సంగారెడ్డి, నవంబరు 3: బీఆర్ఎస్ కార్యకర్తలు కదన సింహాల్లా కదనరంగలోకి దూకితే కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గాల్లో కొట్టుకుపోతారని, కాంగ్రెస్కు ఓట్లు వేసి కష్టాలు కొని తెచ్చుకోవద్దని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలోని పోతిరెడ్డిపల్లి పీఎస్ఆర్ గార్డెన్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి అధ్యక్షతన నియోజకవర్గంలోని బూత్ కమిటీలు, వంద ఓటర్ల ఇన్చార్జిలు, గ్రామాధ్యక్షులు, పార్టీ నాయకులతో మంత్రి హరీశ్రావు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీ, కాంగ్రెస్, బీసీసంఘం నాయకులు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేశారు. వారికి గులాబీ కండువాలు కప్పి మంత్రి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఇటీవల పక్కరాష్ట్రం కర్ణాటకలో ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ పార్టీ గెలిచిందని, అప్పుడే అక్కడ కరెంటు కష్టాలు మొదలయ్యాయన్నారు.
తెలంగాణకు సరిహద్దులో ఉన్న కర్ణాటక ప్రజలు నారాయణఖేడ్కు వచ్చి కాంగ్రెస్ను తెలంగాణ ప్రజలు నమ్మొద్దని ప్రచారం చేస్తున్నారన్నారు. సంగారెడ్డిలో చింతా ప్రభాకర్ కృషితోనే మెడికల్ కళాశాల మంజూరైందన్నారు. సంగారెడ్డి, సదాశివపేట పట్టణాల ప్రజల దహార్తిని దూరం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనన్నారు. మాయమాటలతో కాంగ్రెస్ పార్టీ మరొక్కసారి ప్రజలను మోసం చేసి ఓట్లు దండుకునేందుకు ప్రజలను మభ్యపెడుతుందన్నారు. తెలంగాణ ద్రోహులకు గుణపాఠం చెప్పే సమయం వచ్చిందని, ఎమ్మెల్యే జగ్గారెడ్డి మొసలికన్నీళ్లకు ప్రజలు మోసపోవద్దని సూచించారు. గత ఎన్నికల్లో జగ్గారెడ్డి నియోజకవర్గంలో గల్లీకో ఏటీఎం పెట్టి డబ్బులు తీసుకునే విధంగా ప్రారంభిస్తానని, చెప్పిన మాటలు అమలు చేశారా అని మంత్రి ప్రశ్నించారు. జగ్గారెడ్డి గెలిచిన తర్వాత సంగారెడ్డి ప్రజల కష్టాలు పట్టించుకోలేదన్నారు. ప్రజలు ఆలోచించి అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు.
బీజేపీ ప్రభుత్వం రూ.400 ఉన్న సిలిండర్ను రూ.వెయ్యికి పెంచి ప్రజల నడ్డివిరిచిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల్లో గెలుపొందగానే వంట గ్యాస్ను రూ.400లకే అందజేస్తుందన్నారు. కేసీఆర్ బీమాతో భూమిలేని పేదలకు రాష్ట్రవ్యాప్తంగా కోటి కుటుంబాలకు కేసీఆర్ ధీమాను అందజేసే పథకం ప్రారంభిస్తామన్నారు. అలాగే మహిళల కోసం సౌభాగ్యలక్ష్మి పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభి అందజేస్తారన్నారు. ప్రస్తుతం రైతులు మృతి చెందితే పది రోజుల్లో రూ.5లక్షల బీమాను రైతు కుటంబానికి అందజేస్తున్నామన్నారు. ఈసారి గెలిస్తే బీమా పథకంతో రూ.15లక్షలను అందజేసే పథకానికి శ్రీకారం చుట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. రైతుబంధు సృష్టికర్త సీఎం కేసీఆర్ అని రైతుబంధును రూ.10 వేల నుంచి రూ.16వేలకు పెంచి అందజేస్తామన్నారు. బీజేపీ డకౌట్.. కాంగ్రెస్ రనౌట్.. బీఆర్ఎస్కుకు సెంచరీ ఖాయమని మంత్రి పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు రెండురోజులు ఉండగా జగ్గారెడ్డి పురుగుల మందు డబ్బా పట్టుకుని మోసం చేసే ప్రయత్నం చేస్తారని, వాటిని నమ్మొద్దని ప్రజలకు సూచించారు. నియోజకవర్గంలో 10వేల మంది పేదలకు ఇండ్ల స్థలాలు పంపిణీ చేస్తామని, అర్హులందరికీ డబుల్బెడ్ రూం ఇండ్లు పంపిణీ చేస్తామన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
ఎన్నికలకు ఇరవై ఐదు రోజులు సమయం ఉందని, ఈ ఇరవై ఐదు రోజులు కష్టపడితే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చింతా ప్రభాకర్ గెలుపు సాధ్యమని టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ కార్యకర్తలు వందమంది ఓటర్ల ఇన్చార్జులు, బూత్ కమిటీ కన్వీనర్లు ఏబీసీడీలుగా విభజించి ఓటర్లలో చైతన్యం తీసుకురావాలన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ మరోసారి బీఆర్ఎస్ను గెలిపించాలన్నారు. గెలిచిన అనంతరం అమలు చేసే పథకాలను ప్రజలకు వివరించి ఓట్లు అడగాలన్నారు. వందమంది ఓటర్లకు ఒక ఇన్చార్జి బాధ్యత బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసే విధంగా అన్ని రకాలుగా ప్రజలకు నచ్చజెప్పాలన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు చింతా ప్రభాకర్ అని ఐదేండ్ల క్రితం గెలిచిన జగ్గారెడ్డి నియోజకవర్గంలోని గ్రామాలకు వెళ్లని సందర్భాలు ఉన్నాయన్నారు. కరోనా కష్టకాలంలో బాధిత కుటుంబాలకు అవసరమైన వస్తువులు, మందులు, శానిటైజర్లు, మాస్క్లు అందజేసి సేవలు చేసిన ప్రభాకర్ను గెలిపించేందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలన్నారు.
