గజ్వేల్/ములుగు, డిసెంబర్ 23: ప్రజలకు ఆరోగ్యాన్ని ఇచ్చే వంగడాలను సృష్టిం చేందుకు పరిశోధనలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని రాష్ట్ర గవర్నర్, యూనివర్సిటీ చాన్స్లర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. శుక్రవారం గజ్వేల్ నియోజకవర్గం ములుగులోని శ్రీ కొండాలక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యావన విశ్వవిద్యాలయం రెండో స్నాతకోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్, యూనివర్సిటీ చాన్స్లర్ తమిళి సై సౌందరరాజన్ హాజరు కాగా వైస్ చాన్సలర్ నీరజాప్రభాకర్, ప్రొఫెసర్లు ఆమెకు స్వాగతం పలికారు. మొదట వాయిద్యాలతో జాతీయ గీతం ఆలపించిన అనంతరం సభావేదికపై గవర్నర్ తమిళిసై ప్రసంగించారు. వ్యవసాయంలో భాగమైన హార్టికల్చర్ అభివృద్ధికి కృషి చేస్తున్న యూనివర్సిటీ వీసీ నీరజాప్రభాకర్, ప్రొఫెసర్లు, ఉత్తీర్ణత పొంది డిగ్రీ, పీహెచ్డీ పట్టాలు పొందిన విద్యార్థులను ఆమె అభినందించారు. ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్వైపు విద్యార్థులు ఆలోచన చేయడం అభినందనీయమని, హార్టికల్చర్ కోర్సు ఎంపిక చేసుకోవడం గొప్ప విషయమన్నారు ఆరోగ్యం కోసం పండ్లు, పూలు, కూరగాయల పాత్ర ఎంతో ముఖ్యమైనదన్నారు.
కొత్త వండగాలను సృష్టించడానికి విద్యార్థులు భవిష్యత్లో మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఉద్యానవన రంగం వ్యవసాయ రంగానికి మూలస్తంభం లాంటిదని, ఎలాంటి అనారోగ్యాలు లేకుండా గత తరం మనుషులు ఎలాంటి ఆహారం తీసుకుని ఆరోగ్యంగా బతికారో అలాంటి ఆరోగ్యవంతమైన పంటలు పండించడానికి ఉద్యానవన విద్యార్థులు విస్తృతమైన పరిశోధనలు చేయాలన్నారు.కరోనా కారణంగా పౌష్టికాహారం విలువలు ప్రపంచానికి తెలిశాయన్నారు. పూలు,వేర్లు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాల ఔషధ గుణాలు అందరికీ తెలిశాయన్నారు. ప్రజల్లోకి ఈ విషయాలను మరింత తీసుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. శాఖాహారం, పండ్లు, పూల వల్ల మానవాలికి కలిగే లాభాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. యూనివర్సిటీ రెండో స్నాతకోత్సవంలో 482 అండర్ గ్రాడ్యుయేట్,76 పోస్ట్ గ్రాడ్యుయేట్, 17 పీహెచ్డీ పట్టాలు, అండర్ గ్రాడ్యుయేట్లో మూడు బ్యాచ్లకు మూడు యూనివర్సిటీ గోల్డ్ మెడల్స్, పీజీలో రెండుబ్యాచ్లకు రెండు యూనివర్సిటీ గోల్డ్మెడల్స్, పీజీలోమరో ఆరు స్పాన్సర్ గోల్డ్మెడల్స్ను గవర్నర్ చేతుల మీదుగా విద్యార్థులకు ప్రదానం చేశారు. కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ భగవాన్, ప్రొఫెసర్లు అండర్ గ్రాడ్యుయేషన్, గ్రాడ్యుయేషన్, పీహెచ్డీ విద్యార్థులు, పేరెంట్స్, యూనివర్సిటీ సిబ్బంది పాల్గొన్నారు.
భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (హార్టికల్చర్) డాక్టర్ ఆనంద్కుమార్ మాట్లాడుతూ విద్యార్థులను తీర్చిదిద్దడానికి, హార్టికల్చర్ అభివృద్ధికి కొండాలక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యానవన యూనివర్సిటీ వైస్ చాన్సలర్, ప్రొఫెసర్లు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. హార్టికల్చర్ దేశాభివృద్ధిలో కొత్త ప్రకంపనలు సృష్టిస్తున్నదని, భవిష్యత్లో వాతావరణ మార్పుల్లో హార్టికల్చర్ ముఖ్య పాత్రపోషించడం ఖాయమన్నారు. వ్యవసాయంలో భాగమైన హార్టికల్చర్పై దేశంలోని 50శాతం మంది ఆధారపడి జీవిస్తున్నారన్నారు. ప్రపంచంలో హార్టికల్చర్ ఉత్పత్తులు చేయడంలో భారతదేశం రెండోస్థానంలో ఉన్నదన్నారు. వివిధ రకాల పండ్ల వెరైటీలను సృష్టించడంపై కొండాలక్ష్మణ్ ఉద్యానవర్సిటీ శాస్త్రవేత్తలు, వీసీ నీరజాప్రభాకర్ను అభినందించారు. కూరగాయలు, పండ్లు, పూలు, మందు మొక్కల అభివృద్ధికి మరిన్ని ప్రయోగాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదన్నారు. శాస్త్రసాంకేతికతను వినియోగించుకుని హార్టికల్చర్ను మరింత అభివృద్ధి చేస్తే ప్రపంచ మార్కెట్, స్థానిక మార్కెట్లోనూ మరింత వృద్ధిరేటు సాధించే అవకాశం ఉందన్నారు. ఐరోపా దేశాలకు 2011లో ద్రాక్షను ఎగుమతి చేసినప్పుడు మన దేశ పంటలో నాణ్యత లేదని దిగుమతి చేసుకోలేదని, కానీ మూడు సంవత్సరాలుగా ఏమాత్రం నిరాకరించకుండా దిగుమతి చేసుకుంటున్నారన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కృషి చేస్తూ వ్యవసాయం, హార్టికల్చర్ను అభివృద్ధి చేయాలన్నారు. గత కొద్ది సంవత్సరాలుగా హార్టికల్చర్, మైక్రోడ్రిప్ ఇరిగేషన్ తదితర రంగాల ద్వారా వేలాది ఉద్యోగాలు సృష్టించబడ్డాయని, దీనివల్ల యువత ఎంతోమంది ఉద్యోగాలు పొందడానికి అవకాశం ఏర్పడిందన్నారు. హార్టికల్చర్ యూనివర్సిటీలు మరింత టెక్నాలజీతో విద్యార్థుల బోధనలో నాణ్యతాప్రమాణాలు పెంచాల్సిన అవసరం ఉందన్నారు.
ఉన్నత లక్ష్యం దిశగా కార్యాచరణ
ఉద్యాన విశ్వవిద్యాలయాన్ని ఉన్నత లక్ష్యం దిశగా నడిపేందుకు కార్యాచరణ రూపొందించాం. విద్యార్థులకు దేశంలోనే అధునాతన పద్ధతుల్లో విద్యాబోధన చేస్తున్నాం. నూతన ఒరవడికి శ్రీకారం చుట్టేలా వర్సిటీ పరిశోధనలు జరుపుతోం ది. దేశంలోనే తొలి మహిళా ఉపకులపతిగా నన్ను నియమించడం సంతోషం. కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం గుర్తింపు పొందడం గర్వం గా ఉన్నది. నాకు ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్కి కృతజ్ఞతలు, ఈ ఘనత ఆయనకే సొంతం.
– డాక్టర్ నీరజాప్రభాకర్, ఉపకులపనతి
ప్రతిభకు గుర్తింపు
ప్రతిభకు గుర్తింపుగా గోల్డ్ మెడల్ రావడం ఆనందంగా ఉన్నది. పీజీలో ఫ్రూట్ సైన్సెస్ విభాగంలో గోల్డ్మెడల్ సాధించా. ప్రస్తుతం వైఎస్సార్ హార్టికల్చర్ విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ చేస్తున్నా. భవిష్యత్లో నా సేవలతో రైతులకు మేలు చేకూరేలా కృషి చేస్తా.
