సంగారెడ్డి, మే 31 (నమస్తే తెలంగాణ): వర్షాలకు తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ తెలిపారు. శనివారం సంగారెడ్డిలోని కలెక్టరేట్లో ఉమ్మడి మెదక్ జిల్లా కలెక్టర్లు, జిల్లా అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు కొండా సురేఖ, దామోదర్ రాజనర్సింహ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ ఉమ్మడి మెదక్ జిల్లాలో ధాన్యం సేకరణ, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, వానకాలం సాగు ప్రణాళిక, భూభారతి చట్టం అమలు, సంక్షేమ పథకాల అమలును సమీక్షించారు. సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల కలెక్టర్లు వల్లూరు క్రాంతి, రాహుల్ రాజ్, మనుచౌదరి జిల్లాల వారిగా వివరాలు మంత్రులకు తెలియజేశారు.
అనంతరం మంత్రి సురేఖ మాట్లాడుతూ.. చివరి గింజ వరకూ ధాన్యం సేకరించాలని అధికారులకు సూచించారు. అర్హులకు పథకాలు వర్తింపజేయాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం లక్ష్యం మేర పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు మంజూరు చేశామని, మరో 20శాతం ఇండ్ల మంజూరుకు ప్రభుత్వం అంగీకరించినట్లు చెప్పారు. వానకాలం సీజన్కు ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
సీజనల్ వ్యాధులపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టడంతో పాటు బ్లీచింగ్ పౌడర్ చల్లాలన్నారు. తాగునీరు, కరెంటు సమస్యలు లేకుండా చూడాలన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక కొరత లేకుండా చూడాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి కోరారు. భూభారతి చట్టంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని ఎమ్మెల్సీ అంజిరెడ్డి కోరారు. కాగా, ఈ కీలక సమావేశంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ ఒక్క మాట మాట్లాడలేదు. ఇందుకు మంత్రి కొండాసురేఖ వైఖరి కారణమని తెలుస్తుంది. జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ, మంత్రి దామోదర్ మధ్య కొంతకాలంగా పొసగడం లేదు.
ఉమ్మడి మెదక్ జిల్లా కలెక్టర్ల సమావేశం నిర్వహణ తేదీ, స్థలం తనకు ముందస్తుగా చెప్పకుండానే కొండా సురేఖ ఖరారు చేయడంపై మంత్రి దామోదర అసంతృప్తికి గురైనట్లు సమాచారం. మంత్రి కొండా సురేఖ శుక్రవారం మెదక్ కలెక్టరేట్లో ఉమ్మడి మెదక్ జిల్లా కలెక్టర్లు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆమేరకు ఏర్పాట్లు జరిగిపోయాయి. మంత్రి దామోదర ఒత్తిడి మేరకు సమావేశం తేదీ, వేదిక మారినట్లు తెలుస్తుంది. మంత్రి దామోదర త్వరలోనే మెదక్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్లు, అధికారులతో పోటీగా మరో సమీక్షా సమావేశం నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది.
అందోల్ మండలం అన్నసాగర్ డ్రోన్ దీదీలకు మంత్రులు దామోదర రాజనర్సింహా, కొండా సురేఖ మొదటిడ్రోన్ను అందజేశారు. నమోడ్రోన్ దీదీ పథకంలో భాగంగా శిక్షణ పూర్తి చేసుకున్న 57 మంది ఎస్హెచ్జీ మహిళలకు సబ్సిడీపై డ్రోన్ల పంపిణీని మంత్రులు ప్రారంభించారు. 57 మంది మహిళలకు డ్రోన్లు అందజేయాల్సి ఉండగా, మొదటి విడతలో 26 డ్రోన్లు, శిక్షణ సర్టిఫికెట్లు అందజేస్తున్నట్లు చెప్పారు. మహిళలకు స్వయం ఉపాధి కల్పించటంలో భాగంగా ఎస్హెచ్జీ మహిళలకు డ్రోన్లు అందజేస్తున్నట్లు తెలిపారు.