సిద్దిపేట టౌన్/మెదక్ రూరల్/ మెదక్ మున్సిపాలిటీ/ మునిపల్లి, ఆగస్టు 30: రక్తబంధానికి రూపం రక్ష. ఆత్మీయ బంధానికి ఆధారం రాఖీ. ఆ రెండింటి సమ్మిళితమైన తోబుట్టువులైన తియ్యటి జ్ఞాపకం రక్షాబంధన్. తరాలు మారినా తరుగని వన్నెతో తారతమ్యం లేకుండా జరుపుకొనే పండుగ. అన్నాచెల్లెల్ల అనుబంధానికి అక్కాతమ్ముళ్ల ఆప్యాయతకు సాక్షిభూతమై అవనిపై అజేయంగా వర్ధిల్లుతున్న సంబురం. ఇంతటి ప్రత్యేకమైన పండుగను శ్రావణ పౌర్ణమి నాడు ఈ నెల 31న జరుపుకోనున్నారు.
రాఖీల కొనుగోళ్ల సందడి
రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, జహీరాబాద్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన రాఖీల కొనుగోలు కేంద్రాలు కళకళలాడుతున్నాయి. కాలానికి అనుగుణంగా వివిధ రకాల రాఖీలు అందుబాటులోకి ఉంచడంతో వాటిని మహిళలు ఆసక్తిగా కొనుగోలు చేస్తున్నారు. బేన్టెన్, చోటాభీమ్, ఫేస్బుక్ లోగో వంటి వెరైటీ రాఖీలను అందుబాటులో ఉంచారు. అయితే.. గురువారం పండుగ ఉండటంతో యువతులు, మహిళలు, చిన్నారులు వీటిని కొనుగోలు చేస్తుండటంతో ఆ ప్రాం తాలు సందడిగా ఉన్నాయి.
ఆన్లైన్లో అమ్మకాలు
ఒకప్పుడు రాఖీ పండుగ వచ్చిందంటే.. మహిళలు రాఖీ కొని పోస్టు లేదా కొరియర్ ద్వారా తమ సోదరులకు పంపించేందుకు సెంటర్లకు వెళ్లడం, కవర్లు కొనడం వంటివి చేసేవారు. అయినా.. అవి సమయానికి చేరుతాయో.. లేదోననే సందేహం ఉండేది. ఇలాంటి ఇబ్బందులను తీర్చేందుకు కొత్తగా ఆన్లైన్ ద్వారా రాఖీలు పంపించే పద్ధతి అందుబాటులోకి వచ్చింది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. ఒక్క క్లిక్ ద్వారా నిర్ణీత చిరునామాకు రాఖీ చేరిపోతుంది. జిల్లా, రాష్ట్రం, దేశం, విదేశాల్లో ఎక్కడికైనా రాఖీ పంపించే సౌకర్యాన్ని పలు వైబ్సైట్లు అందుబాటులోకి తెచ్చాయి. ఆన్లైన్లో కూడా వేల సంఖ్యలో రకరకాల రాఖీలు అందుబాటులో ఉన్నాయి. రాఖీ పంపిన సోదరీమణుల కోసం సోదరులు ఆన్లైన్లో వారికి చీరెలు, వాచీలు, బ్యాగులు తదితర బహుమతులు పంపవచ్చు. ఆన్లైన్లో అయితే సకాలంలో డెలివరీ అవుతాయి. స్థోమతను బట్టి రాఖీలను ఎంపిక చేసుకోవచ్చు. బిజీగా ఉండే వారికి ఆన్లైన్ మంచి అవకాశం.
ఈనెల 31న రాఖీ పౌర్ణమి జరుపుకోవాలి
రాఖీ పౌర్ణమి వేడుకను ఈ నెల 31న (గురువారం) జరుపుకోవాలి. ఇదే విషయాన్ని తెలంగాణ విద్వత్సభ అధికారికంగా నిర్ణయించింది. ప్రజలు ఆ రోజు ఎలాంటి సందేహాలు లేకుండా పండుగ జరుపుకోవచ్చు.
