దుబ్బాక, జూన్ 11: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభు త్వం నయాపైసా అభివృద్ధి చేయలేదని, పాలనలో పూర్తిగా విఫలమయ్యిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేండ్లు అవుతున్నా దుబ్బాకలో అభివృద్ధి జరుగడంలేదని మండిపడ్డారు. గురువారం రాత్రి దుబ్బాక నియోజకవర్గంలోని అక్బర్పేట- భూంపల్లి మండలంలోని నగరంలో రామలింగేశ్వర ఫంక్షన్హాలో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ నిర్వహించారు.
కార్యక్రమానికి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి, రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్ పాల్గొన్నారు. నియోజకవర్గంలో 594 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సమక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎమ్మెల్యే ఏకరువు పెట్టారు. మూడేండ్ల పాలనలో వైఫల్యాలు తప్ప ప్రజలకు ప్రయోజనం చేకూరలేదని ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డి ప్రస్తవించడం గమనార్హం.
పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలిచి కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని ప్రవేశ పెట్టిన ఘనత కేసీఆర్దేనని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి స్పష్టం చేశారు. కల్యాణలక్ష్మి పథకంలో రూ.లక్షతో పాటు తులం బంగారం ఇస్తామన్న కాంగ్రెస్ హామీ నెరవేర్చడం లేదని విమర్శించారు. దుబ్బాక నియోజకవర్గంలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి పనులే తప్ప మూడేండ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో నయా పైసా అభివృద్ధికి నోచుకోలేదని మండిపడ్డారు.
కేసీఆర్ నిర్మించిన మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు ఉపకాల్వలు తవ్వించలేదని విమర్శించారు. యూరి యా, ధాన్యం కొనుగోళ్ల కోసం రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేసే పరిస్థితి దురదృష్టకరమన్నారు. అనంతరం మంత్రి వివేక్ మాట్లాడారు. కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి అధికారులు, లబ్ధిదారులను మాత్రమే పోలీసులు అనుమతించారు. కార్యక్రమంలో కలెక్టర్ హైమావతి, దుబ్బాక మున్సిపల్ చైర్మన్ సంగీత, ఆర్డీవో సదానందం, తదితరులు పాల్గొన్నారు.