సంగారెడ్డి, ఏప్రిల్ 20(నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాలో కేసీఆర్ హయాంలోనే పెద్దఎత్తున పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. కేసీఆర్ పాలించిన తొమ్మిదిన్నరేళ్లలో సంగారెడ్డి జిల్లాకు 28,181 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభించాయి. కేసీఆర్ సర్కార్ పరిశ్రమలు ఏర్పాటు చేయలేదని సీఎం రేవంత్రెడ్డి మెదక్ రోడ్షోలో విమర్శించారు. ఇందిరమ్మ హయాంలోనే జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటయ్యాయని, ఆ తర్వాత వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం పరిశ్రమలు ఏర్పాటు చేయలేదని ఆరోపించారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత బీఆర్ఎస్ పాలనలో సంగారెడ్డి జిల్లా పరిశ్రమల స్థాపనకు కేరాఫ్గా మారింది. పారిశ్రామిక పెట్టుబడుల్లో రాష్ట్రంలోనే సంగారెడ్డి జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఫార్మా, లైఫ్ సైన్సెస్, డిఫెన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇతర పరిశ్రమలు సంగారెడ్డి జిల్లాలో పెద్ద సంఖ్యలో ఏర్పాటయ్యాయి. 2014 నుంచి 2023 వరకు సంగారెడ్డి జిల్లాలో మొత్తం 2572 పరిశ్రమలు రూ. 28,161 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు అయ్యాయి. పరిశ్రమల ఏర్పాటు ద్వారా 1,88,191 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయి. జిల్లాలోని పరిశ్రమల నుంచి ఏటా సుమారు రూ.3వేల కోట్ల ఎగుమతులు జరిగాయి. రాష్ట్రంలో ఎగుమతులతో పోలిస్తే సంగారెడ్డి జిల్లా వాటా 19.53 శాతం ఉంది. అప్పటి ఐటీ పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ పటాన్చెరు, సంగారెడ్డి, జహీరాబాద్లలో పలు పరిశ్రమలను ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లాలో ఫార్మా, బల్క్డ్రగ్ కంపెనీలు ఎక్కువగా ఏర్పాటయ్యాయి. కొత్తగా సంగారెడ్డి జిల్లాలో ఫార్మాసిటీ ఏర్పాటును కేసీఆర్ సర్కారు ప్రతిపాదించారు. మునిపల్లి మండలంలోని లింగంపల్లిలో487 ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. కేసీఆర్ సర్కారు తన పాలనలో పటాన్చెరు నియోజకవర్గంలో ఐటీ టవర్ను నిర్మించాలని ప్రతిపాదించింది. ఐటీ టవర్ ఏర్పాటైతే సంగారెడ్డి జిల్లాలో ఐటీ రంగ పరిశ్రమలు ఏర్పాటుకు అవకాశాలు ఉన్నాయి.
తొమ్మిదేళ్లలో రూ.28,181 కోట్ల పెట్టుబడులు
ఉమ్మడి రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లాలో 4306 పరిశ్రమలు స్థాపించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక సంగారెడ్డి జిల్లాలో 2572 పరిశ్రమలను కేసీఆర్ హయాంలో ఏర్పాటయ్యాయి. రూ.13,305 కోట్ల పెట్టుబడులతో 88 మెగా పరిశ్రమలు ఏర్పాటు చేశారు. రూ.6323 కోట్ల పెట్టుబడులతో 157 భారీ పరిశ్రమలు, రూ.3938 కోట్ల పెట్టుబడులతో 177 మధ్య తరహా పరిశ్రమలను పారిశ్రామిక వేత్తలు ఏర్పాటు చేశారు. రూ.4065 కోట్లతో 1085 చిన్న పరిశ్రమలు, రూ.548 కోట్ట పెట్టుబడులతో 1065 చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ఆయా పరిశ్రమల ద్వారా 1,88,191 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయి. పరోక్షంగా వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించాయి. జహీరాబాద్లోని మహీంద్రా సంస్థ రూ.1000 కోట్లతో ఎలక్ట్రిక్ బ్యాటరీ తయారీ యూనిట్ను ఏర్పాటు చేసింది. సదాశివపేటలోని ఎంఆర్ఎఫ్ పరిశ్రమ రూ.1000 కోట్లతో కంపెనీ విస్తరణ చేపట్టింది. కోవలెంట్ ఫార్మా లేబరేటరీస్ రూ.708 కోట్లు, పిరమిల్ ఫార్మా కంపెనీ రూ.468 కోట్లు, అరబిందో ఫార్మా రూ.641 కోట్ల పెట్టుబడులు పెట్టాయి. కార్వీ సోలార్ పవర్ సంస్థ రూ.151 కోట్లు, అక్షయ్ ఉర్జూ కంపెనీ రూ.169 కోట్లు, ఓమిక్స్ కంపెనీ రూ.128 కోట్లు పెట్టుబడులు పెట్టాయి.
