మిరుదొడ్డి (అక్బర్పేట-భూంపల్లి) ఆగస్టు 17: అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పథకాలు అమలు చేస్తున్నారని, సీఎం కేసీఆర్తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని మెదక్ ఎంపీ, సిద్దిపేట బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. గురువారం అక్బర్పేట-భూంపల్లి మండల పరిధిలోని ఎస్బీఆర్ పంక్షన్ హాల్లో మిరుదొడ్డి, అక్బర్పేట-భూంపల్లి, ఉమ్మడి మిరుదొడ్డి మండలం పార్టీ బూత్ కమిటీ కార్యకర్తల శిక్షణను నిర్వహించారు. అంతకుముందు ఎంపీ సొంత ఖర్చులతో కొనుగోలు చేసిన ఆకిట్వా స్కూటీలను 9 మంది దివ్యాంగులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ దుబ్బాక ఉప ఉన్నికల్లో నియోజకవర్గం ప్రజలకు మాయమాటాలు చెప్పి గద్దెనెక్కిన ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రజలకు ఒక్క పనైనా చేశాడా? అంటూ ప్రశ్నించారు.
రాష్ట్రంలో మరోసారి కేసీఆర్ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అన్ని సర్వేలు బీఆర్ఎస్ అధికారంలోని వస్తుందని చెబుతున్నాయన్నారు. దుబ్బాకలో గులాబీ జెండా ఎగురవేయడానికి కార్యకర్తలు సైనికుల వలే పనిచేయాలన్నారు. కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా పార్టీ ఆదుకుంటుందన్నారు. దుబ్బాకలో ఎప్పుడూ లేని విధంగా సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుల సహకారంతో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. 560 మంది భూత్ కమిటీ సభ్యులు పార్టీ పటిష్టతకు కృషి చేయాలన్నారు. దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డికి వచ్చిన 60 వేల మెజార్టీ పునరావృతం కావాలని పిలుపునిచ్చారు. చిన్న పొరపాటు వల్లనే దుబ్బాక ఉప ఎన్నికల్లో కొద్ది ఓట్లతో ఓడిపోయామన్నారు. మోసపోతే గోస పడుతామని కార్యక్తలకు ఎంపీ దిశా నిర్దేశం చేశారు.
దుబ్బాక అంటేనే పోరాటాల పురిటి గడ్డ అని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. చెట్టుకు ఏర్లు భూమిలో పటిష్టంగా ఉంటేనే చెట్టు నిలబడుతుంది. కార్యకర్తలు గ్రామాల్లో ఎంత బలంగా ఉంటే పార్టీ అంతబలంగా ఉంటుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో దుబ్బాకలో ఆకలి చావులు చూసి చలించిపోయి రాష్ట్రం కోసం సీఎం కేసీఆర్ వెంట 14 ఏండ్ల పాటు ఉద్యమం చేసినట్లు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జై తెలంగాణ అన్న ఉద్యమకారులను అణిచివేస్తూ తుపాకులతో పిట్టల్లా కాల్చిన చరిత్ర చంద్రబాబు నాయుడుదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు హయాంలో కరెంట్ కోసం రైతులు అరిగోసపడ్డారని, రాత్రిపూట నీళ్లు పెట్టేందుకు వెళ్లిన రైతులు ఎందరో కరెంటు షాకుకు గురై మృతి చెందారని గుర్తుచేశారు. ఐటీ అంటూ వ్యవసాయాన్ని తుంగలో తొక్కడంతో రైతులు ఆకలితో అలమటించారన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ వ్యవసాయానికి సాగునీరు అందించి రైతుల కన్నీళ్లను తుడిచి మహానాయకుడయ్యారన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు.. సచ్చేది కాదు, కాంగ్రెస్ పార్టీ అంటేనే స్కాలం చరిత్ర అన్నారు.
నాడు కాంగ్రెస్ రెండు టీఎంసీలతో ప్రాజక్టును నిర్మాణానికి డిజైన్ చేసి వదిలేస్తే స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ 51 టీఎంసీలతో మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మించి ప్రజలకు సాగు నీరు అందిస్తున్నారన్నారు. మణిపూర్ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం మహిళలను నగ్నంగా రహదారుల వెంట ఊరేగిస్తే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నోరు విప్పకపోవడం బాధాకరమన్నారు. అక్కడి ప్రభుత్వం ఒక వర్గానికి తుపాకులు తెచ్చి మరో వర్గంపై కాల్పులు జరిపిస్తుందని మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మోసాలను ప్రజలకు వివరించి దుబ్బాకలో గులాబీ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఫారూక్హుస్సేన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు బొంపల్లి మనోహర్ రావు, డీసీసీబీ డైరెక్టర్ బక్కి వెంకటయ్య, ఎంపీపీ గజ్జల సాయిలు, జడ్పీటీసీ సూకురి లక్ష్మీలింగం, అక్బర్పేట-భూంపల్లి మండల అధ్యక్షుడు జీడిపల్లి రవి, మిరుదొడ్డి మండల అధ్యక్షుడు అంజిరెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు తుమ్మల బాల్రాజు, అక్బర్పేట సర్పంచ్లు ధర్మారం స్వరూప భిక్షపతి, దుబ్బాక ఎంపీపీ కొత్త పుష్పలత కిషన్రెడ్డి, జడ్పీటీసీ రవీందర్రెడ్డి, ఏఎంసీ జ్యోతి కృష్ణ, పీఏసీఎస్ చైర్మన్ కైలాస్, ఆయా గ్రామాల సర్పంచ్లు, తదితరులు పాల్గొన్నారు.