– సంధ్యారాణి, పీజీ గోల్డ్మెడలిస్ట్
ఆనందంగా ఉన్నది
కష్టపడి చదివి గోల్డ్మెడల్ సాధించినందుకు ఆనందంగా ఉన్నది. మా తల్లిదండ్రుల కండ్లల్లో ఆనందాన్ని చూశా. వారు కన్న కలలను నిజం చేసినందుకు గర్వంగా ఉంది. జీహెచ్ఎంసీలో హార్టికల్చర్ అసిస్టెంట్గా ప్రభుత్వ ఉద్యోగం సాధించా. భవిష్యత్లో మరింత కష్టపడి ఉన్నత స్థాయిలో స్థిరపడేందుకు కృషి చేస్తా.
– గాయత్రి, పీజీ గోల్డ్మెడలిస్ట్
గవర్నర్ నుంచి గోల్డ్మెడల్స్అందుకున్నా
ఎమ్మెస్సీ వెజిటేబుల్ సైన్సెస్, యూనివర్సిటీ టాపర్, ప్రమీళ, జీవన్రాజ్ మెమోరియల్ ట్రస్ట్ మూడు విభాగాల్లో మూడు గోల్డ్మెడల్స్ సాధించా. ఈ మెడల్స్ను గవర్నర్ నుంచి అందుకోవడం సంతోషంగా ఉన్నది. నేను యూనియన్ బ్యాంకులో అగికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్గా రైతులకు సేవలందిస్తున్నా.
– సాయి సుప్రియా, పీజీ గోల్డ్మెడలిస్ట్, వర్సిటీ టాపర్
డాక్టరేట్ పొందడం గర్వంగా ఉంది
ములుగులోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ పూర్తి చేసి డాక్టరేట్ పొందడం గర్వంగా వుంది. మాది నల్లగొండ జిల్లా మిర్యాలగూడ. అశ్వరా వ్పేట్లోని ఉద్యాన విశ్వవిద్యాలయంలో యూజీ, పీజీ పూర్తి చేసి ములుగులోని ఉద్యా నవర్సిటీలో అగ్రికల్చర్ ఫ్రూట్ సైన్సెస్లో పీహెచ్డీ పూర్తి చేశా. ప్రస్తుతం అశ్వరావ్పేట్లోని ఉద్యాన విశ్వవి ద్యాలయంలో సైంటిస్ట్గా విధులు నిర్వహిస్తున్నా. భవిష్యత్లో నూతన పరిశోధనలకు కృషి చేస్తా.
– డాక్టర్ విజయ్కృష్ణ, పీహెచ్డీ విద్యార్థి
నూతన పరిశోధనలకు కృషిచేస్తా
వ్యవసాయ రంగంలో నూతన పరిశోధనలు చేసి కొత్తరకం వంగడాల ఉత్పత్తికి కృషి చేస్తా. మాది నిర్మల్ జిల్లా. ములుగులోని ఉద్యాన విశ్వవిద్యాలయంలో వెజిటేబుల్ సైన్సెస్లో పీహెచ్డీ పూర్తిచేసి మొలుగులోని ఉద్యాన విశ్వ విద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్నా. భవిష్యత్లో వ్యవసాయ రంగంలో మెరుగైన పరిశోధనలు చేసేందుకు కృషి చేస్తా. గోల్డ్మెడల్ అందుకోవడం ఆనందంగా ఉన్నది.
– డాక్టర్ శ్రీనివాస్, పీహెచ్డీ విద్యార్థి
బీఎస్సీ హార్టికల్చర్లో గోల్డ్మెడల్
మాది జగిత్యాల జిల్లా. ములుగులోని హార్టికల్చర్ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ హార్టికల్చర్లో డిగ్రీ పూర్తి చేసి ఉత్తమ ప్రతిభకనబర్చి గోల్డ్మెడల్ సాధించా. కెనరా బ్యాంకులో అగ్రికల్చర్ ఫీల్డ్ఆఫీసర్గా పనిచేస్తున్నా. గోల్డ్ మెడల్ అందుకోవడం ఆనందంగా ఉన్నది.
– కిశోర్, బీఎస్సీ గోల్డ్మెడలిస్ట్