– కలకుంట్ల కృష్ణమాచారి, అర్చక సమాఖ్య సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు
పర్యావరణహిత రాఖీలు
సిద్దిపేట అర్బన్, ఆగస్టు 30: అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతిరూపం రాఖీ పండుగ. ఈ పండుగ వచ్చిందంటే రాఖీలను పెద్ద ఎత్తున గిరాకీ ఉంటుంది. కానీ, మనం బయట మార్కెట్లో కొనే రాఖీల్లో ఎక్కువగా ప్లాస్టిక్, రసాయనాలు ఉపయోగించి తయారు చేసేవి ఎక్కువగా ఉంటాయి. అలాంటివి ఉపయోగించకుండా పర్యావరణహిత రాఖీలు తయారు చేసే వినూత్న కార్యక్రమానికి వేదికైంది సిద్దిపేట. హరితహారంలో భాగంగా ఆరోగ్య, ఆకుపచ్చ, ప్లాస్టిక్ రహితంగా వెలుగొందుతన్న సిద్దిపేటలో ఆకులు, పూలతో రాఖీలు తయారు చేస్తూ మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల గ్రామంలో ఆకులు, పూలతో రాఖీలు తయారు చేయడం విశేషం.
మామిడి, రాగి ఆకులు, పూలతో రాఖీలు
నిత్యం పర్యావరణ హితం కోసం కాంక్షించే మంత్రి తన్నీరు హరీశ్రావు సిద్దిపేట నియోజకవర్గంలో హరితహారం కార్యక్రమానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. అలా హరితహారంలో నాటిన మొక్కలే నేడు రాఖీలు తయారు చేయడానికి ఆధారమయ్యాయి. మంత్రి హరీశ్రావు ఆలోచనకు అనుగుణంగా సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాలలో కొంతమంది మహిళలు ప్రకృతి సిద్ధమైన మామిడి, రావి ఆకులు, పలు రకాల పూలను ఉపయోగించి ఎకో ఫ్రెండ్లీ రాఖీలు తయారు చేస్తున్నారు. జిల్లా పంచాయతీ అధికారి దేవకీదేవి ఆధ్వర్యంలో పొన్నాల గ్రామంలోని కొంతమంది మహిళలకు
ఆరు రోజుల పాటు పర్యావరణహిత రాఖీలు తయారు చేసేందుకు శిక్షణ కూడా ఇప్పించారు.
ఎన్నో వెరైటీలు
రకరకాల రంగులు, రూపాలు, హంగులతో ఆకర్షణీయమైన రాఖీలు మార్కెట్లోకి వచ్చాయి. రుద్రాక్షలు, వినాయకస్వామి, రకరకాల పుష్పాలు, మిల్క్పాస్ వంటి వెరైటీ రాఖీలు, బంగారు పూతతో చేసిన రాకీట్లు అందుబాటులో ఉంచారు.
అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్ ;జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి హరీశ్రావు
అకాతమ్ముళ్లు, అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రక్షా బంధన్ అని మంత్రి హరీశ్రావు అన్నారు. జిల్లా ప్రజలకు రాఖీ పౌర్ణమి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పండుగను అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు సూచకంగా.. ఈ మంచి అనుబంధాన్ని ఆప్యాయతతో ఆనందంగా జరుపుకొంటారని చెప్పారు. సోదరుడు సోదరిమణుల అనురాగానికి సంకేతమైన ఈ పండుగను కుటుంబ సభ్యులందరూ సంతోషంగా జరుపుకోవాలన్నారు. సిద్దిపేట నియోజకవర్గం అన్నింటిలో ఆదర్శంగా నిలుస్తున్నదని, ప్లాస్టిక్ నిర్మూలించే దిశగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టామన్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్లాస్టిక్తో తయారు చేసే రాఖీలు కాకుండా సహజ సిద్ధంగా ఉండే ఆకులు, పువ్వులతో ఈ సంవత్సరం నుంచే తమ్ముళ్లకు అన్నయ్యలకు ‘ఏకో ఫ్రెండ్లీ రాఖీ’ కట్టాలి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ఈ సందర్భంగా సిద్దిపేట నియోజకవర్గ మహిళలు స్ఫూర్తిగా నిలుస్తున్నారని, మానవ ఆరోగ్యంపై ఆలోచించి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమని తెలిపారు.