దేశంలోనే అతిపెద్ద మెడికల్ డివైజ్ పార్కు ఏర్పాటు
మన్మోహన్ సింగ్ సర్కార్ హయాంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం జహీరాబాద్లో నిమ్జ్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆతర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్జ్ ఏర్పాటుకు అవసరమైన నిధులు సమకూర్చలేక పోయింది. దీంతో అందరూ నిమ్జ్ అటకెక్కుతుందని ఆందోళన చెందారు. కేసీఆర్ సర్కార్ జహీరాబాద్లో నిమ్జ్ ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ చేపట్టడంతో పాటు పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించింది. కేసీఆర్ సర్కార్ పటాన్చెరు మండలం సుల్తాన్పూర్లో 250 ఎకరాల్లో రూ.1424 కోట్ల పెట్టుబడులతో దేశంలోనే అతిపెద్ద మెడికల్ డివైజ్ పార్కును ఏర్పాటు చేసింది. ఈ మెడికల్ డివైజ్ పార్కులో 50 పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. ఈ పరిశ్రమలతో 7వేల మందికి ప్రత్యక్షంగా, 15వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించనున్నది. మెడికల్ డివైజ్ పార్కులో 26 పరిశ్రమల వరకు ప్రారంభమయ్యాయి. గతేడాది మంత్రి కేటీఆర్ రూ.265 కోట్లతో ఏర్పాటైన ఏడు పరిశ్రమలను ప్రారంభించారు. రూ.530 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటైన సహజానంద మెడికల్ టెక్నాలజీస్ సంస్థను ప్రారంభించారు. మెడికల్ డివైజ్ పార్కులోని ఆకృతి ఆప్తాల్మిక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఆకృతి సంస్థ మొత్తం 35 లక్షల కండ్ల అద్దాలను కంటివెలుగు కోసం ఉత్పత్తి చేసింది. మెడికల్ డివైజ్ పార్కుకు అనుబంధంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళా పారిశ్రామిక వేత్తల కోసం ఫిక్కీ ఫ్లో పార్కును 50 ఎకరాల్లో ఏర్పాటు చేసింది. ఎఫ్టీసీసీఐ లేడీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేసింది. ఇందులో 26 పరిశ్రమలు ఏర్పాటు చేశారు. జిన్నారం మండలం శివానగర్లో ప్రభుత్వం 120 ఎకరాల్లో ఎల్ఈడీ పార్కును ఏర్పాటు చేస్తోంది. ఎల్ఈడీ పార్కులో వంద పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి.
కేసీఆర్ హయాంలో మెతుకు సీమ ప్రగతి బాట
సిద్దిపేట, ఏప్రిల్ 20(నమస్తే తెలంగాణ ప్రతినిధి): సమైక్య రాష్ట్రంలో మెదక్ జిల్లా అన్నిరంగాల్లో దగాకు గురైంది. అప్పటి ప్రభుత్వాలు జిల్లాలో ఒక్క ప్రాజెక్టు కట్టాలన్న ఆలోచన చేయలేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో ఉమ్మ డి మెదక్ జిల్లాకు మహర్దశ వచ్చింది. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో వందేండ్ల అభివృద్ధి జరిగింది. రిజర్వాయర్లు, నూతన కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాలు ఏర్పాటయ్యాయి. సమైక్య పాలనలో నిత్యం కరువు కాటకాలు, తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు, రైతు ఆత్మహత్యలు, ఆకలి చావులతో అల్లాడిన మెతుకుసీమ.. కేసీఆర్ హయాంలో పచ్చని పంటల మాగాణంగా మారింది.