గత ఎన్నికల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు కృషితో కొద్ది మెజార్టీతో ఓటమి చెందానని, ఈసారి ఎన్నికల్లో కార్యకర్తలే నా బలం.. బలగమని బీఆర్ఎస్ సంగారెడ్డి అభ్యర్థి చింతా ప్రభాకర్ అన్నారు. ఓటమి చెందినా ప్రజల మధ్యనే ఉంటూ సేవ చేశానని, కరోనా కష్టకాలంలో బాధితులకు వైద్యసేవలు, నిత్యావసర వస్తువులు, మందులు సరఫరా చేశామన్నారు. ముఖ్యంగా బతుకుదెరువుకు వచ్చిన ప్రజలను కంటికిరెప్పాలా కాపాడుకున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయకుండా ప్రజలు తనను గెలిపించి అభివృద్ధి, సంక్షేమాన్ని పెంచేందుకు సైనికుల్లా పనిచేసి గెలిపిస్తారని ఆశిస్తున్నానన్నారు. నా ఆరోగ్యం బాగాలేకున్నా.. మీరే నీ ఆరోగ్యం..అని భావించి మీరే అభ్యర్థిగా అనుకుని పనిచేసి గెలిపించాలని ప్రభాకర్ కోరారు. సమావేశంలో నియోజకవర్గ కో-కన్వీనరు పట్నం మాణిక్యం, ఎంఏ ముఖామ్, శివరాజ్ పాటిల్, సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డితోపాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
అక్కన్నపేట, నవంబర్ 3: నా పేరు గుగులోతు బిచ్ఛాని, మా భర్త పేరు భీముడు. మాది రాజుతండా. లంబాడోళ్లం. కూలికిపోయి బతేకటోళ్లం. మాకు నలుగురు ఆడ పిల్లలు. వీళ్లకు ఎట్లా పెండ్లి చేయాలనే రంది అయ్యేది. ఉన్న రెండు ఎకరాల భూమిని చేసుకుంటూ, కూలీ, నాలీ, అప్పో, సప్పో చేసి ఆటో, ఇటో పెద్ద బిడ్డ శ్రీలత పెండ్లి చేసినం. తరువాత అంత ఆగం అయింది. 2017లో రెండో బిడ్డ సుమలత, 2018 మూడో బిడ్డ స్వర్ణలత, 2019లో నాల్గో బిడ్డ మంగకు పెండ్లి చేసినం.
తాపకుఇంత భూమి అమ్మగా ఇక అర్థ ఎకరం భూమి మిగిలింది. కేసీఆర్ సారూ దయ వల్ల ముగ్గురు బిడ్డలకు కళ్యాణ లక్ష్మి వచ్చింది. దగ్గరదగ్గర మొత్తం కల్యాణలక్ష్మి పైసలతోనే ముగ్గురు బిడ్డలకు సుమారు 10 తులాలు బంగారం కొనిచ్చిన. ముగ్గురు బిడ్డలను కాన్పులకు సర్కారు దవాఖానలకు తీసుకుపోయిన. కేసీఆర్ కిట్టు వచ్చింది. మాకు కొడుకులు లేనందుకు సీఎం కేసీఆర్ మా ఆడపిల్లలకు తోబుట్టువు అయ్యిండు. చాలా తృప్తి అయ్యింది. సీఎం కేసీఆర్కు మా గిరిజన కుటుంబం రుణపడి ఉంటుంది. అంతేకాదు మాకు అన్ని విధాలా సర్కారోళ్ల సాయం అందుతున్నది.
హుస్నాబాద్ టౌన్, నవంబర్ 3: ఇరవై మూడెండ్లనుంచి తండ్లాడుతున్న. మస్తు ఏడిసన. ఇల్లు కావాలని. మేం బొల్లు అమ్ముకునే బతికేటోల్ల బాధలు సెప్పితే వొడవయి. మేం సంపాయించిది పిల్లగాండ్లకే సరిపోయింది. ఇద్దరు బిడ్డలు, ఒక కొడుకు ఉన్నరు. ఇల్లు జాగలేదు. కొందమంటే భూములు లచ్చలల్ల ఉన్నయి. కొనలేక బాధపడేది. కొనలేక మావోళ్లను బతిలాడి ఈ జాగల కవర్లు ఏసుకోని ఉంటున్నం. సాన రోజులనుంచి సూత్తున్న. మూడేండ్ల కింద దరఖాస్తు పెట్టుకున్న. కేసీఆర్ ధర్మాత్తుడు ఆయనతోనే మాకు ఇల్లు వచ్చింది. ఆయన కడుపు సల్లంగ ఉండ. ఓటు అయితే ఆయనకే ఎత్తం. ఆయన ఏడ ఉన్న ఓట్లు ఆయనకే గంపగుత్తగ ఎత్తం. సీఎంకేసీఆర్ సారు ఇల్లు ఇచ్చిండ్రు. ఇల్లుకోసం ఎవ్వలకు రూపాయికూడ ఇయ్యలేదు. ఎవ్వలను కూడ కలవలే. డబుల్ బెడ్రూం వచ్చుడు సాన సంతోషం.