ లాంటి నాయకుడు దేశ ప్రధాని అయితే భారతదేశం పునర్నిర్మాణం బంగారు మయమవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి కేసీఆర్ సారే శ్రీరామ రక్ష.
– వరుగంటి బాబు, భవన నిర్మాణ కార్మిక సంఘం మండల నాయకుడు
కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లాలి
ప్రధాని మోదీ కార్పొరేట్ సంస్థల చేతిలో కీలు బొమ్మగా మారాడు. ప్రజల కోసం ఒక్క మంచి పథకాన్ని ప్రవేశపెట్టలేదు. కేసీఆర్ దేశ రాజకీయాల్లోని వెళ్తే, పేద, మధ్య తరగతి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. ప్రజలకు మంచి చేయాలనే లక్ష్యం ఉన్న నాయకుడు కేసీఆర్. దేశ రాజకీయాల్లోకి వెళ్తే ప్రపంచ దేశాల్లో భారత్ను అగ్రగామిగా నిలుపడం ఖాయం. పరిపాలన దక్షిత కలిగిన మహానాయకుడు కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లడం దేశ ప్రజలు చేసుకున్న సుకృతం.
– వి.రవీందర్రెడ్డి, తెలంగాణ రైతు రక్షణ సమితి, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