సాగు, తాగునీటికి పెద్దపీట
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట జిల్లా మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులను వేల కోట్ల రూపాయలు వెచ్చించి బీఆర్ఎస్ ప్రభు త్వం నిర్మించింది. దీంతో లక్షల ఎకరాలకు సాగునీరు అంది గడిచిన ఐదారేండ్లుగా ఈ ప్రాంతంలో భూమికి బరువయ్యేలా పం టలు పండాయి. మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ చేపట్టడంతో భూగర్భ జలాలు పెరిగి ఆయకట్టు కింద సాగు పెరిగింది. మెదక్ జిల్లాలో ఘణపూర్ ప్రాజెక్టుకు వంద కోట్ల రూపాయలు ఖర్చుచేసి పూర్వవైభవం తెచ్చారు. సింగూరు ప్రాజెక్టుకు కాళేశ్వరం లింకు కలిపారు. సంగారెడ్డి జిల్లాలో బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పనులకు కేసీఆర్ భూమిపూజ చేశారు.
మెడికల్ కళాశాలల ఏర్పాటు…
సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్లో మెడికల్ కళాశాలలు, నర్సింగ్ కళాశాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గజ్వేల్లో ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటు చేసి విద్యారంగాన్ని బలోపేతం చేసింది. సిద్దిపేటలోని ఐటీ టవర్, సిద్దిపేటలోని ఆటోనగర్ ఏర్పాటు చేసింది. చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమలు తెచ్చి ఉపాధి అవకాశాలను కల్పించింది.
సాకారమైన రైలు కల…
రైలు సౌకర్యం లేని మెదక్ ప్రాంతానికి బీఆర్ఎస్ ప్రభుత్వం రైలు కల సాకారం చేసింది. మెదక్ నుంచి అక్కన్నపేట వరకు సుమారు 17 కిలోమీటర్ల రైల్వేలైన్ బీఆర్ఎస్ హయాంలో జరిగింది. రైల్వేలైన్కు కావాల్సిన భూసేకరణ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసి ఇవ్వడంతోనే రైలు కల సాకారమైంది.
నిమ్జ్తో పెట్టుబడుల వరద
జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్కల్, ఝరాసంగం మండలాల్లో జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి(నిమ్జ్) ఏర్పాటుపై కేసీఆర్ సర్కార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. కేసీఆర్ సర్కార్ భూసేకరణతో పాటు మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయించింది. నిమ్జ్లో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ తీసుకోవడంతో బడా కంపెనీలు తరలివస్తున్నాయి. 12,635 ఎకరాల్లో నిమ్జ్ ఏర్పాటు అవుతున్నది. నిమ్జ్ ప్రాజెక్టు వ్యయం 13,300 కోట్లు కాగా, 60వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా. నిమ్జ్లో పరిశ్రమల ఏర్పాటుకు వీలుగా కేసీఆర్ సర్కార్ విద్యుత్, నీటి సౌకర్యంతో పాటు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించింది. రూ.100 కోట్లతో ఎల్లోయి శివారు వరకు ప్రత్యేకంగా నాలుగు లేన్ల రోడ్డు నిర్మించింది.
అప్పటి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ గత ఏడాది నిమ్జ్లో వెమ్టెక్నాలజీకు సంబంధించిన తొలి పరిశ్రమ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. వెమ్ టెక్నాలజీ రూ.1000 కోట్లతో ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ సిస్టమ్ ఫెసిలిటీ ఏర్పాటు చేస్తోంది. ట్రైటాన్ కంపెనీ రూ.2100 కోట్ల పెట్టుబడులతో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తోంది. జర్మనీకి చెందిన లైట్ ఆటో వంద ఎకరాల్లో రూ.1500 కోట్లతో ఈ వెహికిల్ తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తోంది. తద్వారా 9వేల మందికి ప్రత్యక్షంగా, 18వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. నిమ్జ్లో డిఫెన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి సంబంధించి పెద్ద సంఖ్యలో పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. సంగారెడ్డి నియోజకవర్గంలోని కొండాపూర్ మండలం గుంతపల్లి గ్రామంలో మోమిన్ ఇండియా రూ.300 కోట్లతో పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నది. గతేడాది అప్పటి ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ పరిశ్రమ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. కంపెనీ ఏర్పాటుతో 500 మందికి ఉపాధి లభిస్తుంది.