పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలి
కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
సిద్దిపేటలో పర్యటించి సలహాలు, సూచనలు
ములుగులో ధరణి పైలట్ ప్రాజెక్ట్ సందర్శన
సిద్దిపేట, జూన్ 17: సకల సదుపాయాలతో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్నగర్లో డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి పేద లకు అందించిందని, ఇక్కడ పచ్చని చెట్లు, విశాలమైన రోడ్లు.. సుందరంగా ఉన్నాయని, కాలనీ ఇలాగే ఎప్పటికీ ఆదర్శంగా నిలిచేలా పచ్చదనం, పరిశుభ్రతతో వెల్లివిరిసేలా పారిశుధ్య పనులు ఉండాలని సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ రవీందర్ను కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశించారు. శుక్రవారం పట్టణంలోని కేసీఆర్నగర్ డ బుల్ బెడ్రూం ఇండ్లలో కలెక్టర్ పర్యటించారు. కాలనీలో కలియతిరిగారు.
క్రీడా ప్రాంగణం, ఫంక్షన్ హాల్, సమీకృత మార్కెట్ను పరిశీలించారు. మొదటిసారి వచ్చిన కలెక్టర్కు మున్సిపల్ కమిషనర్ పూలమొక్క అందించి స్వాగతం పలి కారు. వార్డు కౌన్సిలర్ నాయిని చంద్రం శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా క్రీడా ప్రాంగణంలో రాళ్లు లేకుండా చూసుకోవాలన్నా రు. శానిటరీ పనులు ఎలా జరుగుతున్నాయి? తడి పొడి చెత్త వేరు చేసి ఇస్తున్నారా? అని తెలుసుకున్నారు. ఫంక్షన్ హాల్ కాలనీవాసులకే కాకుండా బయటి వారికి అవకాశం కల్పించి మున్సిపల్ ఆదాయం పెంచాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ముజామ్మిల్ఖాన్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
పెండింగ్ పనులు పూర్తి చేయాలి
జిల్లాలో వివిధ ప్రాజెక్టుల భూసేకరణ, పునరావాసం పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలో రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి, జిల్లాలో గల ఇరిగేషన్ ప్రాజెక్టుల నీటి సామర్థ్యం, డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్, వాటి నిర్మాణం, భూసేకరణ, నష్టపరిహారం చెల్లింపు, పునరావాసం ఏర్పాట్లు తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏ ప్రాజెక్ట్ పరిధిలోనైనా ఇంకా భూసేకరణ, పునరావాసం, నష్టపరిహారం చెల్లింపు పెండింగ్లో ఉంటే త్వరగా పూర్తి చేయాలన్నారు.