దుబ్బాక, మార్చి 22: దుబ్బాక నియోజకవర్గంలో మల్లన్నసాగర్ ప్రాజెక్టు ఉన్నా నియోజకవర్గ రైతులు సాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారని, ఉప కాల్వల నిర్మాణం చేపట్టకపోవడంతోనే సమస్య నెలకొందని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి శాసనసభలో ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. దుబ్బాక నియోజకవర్గంలో నెలకొన్న సాగునీరు, కరెంట్ సమస్యలు, మున్సిపల్ అభివృద్ధికి సంబంధించిన నిధుల గురించి శనివారం అసెంబ్లీలో ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డి ప్రస్తావించారు.
మల్లన్నసాగర్, కొండ పోచమ్మసాగర్ నుంచి దుబ్బాక నియోజకవర్గానికి సాగునీరు ఇచ్చేందుకు 10, 11, 12, 13 ప్యాకేజీల ద్వారా ఉపకాల్వలు నిర్మించాల్సి ఉందన్నారు. ఉప్పరపల్లి కెనాల్, శంకరంపేట కెనాల్, రామయంపేట కెనాల్, సిద్దిపేట కెనాల్లు (ప్రధాన కాల్వల నుంచి ఉప కాల్వల నిర్మాణం పూర్తికాక రైతులు సాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఉప కాల్వల ద్వారా సాగునీరు వస్తుందని చాలామంది రైతులు ఆశపడి వరినాట్లు వేశారని, తీరా సాగునీరందక పంటలు ఎండిపోయి నష్టపోయారని తెలిపారు.
తమ సొంత మండలం దుబ్బాకలోని అచ్చమాయిపల్లి-పోతారం పిల్ల కాల్వ నిర్మాణం చేపట్టకపోవడంతో అక్కడి రైతులు సొంత డబ్బులతో కాల్వలు తీసుకుంటున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ఉప కాల్వల నిర్మాణంపై మెగా ఏజేన్సీ వారు పట్టించుకోవడం లేదన్నారు. ఇకనైనా సంబంధిత అధికారులతో, వర్క్ ఏజెన్సీతో మాట్లాడి త్వరగా ఉప కాల్వల నిర్మాణ పనులు పూర్తిచేయాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే కోరారు.
దుబ్బాక నియోజకవర్గంలో కరెంట్ సమస్య నెలకొందని ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డి ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్లారు. అస్తవ్యస్త కరెంట్ సరఫరాతో తరచూ వ్యవసాయ మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయని తెలిపారు. ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు రైతులకు ఇవ్వాల్సి ఉండగా స్టోర్స్లో సామగ్రి లేదని విద్యుత్ అధికారులు చెబుతున్నారని, వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లకు రైతులు డీడీలు కట్టినా ఇవ్వడం లేదన్నారు.