చేర్యాల, జనవరి 2: కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్పాటిల్ కోరారు. మంగళవారం కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలో ఆయన పర్యటించారు. మల్లన్న ఆలయం పక్కన నూతనంగా నిర్మిస్తున్న క్యూలైన్ కాంప్లెక్స్ భవన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండడంతో అసహనం వ్యక్తం చేశారు. తాత్కాలిక పద్ధతిలో కర్రలతో క్యూలైన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆలయ పరిసరాల్లో బెల్ట్ షాపులను మూసివేయాలని ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్మూర్తికి ఆదేశించారు. వీవీఐపీలు, భక్తులు కూర్చునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందు లు కలగకుండా ఆర్టీసీ, వైద్య, విద్యుత్, తదితర శాఖల అధికారులు ఏర్పాట్లు చేయాలన్నారు. అదనపు డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్రావు, ఏసీపీ సతీశ్, ఆలయ ఈవో బాలాజీ, జడ్పీటీసీ సిలువేరు సిద్దప్ప, చేర్యాల సీఐ సత్యనారాయణరెడ్డి, ఎస్పీ ఇన్స్పెక్టర్ రఘుపతిరెడ్డి, ఎస్ఐ నాగరాజు, ఏఈవో వైరాగ్యం అంజయ్య, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.