ఇద్దరికి ఆపరేషన్లు చేసిన వైద్యులు
వైద్యులను సంప్రదిస్తే చికిత్సలు
శస్త్రచికిత్సల సౌకర్యాన్ని వినియోగించుకోవాలి : డీఎంహెచ్వో
గజ్వేల్, జూన్ 7 : గజ్వేల్ ప్రభుత్వ జిల్లా దవాఖానలో మంగళవారం సాయంత్రం మోకాలి చిప్పల మార్పిడి ఆపరేషన్లు వైద్యులు నిర్వహించారు. గాంధీ దవాఖాన ఆర్థోపెడిక్ హెచ్వోడీ డాక్టర్ రవీందర్ ఆధ్వర్యంలో మోకాలి చిప్పల మార్పిడి ఆపరేషన్లు చేశారని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ సాయికిరణ్ తెలిపారు. రాయపోల్కు చెందిన నరేందర్రెడ్డి, గజ్వేల్ మండలం కొల్గూరుకు చెందిన సుజాతకు డాక్టర్లు చంద్రశేఖర్రావు, ప్రభాకర్, రాజేశ్ విజయవంతంగా ఆపరేషన్లు పూర్తి చేశారు. వీరితో పాటు జిల్లా డీఎంహెచ్వో డాక్టర్ కాశీనాథ్, ఆర్ఎంవో డాక్టర్ రాము, దవాఖాన ఆర్థోపెడిక్ డాక్టర్ సుధాకర్, డాక్టర్ రాజ్కుమార్, అనస్థీషియన్ డాక్టర్ మహిపాల్, డాక్టర్ పూర్ణ చందర్రావు, ఆపరేషన్ థియేటర్ సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డీఎంహెచ్వో డాక్టర్ కాశీనాథ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావుల కృషితో జిల్లాలో మెకాలి చిప్పల మార్పిడి ఆపరేషన్లు ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. జిల్లాలోని ప్రజలకు ఇప్పటికే మోకాలి చిప్పల మార్పిడి ఆపరేషన్ల గురించి అవగాహన కల్పించామన్నారు. ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేసినందుకు గాంధీ వైద్యులు డాక్టర్ రవీందర్, ఇతర వైద్యులు, సిబ్బందిని డాక్టర్ కాశీనాథ్ అభినందించారు.