‘బీఆర్ఎస్ పార్టీకి ప్రజలే బలం.. కార్యకర్తలే బలగం. రాబోయే ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరడం ఖాయం.’ అని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కొండాపూర్ మండలం మల్కాపూర్లో హెచ్డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో మంగళవారం బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమానికి ఎంపీతో పాటు టీఎస్ఎమ్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో అమలుచేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ జిల్లాకు మెడికల్ కాలేజీని మంజూరుచేయడంతో పాటు అదనంగా నర్సింగ్ కాలేజీని కేటాయించారని గుర్తుచేశారు. 24 గంటల ఉచిత కరెంట్, పుష్కలంగా నీళ్లు లభిస్తుండడంతో రైతులు పండుగలా వ్యవసాయం చేసుకుంటున్నారన్నారు. బండి సంజయ్ నిరుద్యోగ మార్చ్ చేయాల్సింది సంగారెడ్డిలో కాదని, మోదీ ఇంటి ఎదుట అని చురకలంటించారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ పెట్రో, డీజిల్ ధరలు పెంచి పేదల ఉసురుపోసుకుంటుందని మండిపడ్డారు.
– కొండాపూర్, మే16
కొండాపూర్, మే 16: “బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యం. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాలకు ప్రాధాన్యమిస్తూ పథకాలను అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎదురులేని శక్తిగా ఎదగడంలో కార్యకర్తలు కీలక భూమిక పోషించారు. పార్టీకి వారే బలం, వారే మన బలగం.” అని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ వెంకటేశ్వర గార్డెన్లో రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ మండల కార్యకర్తలతో ‘ఆత్మీక సమ్మేళనం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అంతకుముందు మండల పరిధిలోని బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన ముఖ్య అతిథులకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లా ప్రాంతం అభివృద్ధి కోసమే సంగమేశ్వర-బసవేశ్వర పథకాలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు.
కొండాపూర్ మండలం మొత్తం 28వేల ఓట్లు ఉన్నాయని, అందరూ కష్టపడి భారీ మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేయాలన్నారు. సంగారెడ్డిలో గులాబీ జెండాను ఎగురవేస్తే ప్రజలకు మేలు కలుగుతుందన్నారు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలన్నారు. పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటుందని, నాయకులు, కార్యకర్తలే పార్టీకి వెన్ను ముక్కలాంటివారన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలకు పార్టీ శ్రేణులు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభ్వుతం చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై దేశ వ్యాప్తంగా పార్టీలోకి చేరికలు జరుగుతున్నాయని తెలిపారు.
కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, సీడీసీ చైర్మన్ బుచ్చిరెడ్డి, జడ్పీటీసీ పద్మావతి పాండురంగం, వైస్ ఎంపీపీ లక్ష్మీరాంచందర్, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు రుక్ముద్దీన్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు విజయభాస్కర్రెడ్డి, సర్పంచ్లు ప్రకాశం, నర్సింహులు, షఫీ, ఫయీం, ఎంపీటీసీలు, శ్రీనివాస్గౌడ్, రాందాస్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మ్యాకం విఠల్, సొసైటీ చైర్మన్లు శ్రీకాంత్రెడ్డి, రాజు, పవన్కుమార్, జిల్లా నాయకులు బుచ్చిరెడ్డి, మల్లాగౌడ్, నాయకులు నగేశ్, ప్రభుదాస్, కుమార్, జగదీశ్వర్, గోవర్థన్రెడ్డి, యాదగిరిగౌడ్, అమినోద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
2013 ఎట్లుండే 2023లో ఎైట్లెంది : చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్
తెలంగాణ 2013 ఎట్లుండే? 2023లో ఎైట్లెందని ప్రజలు ఆలోచించాలని చింతా ప్రభాకర్ అన్నారు. మల్కాపూర్ నుంచి మహితాబ్ఖాన్గూడ వరకు మోకాళ్ల లోతు గుంతలతో రోడ్లు ఉండేవని, తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాతనే ఆ రోడ్లకు మహర్దశ కలిగిందన్నారు. రూ.12 కోట్లు మంజూరు చేయించి ఆయా పనులు పూర్తి చేసినట్లు గుర్తు చేశారు. ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి చొరవతో మల్కాపూర్లో రూ.26 కోట్లతో అండర్ గ్రౌండ్ బ్రిడ్జిని ఏర్పాటు చేశామన్నారు. 2018 ఎన్నికల ప్రచారానికి వచ్చిన సీఎం కేసీఆర్ సంగారెడ్డి మెడికల్ కళాశాల మంజూరు చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చుకున్నారని, అదనంగా నర్సింగ్ కాలేజీని కూడా ఇచ్చారన్నారు. ప్రతి చిన్న సమస్యను కూడా తాను ప్రజలకు అందుబాటులో ఉండి పరిష్కారం చేశామని, ఎల్లప్పుడూ ప్రజా సేవ చేసేందుకు తాను సిద్ధంగా ఉంటామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేస్తున్నదని, ఉమ్మడి జిల్లా రైతులు ఇప్పుడు సంతోషంగా వ్యవసాయం చేసుకుంటున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు స్వరాష్ట్రంలో సత్ఫలితాలు ఇస్తున్నాయని కొనియాడారు.
‘బండి’.. ధర్నా మోదీ ఇంటి ముందు చేయాలి : టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్
సంగారెడ్డిలో నిరుద్యోగ మార్చ్ పేరిట ధర్నాలు చేస్తున్న బండి సంజయ్ నువ్వు చేయాల్సిన ధర్నాలు నరేంద్ర మోదీ ఇంటి ఎదుట అని టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఎద్దేవా అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన ప్రతి ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని గొప్పలు చెప్పారని, ఇప్పటి వరకు ఏ ఒక్కరికీ ఉద్యోగాలు రాలేదని ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేసేముందు ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ సర్కారు లక్షా 30వేల ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. మరో 90వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేసినట్లు చెప్పారు. 927 డాక్టర్ ఉద్యోగాలను కూడా ఇచ్చామని బండికి చురకలు అంటించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని, పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.