సిద్దిపేట, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాజకీయంగా ఎదగడానికి, తెలంగాణ సాధించడానికి పోరాట పటిమ అందించింది, పెంచింది మెతుకు సీమ అని బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. మంగళవారం సంగారెడ్డి జిల్లాలోని అందోల్ నియోజకవర్గ పరిధిలో జాతీయ రహదారి పక్కన తార్దాన్పల్లి వద్ద మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల బీఆర్ఎస్ ప్రజాఆశీర్వాద సభ జరగింది. సభకు రెండు నియోజకవర్గాల పరిధిలోని అందోల్, జహీరాబాద్, నారాయణఖేడ్, సంగారెడ్డి, పటాన్చెరు, నర్సాపూర్ శాసనసభ నియోజకవర్గాల నుంచి ఆశేషంగా జనం తరలివచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ…మీరు ఇచ్చిన బలమే ఢిల్లీతో కొట్లాడి ఆనాడు ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించానన్నారు. మీ దీవెన, అండదండలు, ఆశీర్వాదం లేకపోతే ఈ మెతుకు గడ్డ నీరు, రక్తం తన శరీరంలో లేకపోతే తనకు ఈస్థాయి వచ్చేది కాదన్నారు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఏ జిల్లాలో రానటువంటి భారీ మెజార్టీనిచ్చారన్నారు. సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు, ఇతర నాయకుల నేతృత్వంలో ఏడుగురు ఎమ్మెల్యేలను గెలిపించిన మెతుకు సీమ గడ్డకు రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తున్నానన్నారు. ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేనని కేసీఆర్ చెప్పారు. ఇయ్యాళ కొంతమంది ఏదేదో మాట్లాడుతున్నారన్నారు. బీఆర్ఎస్కు పార్లమెంట్ ఓట్లు ఎందుకు, సీట్లు ఎందుకు అని మాట్లాడుతున్నారన్నారు. ఇప్పుడే కావాలి బీఆర్ఎస్కు పార్లమెంట్లో ఓట్లు సీట్లు అని చెప్పారు. ఆనాడు మీరు ఆశీర్వదించి పంపకపోతే, కరీంనగర్కు వెళ్లి పార్లమెంట్కు పోటీ చేసి గెలవకపోతే తెలంగాణ బిడ్డగా గర్జించకపోతే మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చేదా..? అని అన్నారు. ఈరోజు కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ఆశలు, హక్కులు నేరవేర్చాలంటే, తప్పకుండా బీఆర్ఎస్ బిడ్డలు పార్లమెంట్లో ఉంటేనే మన హక్కులు నెరవేరుతాయన్నారు.
ఒకనాడు సింగూరు ప్రాజెక్టును ఎండబెట్టింది ఇదే లిల్లిపుట్టుగాళ్లు కదా అని కేసీఆర్ అన్నారు. మనకి నీళ్లు ఇయ్యలేదు. ఇక్కడి నుంచి హైదరాబాద్కు తీసుకుపోయి ఇచ్చారని చెప్పారు. సాగు నీరు లేక ఏడ్చినం, ఎంతో భాదపడ్డామన్నారు. సాగునీళ్ల కోసం నిజామాబాద్, సంగారెడ్డిలో ధర్నాలు చేశారన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఇదే హరీశ్రావు నీటి పారుదల శాఖ మంత్రిగా ఉండి కాల్వలు తవ్విస్తే ఆందోల్కు నీళ్లు వచ్చి పంటలు పండాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనాడు నీళ్లు వచ్చినాయా..? అని ప్రశ్నించారు. ఇయ్యాళ ఈ లిల్లి పట్టుగాళ్లు ఏం చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సంగమేశ్వర, బసవేశ్వర రెండు లిప్టులు పెట్టుకున్నామన్నారు. కాళేశ్వరం నీళ్లతోని సింగూరుకు లింకు పెట్టుకున్నామన్నారు. మల్లన్నసాగర్తో నిజాంసాగర్, మెదక్ జిల్లాకు కలుపుకున్నామన్నారు. ఫలితంగా సంగమేశ్వర, బసవేశ్వరతో నారాయణఖేడ్, జహీరాబాద్, అందోల్ నియోజకవర్గాలకు వచ్చే విధంగా ప్రాజెక్టును రూపకల్పన చేసుకొని పనులు ప్రారంభించామన్నారు. రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందే విధంగా ఈ ప్రాజెక్టు చేసుకున్నామన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆ ప్రాజెక్టును ఆపారని మండిపడ్డారు. ఎందుకు కోల్డ్ స్టోరేజీల పెట్టారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఈ విషయాన్ని ప్రజలు బాగా ఆలోచన చేయాలని, ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కర్రుకాల్చి వాత పెట్టాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కోరారు.
బీఆర్ఎస్ తరఫున పార్లమెంట్కు నిలబడిన వాళ్లు చదువుకున్న వాళ్లని, మెదక్లో వెంకట్రామిరెడ్డి, జహీరాబాద్లో అనిల్కుమార్ గెలిస్తే ఓల్పట, దాపట కోడెళ్లలాగ ఉంటారని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. వెంకట్రామిరెడ్డి ఐఏఎస్, గాలి అనిల్కుమార్ తెలంగాణ ఉద్యమకారుడని, ఉద్యమంలో పోరాటం చేసిన బలహీన వర్గాలకు చెందిన బిడ్డ అని చెప్పారు. వీరిద్దరినీ గెలిపించాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆగం ఆగం అయితే అడివి అడివి అయితామన్నారు. ఆనాడు చెప్పిన మీ బిడ్డగా తెలంగాణ తెస్తా అని, మళ్లీ చెబుతున్న మీ ఆశీర్వాదంతో గ్యారంటీగా రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొస్తానన్నారు. రైతాంగం, అన్ని వర్గాల ప్రజలను కాపాడుతా అని ప్రజల హర్షధ్వానాల మధ్య కేసీఆర్ చెప్పారు. సభకు తరలివచ్చిన ప్రతిఒక్కరికీ కేసీఆర్ ధన్యవాదాలు తెలియజేశారు.