దుబ్బాక, ఫిబ్రవరి 8: కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాటలు నమ్మి మరోసారి మోసపోవద్దని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక అభివృద్ధి చెందాలంటే కారు గుర్తుకు ఓటువేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో శనివారం రాత్రి, ఆదివారం 12, 13, 14, 17, 18, 19 వార్డుల్లో బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులు చెక్కపల్లి శ్రీలేఖ రాజు, ఆస సులోచన , భూపాల్, వడ్లకొంద సుభద్ర, అంకం హేమలత , శ్రీరాం సంగీతతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డు ల్లో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను ఆప్యాయంగా పలకరిస్తూ కారు గుర్తుకు ఓటువేయాలని అభ్యర్థించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… కేసీఆర్ సారు ప్రాణాలకు తెగించి తెలంగాణ రాష్ట్రం సాధించడంతో పాటు రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో ముందుంచితే, కేవలం రెండేండ్లలో కాంగ్రెస్ ఆగం చేసిందని దుయ్యబట్టారు. పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందించారని గుర్తు చేశా రు. అభివృద్ధి, సంక్షేమంలో రాష్ర్టాన్ని దేశానికి ఆదర్శంగా నిలిపిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని విమర్శించారు. దుబ్బాకపై కేసీఆర్కు ప్రేమ ఉంటుంది కానీ రేవంత్రెడ్డికి ఉంటుందా అంటూ ప్రజలను ప్రశ్నించారు. దుబ్బాకలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి తప్పా రెండేండ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు.
ఆసరా పింఛన్లతో వృద్ధులకు పెద్ద కొడుకుగా, కల్యాణలక్ష్మి , కేసీఆర్ కిట్తో మేనమామగా కేసీఆర్ ప్రజల గుండెల్లో నిలిచారని గుర్తుచేశారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టుతో రైతులకు సాగునీటి కష్టాలు తీర్చింది కేసీఆర్ సారు కాదా అని అడిగారు. కాంగ్రెస్ పార్టీ ఇస్తామన్న ఆరు గ్యారెంటీల్లో ఏ ఒక్కటి అమలు చేయలేదన్నారు. ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు గెలిచిన తెలంగాణకు తెచ్చిన నిధులు గుండు సున్నా అంటూ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నాయకులు రాజమౌళి, వెంకటనర్సింహారెడ్డి, ఎల్లారెడ్డి, కిషన్రెడ్డి, భూంరెడ్డి,రాజు, శ్రీనివాస్, యాదగిరి, ఖలీల్ పాల్గొన్నారు.